Monday, November 6, 2023

సర్వాయి పాపన్న గుట్టల రక్షణలో

 సర్వాయిపాపన్న గుట్టల రక్షణలో మీ వైకరి తెలుపండి అంటున్న ప్రజాసంఘాలు.  


     ఆర్థిక సరళీకరణ విధానాల అమలు మొదలైన నాటినుండి అభివృద్ధికి అర్థమే మారిపోయింది. ప్రజలంతా అనుభవించవలసిన సహాజవనరులను అతికొద్దిమందికి రాజ్యం కట్టబెడుతున్నది . పునరుత్పత్తికి అసలే అవకాశం లేని ఆ వనరులను ఏ నియమ నిబంధనలు పాటించకుండా ధ్వంస రచన కొనసాగించి తద్వారా ఉత్పత్తి అయిన వస్తు సంపద కొద్దిమందికి  స్వంత ఆస్తిగా మారిపోతున్న క్రమాన్ని చూస్తున్నాము. ఈ క్రమ లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ప్రభుత్వాలు బడాయిలు పోతున్నాయి. నిజానికి భారత రాజ్యాంగం ఆర్టికల్ 51-A (g) ప్రకారం ప్రభుత్వానికే కాదు ప్రతి పౌరునికి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుతూ దాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉంటుంది. కానీ ఆ కాపాడవలసిన వారు వారి వారి అక్రమ సంపాదన వెంపర్లాటలో మరింత విధ్వంసానికి సహకరిస్తున్నారు. 


ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి ఎటు జూసినా యాబై కిలోమీటర్ల మేర చిన్నా పెద్ద కొన్ని వేల గుట్టలు ఉండేటివి. తెలుగుదేశం, కాంగ్రెస్, ప్రస్తుత బీఆరేస్ సర్కారు వరకు అందరూ ఎవరికి చేతనైనంత మేరకు వాళ్ళు ఈ గుట్టలను హారతి కర్పూరం లా వెలిగించుకొని కరిగించుకొని కాసుల పంట పండించుకున్నవారే. 


అవునూ,  గుట్ట బండలు అమ్ముకొని సొమ్ముజేసుకుంటే ప్రజలకు వచ్చే ఇబ్బందేమిటి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రధానంగా గ్రానైట్ క్వారీలు తవ్వుతున్నప్పుడు చేసే బ్లాస్టింగుల శబ్దాలకు కోతులు, కొండచిలువలు భయపడి పారపోయి వచ్చి ఊర్ల పైన పడుతూ ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పర్యావరణ హితకారులైన పశుపక్షాదులు అయితే  పత్తా లేకుండా పారిపోతున్నాయి లేదా  ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. పంటపొలాలు పాలినేషన్ కు నోచుకోకుండా తాలు తపుకను ప్రసవిస్తున్నాయి , రోడ్లు మొత్తంగా సత్తె  నాశనం అయిపోతున్నాయి. గుట్టలపైకి మేతకోసం వెళ్ళే గ్రామీణ ప్రాంత గొర్రెమేకలకు , పాడి పశువులకు మేత సంగతి దేవుడెరుగు,  మెడలూపుకునే పాటి జాగా కూడా లేకుండా పోయింది. అనాదిగా గుట్టల పైన ఉన్న గుడులను, దేవుళ్ళను, ఆఖరుకు హుస్నాబాద్ మండలం పోట్ల పెళ్లి లోని ఆదిమానవుల సమాధులైన కుచ్చెగూళ్లను కూడా తొలగించివేసినారు. రోడ్లకు అడ్డంగా ఉన్న మత చిహ్నాలను తొలగిస్తే నానాయాగీ చేసే పూజనీయుల చేతులను ఈ అభివృద్ధి నమూనా ఎలాగో కట్టివేయగలిగింది.


మందబలం వందిమాగధుల బలం సమకూర్చుకోవడానికి అక్రమ వ్యాపారవర్గాలు తమ ఈజీ మనితో గ్రామాల్లోని మాటకారులను, దుడుకు స్వభావులను చేరదీసి ప్రశ్నించే వారి నోర్లు మూయిస్తున్నారు.


భారత రాజ్యాంగ 73 వ సవరణ  11 వ షెడ్యూల్ ప్రకారం స్తానీక సంస్తలకు స్వతంత్రంగా  విద్య, వైద్యం, భూమి అభివృద్ధి, నీటిపారుదల, పశుసంపద, చేపల పెంపకం, సామాజిక అడవుల అభివృద్ధివంటి 29 అంశాల పైన నిర్ణయం తీసుకొనే అధికారం ఉంటుంది. తమ పాలనాధికార కాలం లో ఈ గుట్టలకు అనుమతి ఇస్తే పెద్దమొత్తం లో డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న యావలో పడి కొందరు  సర్పంచులు NOC ఇస్తున్నారు. ఊరివారికే లేని పట్టింపు మాకెందుకని మిగతా ప్రభుత్వ శాఖలు ధారాళంగా NOCలు ఇస్తున్నాయి. ఇందులో రెవెన్యూ, ఫారెస్ట్, పురావస్తు , భూగర్భ గనుల శాఖలు ముందు వరుసలో ఉంటున్నాయి. ఈ వ్యవహారం లో ఎక్కడకూడా ప్రజలు అడ్డురాకుండా  పోలీస్ వ్యవస్త తన అధికార బలం తో అడ్డుగా నిలుస్తుంది.


పైగా వనరులను విధ్వంసం చేస్తూ ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఈ గ్రానైట్ క్వారీ తవ్వకాలను  ప్రభుత్వం పరిశ్రమ గా  గుర్తించి బ్యాంకు అప్పుల్లో, విద్యుత్తు లో సబ్సిడీ ఇస్తున్నది. రోజు  లక్షల గ్యాలన్ల నీటిని  ఉపయోగించుకోనిస్తున్నది. ఒకటన్ను బొగ్గు మాడి మసైతే టన్ను కు పైగా కారబండయాక్సైడ్ వదిలి,8000 డిగ్రీల వేడి వదిలి, కొన్ని వేల గ్యాలన్ల నీటిని ఆవిరిచేస్తే  2000 యునిట్ల విద్యుత్ వస్తుంది. అంటే ఒక గ్రానైట్ క్వారీ ఎంతెంత సహజ వనరును ఉపయోగించుకొని ఎవరికి నోట్ల కట్టల పంట పండిస్తున్నది? ఎవరికి అలివిగాని కాలుష్యాన్ని వదిలి పెట్టి ఎవరిని రోగాలకుప్పలుగా మారుస్తున్నదో  అడుగవలిసిన బాధ్యత ఈ సమాజానికి  రాజ్యాంగం కల్పించింది.  


కరీంనగర్జిల్లా సైదా పూర్, సిద్దిపేటజిల్లా హుస్నాబాద్, హన్మకొండ జిల్లా భీమదేవర పల్లి మండలాలను పరివెస్టించుకోని దాదాపు 15000 ఏకరాలల్లో సర్వాయి పాపన్న గుట్టలు విస్తరించి ఉన్నాయి. 17 వ శతాబ్దం లో ఔరంగా జేబు నుండి బహదూర్షా ల పాలన కాలం లో సర్వాయిపాపన్న ఈ గుట్టలశ్రేణి ని రక్షణ స్తావరంగా చేసుకొని మొఘల్ చక్రవర్తుల పక్కలో బల్లెమై  భూమిపై  దళిత బహుజనుల హక్కుకోసం,  రాజ్యాధికారం కోసం పోరాడి ప్రాణమిచ్చిన తొలి తెలుగు ప్రజాస్వామిక విప్లవ వీరుడు సర్వాయి పాపన్న. ఏడంచల రక్షణ వలయం తో గుట్టపైన కోటలు, అతడు పూజించిన బయ్యన్న విగ్రహం, సైన్యానికి యుద్ధవిద్యలు నేర్పిన దండు దిబ్బలో ఇప్పటికీ ఫిరంగి గుండ్లు ఆనవాలుగా ఉన్నాయి.


అలాంటి గుట్టలపై గ్రానైట్ తవ్వకాలకు 2013 లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పాపన్న ఆనవాళ్ళు చెరిగి  పోకూడదని ఆనాటినుండి సర్వాయిపాపన్న గీత కార్మిక సంఘం తో కలిసి స్తానిక ప్రజలు నిర్విరామంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఏదో ఒక దొడ్డిదారిలో గుట్టపైనా పాగావేయడానికి గ్రానైట్ వ్యాపారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న వారు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి 30 సెప్టెంబర్ నాడు రెండువేల మందితో హుజూరాబాద్ పట్టణం లో  ఊరేగింపు జరిపి RDO ద్వారా ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.  


ఈ నేపథ్యం లో సర్వాయి పాపన్న గీతాకార్మిక సంఘం ,  గుట్ట చుట్టూ ఉన్న దాదాపు వంద గ్రామాల ప్రజల ముందు ఒక విజ్ఞాపన పత్రం ఉంచింది. ఓట్ల కోసం మీ ముందుకు వస్తున్న రాజకీయ పార్టీల నేతలతో సర్వాయి పాపన్న గుట్టల రక్షణ కొరకు మన ప్రజల పణాళికనువారు  ఎలా అమలు పరుస్తారో అడిగి  తెలుసుకోండి ఆని కోరుతున్నది. 


1. గుట్టల పైన KG నుండి PG వరకు ఉన్నత ప్రమాణాలతో ఒక విద్యాలయం ఏర్పాటు చేయాలి .

2. ప్రకృతి ఒడిలో ఉన్నత ప్రమాణాలతో Telangana Institution Of Medical Sciences.నెలకొలపాలి  

3. చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు చేరుకోవడానికి గుట్టల శ్రేణి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్.                మరియు ఇంటర్నల్ రోడ్స్  వేయించాలి 

4. ఈ గుట్టలపైన కురుస్తున్న వర్షాలను ఒడిసిపట్టి గ్రావిటీ ద్వారా చుట్టుపట్ల అనేక గ్రామాలకు సాగునీటి , తాగునీటి అవసరాలు నెరవేర్చడానికి వీలైనన్ని చెరువులు నిర్మించాలి. చేపల పెంపకం పరిశోధనా కేంద్రం ఏర్పారు చేయాలి. 

5. గుట్టల చుట్టూ ఉన్న దాదాపు వంద గ్రామాలల్లో లక్ష మంది గీతవృత్తి పై ఆధార పడి జీవిస్తున్నారు. కనుక కల్లుగీత పరిశోధనా కేంద్రం, తాటి, ఈత ఉప ఉత్పత్తుల శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలి. 

6. పండ్ల మొక్కలు, ఔషధ మొక్కల పెంపకం మరియు పరిశోధనా కేంద్రం ఏర్పాటుచేయాలి. 

7. గుట్టల చుట్టూ ఉన్న వేలాది గోళ్లకుర్మ ల జీవనోపాధి ప్రమాణాల మెరుగు దలకు గొర్రె మేకల ఆవుల, రోగనిర్ధారణ  పరిశోధనా కేంద్రం మరియు పశువైద్య విద్యాలయం నెలకొలపాలి. 

8. చర్మకార పరిశోధనా కేంద్రం ఏర్పాటుజేసి తొలువస్తువుల తయారీ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలి. 

9. రాయికల్ జలపాతం, మొయిన్ చెరువు, సర్వాయిపేట కోట, గుట్టపైన ఉన్న కోట అన్ని కలిపి టూరిజం కేంద్రం గా అభివృద్ధి పరుచాలి. 


వీరగొని  పెంటయ్య  సర్వాయి పాపన్న గీతకార్మిక సంఘం వ్యవస్తాపక అధ్యక్షులు 

సింగం సత్తెయ్య గౌడ్  రాష్ట్ర అధ్యక్షులు 

గణగాని సత్యనారాయణ గౌడ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు 

సంపునూరి మల్లేశం గౌడ్ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ 

కోడూరి పరశురాములు గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు 

మేడగొని బుచ్చయ్య గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. 

మండల జంపయ్య చేర్మన్ బయో డైవర్సిటి కమిటి తెలంగాణ. 

  


Friday, December 23, 2022

Democracy- Elections.

                                                     ప్రజాస్వామ్యం - ఎన్నికలు . 



ఆకుల భూమయ్య 9 వ వర్దంతి సందర్భంగా కరీంనగర్ ఫిలిమ్ భవన్ లో ఈ రోజు 23 డిసెంబర్ నాడు సంస్మరణ సభ జరిగింది. ఆకుల భూమయ్య భూమయ్య పెద్దపల్లి జిల్లా కాచాపూర్ లో 1950 లో జన్మించారు. ఆయనకు బుద్ధి తెలిసే నాటికి రాజ్యాంగం లో చెప్పిన హామీలు నెరవేర్చ బడక దేశ నలుమూల ల అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్న రోజులు. ఆయన పదో రతరగతి లో ఉన్నప్పుడే శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటాలు తెలుసుకున్నాడు. కాచాపూర్ లో పాలేరుల దీనస్తితికి స్పందించి వారి జీతాలు పెంచాలని,తమ కుటుంబాన్ని కూడా కోరిన వాడు.  అప్పటి పోచం పాడ్ ప్రాజెక్ట్ కాలువలు తవ్వే కూలీలకు అంబలి పంపకం వారి పసి బిడ్డలకు చలువ పందిర్లు వేయించిన పోరాట శీలి. 1969 లో తొలి తెలంగాణ పోరాటం లో పాల్గొన్నాడు.  ఎమర్జెన్సీ కాలం లో జైలు జీవితం గడిపి  విడుదల అయి వచ్చిన తర్వాత విద్యారంగం లో ఉన్న అవినీతి ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఉద్యమం నిర్మించాడు. తన తో బాటు ఉపాధ్యాయ ఉద్యమం లో పనిజేస్తున్న మిత్రులకు మనం కేవలం మన జీతాభత్యాల కోసం ఆర్థిక పోరాటాలు చేయడం కాదు, అశేష ప్రజల సమస్యల పరిష్కారం తోబాటే  ఉపాధ్యాయుల సమస్యలు  కూడా పరిష్కారం అవుతాయన్న ఎరుకను కలిగి ఉండాలని బోధిస్తూ వచ్చాడు. 1989 నుండి మలిదశ తెలంగాణ ఉద్యమం లో చాలా చురుకుగా పాల్గొన్నాడు. వరంగల్ డిక్లరేషన్ తర్వాత ఏర్పడ్డ తెలంగాణ జనసభకు అధ్యక్షుడు.ఆ నాటి TDP ప్రభుత్వ ప్రధాన మద్దతు దారు అయిన రామోజీ రావు ,తెలంగాణ రాకుండా అడ్డుకొనే ప్రయత్నం లో  తన స్వంత పత్రికలో అయిన ఈనాడు దినపత్రిక  లో తెలంగాణ  జనసభ మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్త  ఆని విపరీతంగా అసత్య  ప్రచారం చేసిన కారణంగా తెలంగాణ జన సభ నిషేధానికి గురైంది. తనతో బాటు గా పనిజేస్తున్న బెల్లి లలిత, కనకా చారి, అలుగుబెల్లి రవీందర్ రెడ్డి లాంటి వారు చంద్రబాబు సర్కారులో హత్యలకు గురవు తుంటే అదురక బెదురక ప్రజాస్వామిక తెలంగాణ కొరకై పోరాటాన్ని కొనసాగించాడు. TJS నిషేదం అనంతరం తెలంగాణ ఉద్యమం ఆగిపోకూడదన్న  తపనతో తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు జేసి పోరాటం కొనసాగించాడు. దానిపైన కూడా నిర్బంధం పెరిగి న తర్వాత తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేశాడు. దానికి చేర్మన్ బాధ్యతాల్లో ఉండగా ఒక అనుమానాస్పద రోడ్డు ప్రమాదం లో 24 డిసెంబర్ 2013 నాడు దుర్మరణం పాలయ్యాడు. 


ఆయన యాదిలో ఈ రోజు ప్రజాస్వామ్యం- ఎన్నికలు అన్న అంశం పైన  ఒక చర్చా కార్యక్రమం జరిగింది. ఆయన తో బాటుగా తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న అనేక మంది సహచరులు, ఆయన కుటుంబ సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఎన్నికలు ఎంత లోపభూయిస్టంగా  జరుగుతున్నాయో చర్చించారు.  ఎంత ఏక పక్షంగా, ఎంత డబ్బు, మద్యం, పవర్, జులుం తో నిర్వహించ బడుతున్నాయో చెబుతూ ఆవేదన చెందారు. అక్కడ హాజరైన దాదాపు యాబై మంది  విద్యావంతులు , ఆలోచనా పరులు  భారత పౌరులుగా తమ  బాధ్యతగా ఎన్నికలు అవినీతి రహితంగా జరుగడానికి   కొన్ని సూచనలు చేశారు.


1. చీఫ్ ఎలక్షన్ కమిషన ర్ గా  అధికారం లో ఉన్న ప్రభుత్వం తనకు అనుకూలురు అయిన వారిని నియమించుకొని  లబ్ధి పొందుతున్నది. కనుక ప్రధానితో బాటుగా ప్రధాన ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో సీనియర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి ,  ఒక రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి, వంటి వారితో ఒక కోలీజియం ఏర్పాటు జేసి ఆ కోలీజియం సూచన మేరకు చీఫ్ ఎన్నికల కమిషనర్ ను నియమించాలి. 


2. కార్పొరేట్ సంస్తలు ప్రభుత్వాన్ని తమకు అనుకూలమైన చట్టాలు తేవడానికి ఎన్నికల బాండ్ల ద్వారా లాబీయింగ్ కు పాల్పడి వారికి అనుకూలంగా చట్టాలను  చేయించు కుంటున్నారు. . కనుక ఎన్నికల ఫండు , చందాల సేకరణ ను నిషేధించాలి. 


3. వితీన్ ద పార్టీ లో ఎన్నికలు జరిపి ఆ పార్టీ సభ్యులు ఎవరిని అభ్యర్థిగా గెలిపిస్తామని చెబితే వారికే ఆ పార్టీ టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టాలి. 


4. EVM ల పైన అనేక మంది అభ్యంతరాలు చెబుతున్నారు. సాంకేతికంగా ఎంతో అభివృధ్ధి చెందిన  అమెరికా లాంటి  దేశం లో కూడా బ్యాలెట్ పత్రాలనే  ఉపయోగిస్తున్నారు. త్వరగా ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుందన్న ఏకైక కారణం తో EVM లు వాడుతున్నారు. కానీ అంత కంటే ఎక్కువ ఆలస్యానికి కారణమ య్యే టట్టుగా ఒక రాష్ట్రం లో దఫా దఫాలు గా ఎన్నికలను నెలల తరబడి నిర్వహిస్తున్నారు. కనుక ఎవరికీ అనుమానం లేని విధంగా బ్యాలెట్ పత్రాలు ఉపయోగవంచాలి. 


5, మానిఫెస్టో లో చెప్పిన అంశాలను అమలు పరుచని యెడల న్యాయస్తానా లల్లో ప్రశ్నించే విధంగా చట్టాలు చేయాలి.


6. చట్ట సభకు ఎన్నికైన అభ్యర్థి రాజీనామా చేసిన యెడల మళ్ళీ అక్కడ బై ఎలక్షన్లు పెట్టవద్దు.మిగిలి ఉన్న కాలానికి  ఆ ప్రజల బాగోగులు చూడడానికి ఆ జిల్లా లేదా ఆ నియోజక వర్గ  ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలి.  


7.  ఒక పదవిలో రెండు సార్ల కంటే ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉండకూడదు. 


8. ఏదేని నియోజక వర్గం ఒక సారి ఎస్సీ, లేదా ఎస్టీ కి రిజర్వ్ చేయబడితే అది ఎప్పటికీ అలాగే కొనసాగ కూడదు. రొటేషన్ పద్దతి లో సాగాలి. 


9. చట్ట సభలకు ఎన్నికయిన వారు, వారి  పదవీ కాలం ముగియకుండానే రాజీ నామా చేసిన యెడల అట్టి వ్యక్తికి వెంటనే ఆ  ఉపఎన్నికలో పాల్గొనే అవకాశం ఉండకూడదు.


10. ఆ నియోజక వర్గ ప్రజలు తాము ఎన్నుకున్న  ప్రతినిధి తమకు   సరైన న్యాయం చేయడం లేదని  భావించి నపుడు రీకాల్ చేసే అవకాశం ఉండాలి. 


11. ఒక ఎంపి ఎన్నికల ఖర్చు 75 నుండి 95 లక్షలు  ,   ఎంఎల్ఏ ఎన్నికల ఖర్చు 28 లక్షలు చేయాలని చట్టం చెబుతున్నది. . కానీ ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతున్నాయో చూస్తున్నాము. లక్షల్లో ఉన్న పరిమితిని మించి కోట్లల్లో, పదుల కోట్లల్లో, వంద కోట్లల్లో, వందల కోట్లల్లో పార్టీలు ఖర్చు చేస్తుంటే నిఘా సంస్తలు కండ్లు మూసుకొని ఎందుకు ఉంటున్నాయి? కనుక నిఘా సంస్థలు మరియు  వారు ఖర్చు చేస్తున్న డబ్బు ను ఆడిట్ చేస్తున్న వ్యవస్త ఖచ్చితంగా ఉండాలి,


12. PM, CM లు చాలా ఎన్నికల మీటింగుల్లో ప్రజల సొమ్ముతో పాల్గొంటున్నారు. వీరు పాల్గొనే మీటింగుల పైన నియంత్రణ ఉండాలి. 


13. క్రిమినల్ కేసుల అభియోగాన్ని ఎదురుకుంటున్న ఎవరైనా ఎంతో కొంత కాలం జైళ్లల్లో నిర్బంధించబడి తమ వ్యక్తిగత స్వేచ్చా స్వాతంత్రాలను కోల్పోతున్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం ఏ అభ్యంతరం లేకపోవడం సహేతుకంగా లేదు.  శిక్ష పడనంత వరకు ఎవరైనా నిర్దోషే అన్న కారణం తో ఎందరో క్రిమినల్స్ చట్టసభకు వస్తున్నారు. అలా రాకుండా కట్టడి చేయాలి. 


 ఇలాంటి మరికొన్ని సూచనలు వచ్చినాయి. 


ఇటువంటి చర్చలు విస్తృత స్తాయిలో జరుగాలి ఆని సభికులు సూచన చేశారు. ఎక్కడికక్కడ పౌర సమాజం ముందుకు వచ్చి ఇలాంటి చర్చా కార్యక్రమాలు చేపట్టాలని  సభ్యులు సూచించారు. రాజ్యాంగం ప్రజలందరికీ అర్థమై రాజ్యాంగ హక్కులు అందరికీ కలిపించాలని , రాజ్యాంగం మేరకు పాలన చేయండని ప్రజలు ప్రశ్నించే కైతన్యం కలిగిన  నాడు ఏ ప్రభుత్వమయినా ప్రజల మాట వినక తప్పదు ఆని అంబేడ్కర్ అంటాడు. 



మీటింగ్ కన్వీనర్ 


వీరగొని  పెంటయ్య 

ఆకుల భూమయ్య ఉద్యమ సహచరుడు.  



 


Monday, December 19, 2022

ఉచితాలు అనుచితాలేనా?

                                                      ఉచితాలు అనుచితాలేనా ?  


ఈ మధ్య కాలం లో కేంద్ర పెద్దల నోట ఉచితాలు దేశానికి చాలా  హాని చేస్తాయనే మాట విరివిగా వినబడుతోంది. నిజానికి పేద ప్రజలకు ఇచ్చే రాయితీలు ఆయా సర్కార్లు ఏందుకు ఇస్తున్నారో, ఎవరి అవసరం కోసం ఇస్తున్నారో  ఒకసారి  చూద్దాం.


 భారత రాజ్యాంగం లోని మొట్టమొదటి వాక్యం WE, THE PEOPLE OF INDIA, having solemnly resolved to constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC and to secure to all its citizens:. సోషలిస్ట్ అనే పదం సొసైటీ లో ప్రజలందరికీ సమాన అవకాశాలు, ప్రజలందరూ సమానం అనీ, డెమోక్రటిక్ అనే పదం ప్రజాస్వామ్య అనే మాటను, సెక్యూర్ అనే పదం ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ భద్రత అనే విషయాలను  చెబుతున్నాయి. . ఇప్పటికీ ఈ దేశం లోని ప్రజలందరికీ సమాన అవకాశాలు గానీ, సంపద సమాన  పంపిణీ గానీ లేదు. ఒక అడ్డా కూలి దినమంతా పనిజేస్తే సాయంత్రానికి ఒక 600 నుండి 800  రూపాయలు పొందుతాడు. అదే ఒక చట్ట సభ ప్రతినిధి ఏడాది పాటు ఒక్క రోజు కూడా చట్ట సభలో కూర్చోకున్నా కూడా  నెలకు లక్ష నుండి రెండు లక్షల రూపాయల జీతం పొందుతున్నాడు. అలాగే ఒక ఉద్యోగి 30 సంవస్తారాలు సర్వీస్ చేసినా పెన్షన్ ఉండదు, కానీ ఒక సారి ఎన్నికల్లో గెలిచి ఐదు సంవస్తారాల కాలం లో ఆయన ప్రజలకు చేసే సేవ ఏమీ ఉండకపోయినా , లక్షలాది రూపాయల జీతాభత్యాలు, ఉచితాలు ఎన్నో పొందిన తర్వాత కూడా నెలా నెలా పెన్షన్ పొందుతాడు.  


ఒక పార్లమెంట్ మెంబర్ ప్రతి నెల 2,70,000/- రూపాయల వేతనం తో బాటు గా పార్లమెంటు సెషన్స్ జరిగితే ఆయన సిటింగ్ చార్జెస్ ఉంటాయి. రకరకాల అలవెన్స్ లు అనేక ఉచితాలు అంటే విమాన ప్రయాణం, రైలు ప్రయాణం, హై క్లాస్ మెడికల్ సౌకర్యాలుంటాయి.   ఇందులో కొన్నింటి పైన టాక్స్ కూడా ఉండదండోయ్.  ఇంత సంపన్నులకు ఏమో టాక్స్ ఫ్రీ అట. అలగే పెద్దమొత్తం పో పెన్షన్ తో బాటు గా చాలా సౌకర్యాలు ఉచితంగానే పొందుతారు. ( గూగుల్ లో చూడవచ్చు) 


  ఇక తెలంగాణ MLA లు సంవత్సరం  లో ఒక్క రోజు కూడా అసెంబ్లీ కి హాజరు కాకున్నా కూడా నెలకు 2,68,000( source telangana legislature webcite ) జీతం తీసుకుంటారు. పెన్షన్ తక్కువకు తక్కువ నెలకు  50,000/- ఎక్కువకు ఎక్కువ 75,000/- పొందుతున్నారు.( దక్కన్ క్రానికల్ న్యూస్ మార్చి 2021) .


గద్దెల పై కూర్చున్న ఈ పెద్దలు తీసుకుంటున్న సొమ్మంతా నువ్వూ నేను పేద ప్రజలంతా వినియోగించే ప్రతి వస్తువు పైన విధించే పన్నుల నుండి వసూలు చేస్తున్న సొమ్ముల నుండే.  దినకూలి వేతనం ముప్పై రోజులు కస్టపడితే 18000 నుండి 24000 వరకు పొందగలిగితే ఒక ప్రజా ప్రతినిధి చుక్క చెమట కారకుండా ఒక్కరోజు కూడా పనిచేయక పోయినా కూడా నెలకు 2,68,000 రూపాయల వేతనం  పొందుతాడు. ఆయన పదవీ కాలం లో తన తర తరాలు తిన్నా తరుగనంత ఆస్తులు కూడబెట్టుకుంటాడు.   ఇక ఇంట్లో కూర్చుంటే నెలా నెలా  50,000 నుండి 75,000 రూపాయలు అప్పనంగా పెన్షన్  తీసుకుంటాడు . కానీ  అదే ఒక  దినసరి కూలికి ఆయన  కుటుంబం లో ఒకరికి 2000 రూపాయల నెల సరి పెన్షన్ ఇస్తే మాత్రం  ఇంత ఏడుపా ? 


ఇక వీరు కార్పొరేట్ కంపనీలకు ఇస్తున్న ఉచితాల గురించి చూద్దాం. కరోనా కాలం లో పనులు లేక ప్రజల వద్ద డబ్బులు లేక కొనుగోలు శక్తి కోల్పోయిన పరిస్తితి లో అమెరికా లాంటి దేశం లో ప్రభుత్వం నేరుగా  ప్రజల, ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమజేస్తే భారత ప్రభుత్వం మాత్రం ప్రజల తో నేరుగా సంబంధం లేని  కార్పొరేట్ కంపనీలకు డబ్బులు ఇచ్చింది.


అలాగే ఈ మధ్య కాలం లో బ్యాంకులను ముంచి దేశం విడిచి వెళ్ళిపోయిన నీరవ మోడి, ఆయన భార్య అమీ మోడి, నీషా మోడి, లలిత మోడి, మహుల్  చోక్సీ , విజయ్ మాల్యా లాంటి వాళ్ళు 29 మంది మన దేశం లో బ్యాంకులలో సామాన్య ప్రజలు దాచుకొన్న 40,000 కోట్ల రూపాయలను  బ్యాంకులకు ఎగవేసి పోయారు. అయినా దేశానికి ఏమీ నస్టం లేదట. పేద ప్రజలకు ఏమైనా ఉపకారం జరిగితే మాత్రం మహాపరాధం జరిగిపోయి దేశం దివాళా తీస్తుందట. వాళ్ళ దృస్టీలో దేశం అంటే కెవలం కొద్ది మంది  పెట్టుబడి దారులు, కార్పొరేట్ కంపనీల వాళ్లేనా?   


నిన్న 12 డిసెంబర్ 22 నాడు పార్లమెంట్ లో స్వయంగా  ఆర్థిక మంత్రి ఈ మూడు సంవత్సరాల కాలం లో ఆరు లక్షల కోట్ల ఋణాలు  మాఫీలు చేసినట్లు తెలిపింది. మొత్తం పైన గత ఐదు   సంవస్తరాల  కాలం లో బడా బాబులకు కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన నజరానా ఏమిటంటే ,  9,91,640 కోట్ల రూపాయల ఋణ మాఫీ చేసింది. ఇందులో విల్ ఫుల్ డీఫాలటర్స్  అంటే ఉద్దేశ పూర్వకంగా ఎగవేత దారులు 10,306 మంది ఉన్నారట . అంటే పదివేల మంది దొంగలకు కేంద్ర ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పనంగా దోచి పెట్టామని నిర్భయంగా  ప్రకటిస్తున్నది. ఈ ఋణ మాఫీ పొందిన వారిలో ఎవరైనా పేద వారు ఉన్నారా? అంతా వేలాది కోట్ల సంపద అనుభవిస్తున్న వారే కదా?  ప్రభుత్వం చేసిన ఈ చర్య  ఏ దేశ అభివృధ్ధికి తోడ్పడు తుందని అడిగే చైతన్యం ఈ దేశ పౌరులకు ఎలాగూ లేదన్న ధైర్యం తోనే కదా దాన్ని ప్రస్తావించకుండా దాని ఊసు ఎత్తనీయకుండా పేదలకు ఇచ్చే రెండు రూపాయల కిలో బియ్యం రెండు  వేల వృద్ధాప్య పెన్షన్, చిన్న పిల్లల మధ్యాహ్న భోజనాన్ని, పేదల కళ్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్, పేద విద్యార్థుల ఫీజు రీ ఎంబర్స్ మెంట్ , ఆరోగ్య శ్రీ, గొర్రె,  బర్రెలకు ఇచ్చే చిరు ఆసరాల వంటి ప్రజలకు అంతో ఇంతో ఆసరా అవుతున్న   పథకాలను వద్దని వారిస్తున్నది.దళితులకు బాహుజనులకు ఏ కాసింత మేలు జరిగినా అన్యాయం జరిగి పోతున్నదని పెద్ద గొంతెసుకొని లేస్తున్నారు. ఈ ఐదేళ్ల కాలం లో 10,40,000 /- కోట్ల రూపాయలు కొందరు పెద్దల వెసులుబాటు కోసం ప్రజలనుండి పన్నుల రూపం లో సేకరించిన సొమ్ములను ఖర్చు చేసిన దాంట్లో పేద ప్రజలకోసం వెచ్చిస్తున్న సొమ్ము ఎన్నో వంతు ఆని ఎందుకు నోరున్న మేధావులు అడుగలేక పోతున్నారన్నది ప్రశ్న. రాఫెల్ యుధ్ధ విమానాల నుండి, విమానాశ్రయాల కేటాయింపుల నుండి, PSU ప్రైవేటీకరణ దాకా ఎన్నెన్ని కోట్ల సొమ్ము ఎవరి ఖాతాలోకి వెళ్ళిన లెక్కలు అడుగకుండా ఉండే దానికే కదా పేదల ఉచితాల గురించి పెద్ద రచ్చ చేస్తున్నది. 


 పేదల ఉచితాల గురించి  ఉపాధ్యాయుల్లో కూడా కొంత మంది అవును కదా ఆని ముక్కున వేలేసుకుంటున్న వారు కూడా ఉంటున్నారు.  దానికి  నిదర్శనమే కదా ఈ మధ్యన ఏదో ఒక పాఠశాలలో ఉపాధ్యాయులు తమ విద్యార్థులతో ఉచితాలు ప్రజలను సోమరులుగా , సమాజానికి చేటు చేసే వారీగా తయారు చేస్తున్నాయని తమ దేశ భక్తి ని ఘనంగా చాటు కొని నాటకం వేయించారు . 1985 నుండి 1995 కాలం లో  మిత్రుడు జనార్ధన్ రెడ్డి పిన్నీసు పల్లి కాయ నాటకం వేసి ప్రజల , రైతుల, కస్ట జీవుల పక్షాన ఉపాధ్యాయులు మేధావులు నిలువాలి అనే నినాదం ఇస్తూ  వీధినాటకాలు వేస్తే ఇప్పుడు కొందరు  ఉపాధ్యాయులు మాత్రం ,  ప్రభుత్వం పక్షాన నిలబడి  ప్రజలను నోళ్ళు  మూయించే కార్యక్రమాలు చేస్తున్నారు. 


ఉపాధ్యాయులు గా మనం ఎంతో కాలం నుండి బోధిస్తున్నది,  రైతులు, కార్మికులు, ఉత్పత్తిలో భాగస్వాములు అయ్యేవారంతా  సంపద సృస్టి కర్తలు ఆని చెబుతూ వస్తున్నాము. కానీ చిత్రంగా ఈ మధ్యన పెద్దల నోటివెంట కార్పొరేట్ దిగ్గజాలను  సంపద సృస్టికర్తలు ఆని పొగుడుతున్నారు. నిజానికి వాళ్ళంతా కడుపులో చల్ల కదులకుండా శ్రమయజీవులు  సృస్టిస్తున్న అదనపు విలువను లాభం పేరుతో అప్పనంగా తమ ఖాతాలో జమ చేసుకుంటున్న దోపిడీ దారులు. 


ఇంకా ముందుకు పోతే ఈ దేశం లో కులాలు ఉన్నది వాస్తవం. అత్యధిక సంఖ్యలో శూద్రులు అంటే ఈ నాటి భాషలో బాహుజనులు ఉన్నారన్నది వాస్తవం. వీరిలోనే అత్యధికులు పేద వారీగా, బిలో పావర్టీ  లైన్ లో ఉన్నారన్నది కూడా  వాస్తవం. వారే అలా ఏందుకు ఉన్నారని లోతుల్లోకి వెళితే ఐదువేల ఏండ్లు గా ఈ దేశం లో ప్రజలందరూ సమానం కాదు కొందరు ఎక్కువ, కొందరు తక్కువ , అది జన్మ తహా వచ్చిన లక్షణం అనే  మనువాదం అమలులో ఉండి శూద్రులకు ఆస్తి హక్కు, ఆయుధ ధారణ హక్కు, అక్షరాలు నేర్చుకునే హక్కు వంటి అనేక స్వేచ్చా స్వాతంత్రాలతో జీవించే హక్కులు  తిరస్కరించ బడ్డాయన్న వాస్తవాన్ని అర్థం చేసుకుంటే,  ఈ బాహుజనులకు ఈ దేశం లో ఫూలే అంబేద్కర్ ల దాకా  విద్య ఎందుకు లేకుండేనో,  ఆత్మ గౌరవ చిహ్నమైన భూమి చెక్క ఎందుకు దక్కకుండా పోయిందో, , ఉత్పత్తి సాధనాలైన భూమితో బాటుగా పరిశ్రమలు, పెట్టుబడి వీరివద్ద ఎందుకు లేకుండా పోయిందో  అనే విషయాలు  అర్థం అయితే గానీ ఈ వర్గాలకు సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా సరైన  ప్రాతినిధ్యం లభించలేదన్న విషయం అర్థం అయితే గానీ వీరికి రాజ్యాంగం లో రాసిన విధంగా ప్రజాస్వామిక హక్కులు, అందరితో బాటుగా  సమానంగా జీవించే హక్కు  కలిగించాలంటే కొన్ని రిజర్వేషన్లూ,కొన్ని రాయితీలు కల్పించక తప్పదు అన్న విషయం అర్థం అవుతుంది. 


పది లక్షల కోట్ల రూపాయల సంపదతో ఇవ్వాల ప్రపంచం లో మూడవ అత్యంత సంపన్నుడుగా ఆదాని ఎదుగడానికి  క్రోనీ క్యాపిటలిజం కారణం కాదా? లక్షలాది కోట్ల ఎన్నికల బాండ్లు ఎవరి ఖాతాలో పడుతున్నాయి, ఏందుకు పడుతున్నాయి? నీవు నాకు అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అ ని ఇచ్చి పుచ్చకుకొనే విధానం కొనసాగడం లేదా? పసుల కొట్టం లో ఉలువ పప్పు, తెలుక పిండి ని ఆవులు గేదెలు ఆవురావురు మనీ తింటా ఉంటే కోడి పిల్లలు వచ్చి చిన్న ముక్కను  ముక్కున కరుచు పోయే ప్రయత్నం చేస్తే ఏయ్ అటేటు పో అని పసులు  కొమ్ములు ఊపినట్టు చేస్తున్నాయి పెద్ద తలుకాయలు. 


     క్యాపిటలిజం కన్నబిడ్డలు అయిన ప్రపంచ బ్యాంకు, WTO ల  షరతుల మేరకే భారత దేశ పెద్దలు ఇలా మాట్లాడుతున్నారన్న విషయం  మనం ఒక సారి 1991 లోకి వెళ్తే అర్థం అవుతుంది.  గాట్ ఒప్పందం పైన సంతకాలు చేసిన దేశాలు గ్లోబలైజేషన్ లో భాగంగా రైతులకు సబ్సిడీలు ఇవ్వకూడదనీ, ఉచితాలు ఏవీ కూడా ప్రజలకు ఇవ్వవద్దనీ ఆనాడే ప్రపంచ బ్యాంకు షరతులు విధించింది. లిబరలైజేషన్ రెండవ ఫేజ్ ను  ఇవ్వాల భారత ప్రభుత్వం  చాలా నిర్మొహ మాటంగా  అమలు చేస్తున్నది. ఆ  విధానం లో భాగంగా ఈ రోజు డిల్లీ పెద్దలు ఈ మాటలు మాట్లాడు తున్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకొకుండా ప్రజలకు ఇచ్చే చిన్న చిన్న వెసులు బాటులను  ఫ్రీ బీస్ ఆని నిందిస్తూ , అవి  ప్రజలను సోమరి పోతులుగా చేస్తున్నాయి  అని వీల్లు  ఎందుకు  ఆడి  పోసుకుంటున్నారో అర్థం కాదు. 


1980 ప్రాంతం లో మంథని హైస్కూల్ లో ఇద్దరు విద్యాలు హాస్టల్ లో ఉంటూ చదువుకొనే వారు. వారు ఒకసారి వారి హక్కుల గురించి కొందరు విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. వారిని అరెస్ట్ చేసిన అప్పటి  పోలీస్ అధికారి చౌదరి గారు, 

“ ఆరేయ్ పొర గాండ్లు , సర్కారు మీకు ఉచితంగా , పండుకొను హాస్టల్ వసతి ఇస్తున్నది, ఉచితంగా అన్నం పెడుతున్నది, పుస్తకాలు, బట్టలు ఇచ్చి ఉచితంగా చదివిస్తున్నది. ఇంకా మీకు ఏమి కావాలి రా? “ ఆని బెదిరించే ప్రయత్నం చేసిండు. 


“ సార్, మాకు ఇంకా రావాల్సినయి చాలా ఉన్నై సార్. అయ్యన్ని మావి మాకు వచ్చేదాకా మేము కోట్లాడుతనే ఉంటాం . అయ్యన్ని   అచ్చే దాకా మా తర్వాత వచ్చే టోల్లు  గూడా కోట్లాడుతనే ఉంటరు సారు . మీరెంత కొట్టుకుంటారో ఏమి చేసుకుంటారో మీ ఇస్టం” అని అప్పుడు ఆ విద్యార్థులు  చెప్పిన  మాటలు ఇప్పటికీ  యాదికి వస్తున్నై . చైతన్య వంతమైన ఉపాధ్యాయులు ఆ విద్యార్థుల ఆకాంక్షల కొనసాగింపుకు మద్దతుగా నిలువాల్సిన అవసరం ఉంది. అందుకోరకు  అవసరమైన ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరాన్ని సమాజం కోరుతున్నది.    


వీరగోని పెంటయ్య 

విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి. 

కరీంనగర్. 

9908116990. 



Tuesday, November 9, 2021

                                 కనిపించని ఆ శత్రు వెవరు ?


ఈ దేశం లో ఇంకా మెజారిటీ ప్రజలు గ్రామాలల్లోనే జీవిస్తున్నారు. వారంతా దాదాపుగా వ్యవసాయం పైననే ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపుగా 1980,90 దాకా  భూస్వాములు ,దొరలు, ఊరిలో తమ అధికారం చెలాయించేవారు. అణిచివేతకు గురవుతున్న వారికి తమ స్తితికి కారణం ఎవరో ఎదురు గుండానే కనిపించే వారు .


 కానీ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, పీవీ నర్సింహారావ్ ప్రధానమంత్రి గా నూతన ఆర్థిక విధానాలు అమలు జరిపిన తర్వాత పరిస్తితిలో మార్పు వచ్చింది. మన తెలంగాణ లో అయితే వామపక్ష ఉద్యమాల ఫలితంగా దొరలు గ్రామాలు విడిచి పట్టణాలకు వలసలు పోయి  తమ వద్ద ప్రోగుపడి ఉన్న సంపదలతో  అక్కడ తమ వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకున్నారు.  కొంత కాలం వరకు భూములు బీడుబడిపోయి గ్రామీణులకు ఉపాధి దొరుకక తమ దీన స్తితికి దొరలు లేక పోవడమే కారణం అనుకున్నారు. లబ్ధ ప్రతి స్టులైనా కొందరు  కథకులు దానికి అనుకూలంగా కథలే రాసిపడే శారు. తరువాత తరువాత కొంత భూమి స్థానిక రైతుల చేతుల్లోకి మారింది. కానీ రైతులకు అర్థం కానీ విధంగా గిట్టుబాటు ధర లభించక పరిస్తితి  పెనేం  లో నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారిపోయింది. ఫలితంగా రైతు ఆత్మ హత్యలు పెరిగి పోయాయి. అందుకు కారణం ఎవడో రైతుల ముందు కనిపించడం లేదు. శత్రువు అదృశ్యం అయిండు. ఎవని తో పోరాడాలో అర్థం కానీ  పరిస్తితి. ప్రభుత్వాలతో పోరాడితే, కొన్నీ పంటలకు  మద్దతు ధర అన్నాయే కానీ గిట్టుబాటు ధర ఊసే లేదు. వామ పక్ష పార్టీలు సైతం తమ పోరాట బాణాలు ప్రభుత్వాల పైననే ఎక్కుపెట్టారు కాని అసలైన కారణం, ప్రభుత్వాలతో బాటు  పెట్టుబడి దారి విధానం అంటూ పోరాడే శక్తులకు అర్థం చేయించ లేక పోయారు. 


మొత్తం సమాజాన్ని చైతన్యవంతం చేయగలిగిన మంచి ఆయుధం అయిన విద్య ఇప్పుడు పెట్టిబడి దారుల చేతిలో పడి వారికి నైపుణ్యవంతమైన నౌకరీ గాళ్లను తయారుజేసే పనిలో తలమునుకలై ఉంది. సమాజం కూడా పోటీ పడి తమ పిల్లలు IIT, NEET, CIVILS, వేటలో పడి పెట్టుబడి కొరల పండ్లు దోమి ఎంతో కొంత మెరుగైన జీవితం అనుభవించాలే అన్న యావలో పడి కిందామీదా కొట్టుమిట్టాడుతున్నారు. 


ఇక వైద్యం కూడా చాలా పిరపు సరుకు అయిపోయింది. ముందుగా పేదలకు బల వర్ద కమైన ఆహారం లభించే పరిస్తితి లేదు. సమీకృత ఆహారం అంటే ఇంకా ఎందరికో తెలియని స్తితి. దానికి తోడు మల్టీ నేషనల్స్ ధనదాహం తీర్చే కొరకు వచ్చిన రసాయనిక ఎరువులు,పురుగు మందులు, హైబ్రిడ్ కల్తీ విత్తనాలు, కాలుష్యం అన్నీ కలిసి మనుషుల  శరీరాలను రోగ గ్రస్తం చేస్తున్నాయి. 


ప్రజలు తాము సంపాదిస్తున్న సంపాదనలో సింహా భాగం విద్య,వైద్యం, పిల్లల ఉద్యోగాల కోచింగ్ ల కోసం ఖర్చు చేస్తున్నారు. పారిశ్రామిక విప్లవ ప్రారంభం లో పెట్టుబడి ఉద్యోగాలను సృస్టి కి దోహద పడి, పెట్టిన పెట్టుబడి పైన వచ్చే లాభాలతో  ఉద్యోగులకు బోనస్, ప్రభుత్వాలకు పన్నులు కట్టేవి.  కానీ ఇప్పుడు పెట్టుబడి అలా చేయకుండా తమ సంపద పెంచుకోవడానికి పోటీ పడి క్రోనీ కాపిటల్ ను తాయారు చేసుకుంటున్నది. ఒక కంపనీ పెట్టి దానిపైన బ్యాంకు నుండి అప్పు తీసుకుంటుంది. ఆ కంపానీకి మార్కెటింగ్ కోసం మరో సంస్త ను తెరుస్తుంది. మొదటి కంపనీకి నస్టాలు చూపి బ్యాంకు అప్పు ఎగగొడుతుంది. ఇలాంటి జిమ్మిక్కులు ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం పైన పెట్టుబడి దారుల సంపద దినదినం  కోట్లల్లో పెరుగుతుంటే ప్రజల పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, అను త్పా దక సైన్యం ( Useless Force), అంతకంతకూ పెరిగి పోతున్నది.కారణం ఏమిటి? ఎవ్వరు అనేది ప్రజలకు అర్థం కావాల్సి ఉంది.  


ఒక నాడు ప్రజలకు తెలియని సంస్కృతం ప్రజలను  ఏలింది, ఇంగ్లీష్ కొన్నాళ్ళు, ఇప్పుడు భాషలు పోయి టెక్నాలజీ, ఆర్థిక శాస్త్రం కలగల్సి ప్రజలను అవిద్యావంతులను చేస్తున్నది.    చదువులు వస్తే ఏలికలను ప్రశ్నిస్తారని, చదవునుండి దూరం చేశారు. ఆ తర్వాత ఆధునిక  టెక్నాలజీ అందరికీ అందని ద్రాక్షను చేశారు. ఆర్థిక శాస్త్రం అయితే అర్థం కానీ బ్రహ్మ పదార్థాన్ని  చేశారు. కనుక  ఇప్పుడు ఆర్థక శాస్త్రం మూలాలను అందరికీ అర్థం అయ్యే విధంగా సులభ గ్రాహ్యం చేసి , ఏలికలు , పెట్టుబడి కలగలిసి ప్రజలను ఎలా గొర్రెలుగా చేసి వేటాడి తింటున్నాయో ప్రజలకు తెలియ జెప్పి ,  తమ అవిద్యకు , అనారోగ్యానికి, ఆకలి చావులకు , నిరుద్యోగానికి , పేదరికానికి , కారణం అయిన ఆ ప్రజల శత్రువును   ప్రజల ముందు నిలుపాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరు వహిస్తారో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. 


 కమ్మరెంకయ్య మామ కండ్లల్ల తిరుగుతుండు. 


రెండు మూడు రోజుల సంది కమ్మరెంకయ్య మామ మనుసుల తిరుగు తున్నడు . ఎన్నటి యాది, ఈ ముసులాయిన ఎందుకు ఊకూకే మతికి వస్తున్నడో  అర్థం అయిత లేదు. అది  నేను ఐదో తరిగతి సదివే టప్పుడు( 1960-61), అయితారం అచ్చినదంటే  మా అన్నగాని గీత కత్తులకు సాటే పిచ్చె తందుకు( కత్తులకు పదను పెట్టుడు) కొలిమి కాడికి పోకట ఉండేది. మాపటీలి మండువ  కాడికి పోతే మా అన్న నాకు కారం పుట్నాలు పెట్టిపిస్తడాయే మరి . కొలిమి కాడ ఆ రోజుల్ల  ఎట్లు ఉండెనొ , ఆ వైభోగం ఏమై పాయే, ఎందుకట్లయ్యనో తెలిసిన విషయమే అయిన ఇంతగనం  మనుసుల ఎందుకు మెసులు తాందో సుద్దామ్ అనుకుంటనే, ఇంతల   నెట్ ఫ్లిక్స్ ల గెలుకుతాఉంటే నానా పటేకర్నటించిన  మరాఠీ సినిమా “ ఆప్లా మానస్ “ కనిపిస్తే ప్లే పైన  క్లిక్ చేసన. నానా పటేకర్ మహా నటుడు గదా , చూసిన కొద్ది సూడ బుద్ది అయింది. నా వయసు వారికి మా కొడుకులు కోడండ్లు బిడ్డలు కూడా కూడా చూస్తే బాగుండు అనిపిచ్చె టట్టు ఉంది. 


కమ్మరెంకయ్య మామ ది  నల్లటి దేహం, కొలిమి వేడికి కమిలి పోయిందో ఆయిన పుట్టుకే అట్ల ఉండెనొ  కానీ అప్పటికే చేసి చేసి అలిసి పోయిన ఊగులాడే కండలు, ఎడుమ  చేతుల పట్టుకారు తోటి అప్పుడప్పుడు కొలిమిల నిప్పులు,  కాకుంటే  బొగ్గులు ఎగేసు కుంట , కుడి చేతిల పెద్దదో లేకుంటే సిన్న దో సుత్తె పట్టుకోని,   ఎప్పుడు కొలిమిల నిప్పుల తీరుగ ఎర్రటి కండ్ల తోటి విరామం లేకుంట పనిజేసుకుంట ఉండే టోడు . ఎండా కాలం అయితే బండ్లకు కమ్ములు గట్టుడు , వానా కాలం అయితే నాగండ్లకు కర్రులు అమిరిచ్చుడు , మాగిల నైతే గుంటుకులూ , ఇంకా గొడ్డన్లు , గడ్డ పారలు, పారకట్టెలు, కొడు వాండ్లు, అంగు పారలు , సిన్న పోరాగండ్ల కు బొంగురాలకు ముల్లులు, ముల్లు గట్టెలు, బురుద పొలాలల్ల తొడిమే తీసే తందుకు కురుపే ముల్లు గర్రలు, పెనాలు ,సరాతాలు , ఇట్లా చెప్పుకుంట పోతే శేతా డంత లిస్ట్ అయితది కానీ క్షణం రికాము లేకుంట పనిజేసేది. ఆయినను బువ్వ కూడా తినకుంటా ఎప్పుడు ఎవరో ఒకరు పానం మీద ఉందురు . ఇంత జేసినా ఆయిన ఇల్లు ఓ కమ్మల గుడిసె. ఆ గుడిసె ల కూడా దోశె డంత గడుకో, సారె డంత పప్పో  ఉండేది గాదు . ఆయిన భార్య ఎప్పుడు కాలం చేసిందో తెలువది. ఒక్క కొడుకు. వాడు కూడా ఏగిలి మనిషి. ఏమి పని చేసే టోడు గాదు. బిడ్డ పుట్టు గుడ్డి. ఆమె కూడా ఇంత ఉడుక వెట్టి పెట్టె ఓసల లేని మనిషి. ఇంత పని జేసుకుంటా ముగ్గురికి ఉడుకేసి ఆయినే పెట్టాలే. ఎప్పుడన్నా మా ఇంటికి ఎంకయ్య మామ వస్తే మా అవ్వ ఇంత గడుక బోటేసి ఇంత సల్ల వోసి అంచుకు ఓ మామిడిగాయ తొక్కు పెట్టేది. నా కడుపు ఇయ్యాల మా నిండింది గానీ గుడ్డి పొరికి ఏమన్నా పెట్టవా అక్క ఆని ఏదో ఓటీ అడుక్కొని పట్టుక పోయేది. బహు కస్టంగా బతుకుతున్నా గూడా ఎంకయ్య మామ ఎన్నడూ గూడ కంట నీరు పెట్టంగా చూడ లేదు. పనే ఆయినకు అంత ఆత్మ విశ్వాసం ఇచ్చింది. 


నేను సదువు కునే తందుకు ఊరిడిచి వచ్చిన తర్వాత  ఎప్పుడో ఊరికి వచ్చినప్పుడు కమ్మరెంకయ్య మామ చని పోయిండ్ ని తెలిసింది. అందరూ మనిసి కింత ఏసుకొని దహన సంస్కారం చేసిండ్రట .  ఆయన కంటే ముందే ఆ కొడుకు కూడా ఏదో జరమచ్చి చనిపోయినడట.  ఆ గుడ్డామే కట్టె పట్టుకోని ఇల్లుళ్లు తిరుగుతూ అడుక్కొని తిని బతుకుతున్నదని తెలిసింది. ఆ తర్వాత ఆమె కూడా చనిపోయింది. 


ఎంకయ్య మామ ఇంటి  కాడ ఒక నల్ల తుమ్మ చెట్టు  ఉండేది. దాని నీడకు కొలిమి ఉండేది. వానలు బాగా పడ్డప్పుడు రైతుల కొట్టాల కింద మామ కొలిమి పెట్టేది. మాగిల నేను కత్తులు సాటేసు క రాను పోతే తుమ్మ సెట్టు నీడకు కూసున్డే ది. తుమ్మ పూల మకరందం పీల్చుకోను తేనె టీగలు వస్తే ఆ రెక్కల సప్పుడు వినుకుంటా అట్లనే ఉంటే “పోడా ఇంటికి పోవా? ఇక్కణ్నే ఉంటవా? ఉంటనంటే సెప్పు కట్నం కింద నా కొలిమినిచ్చి గుడ్డి పొరిని నీకిచ్చి ధూమ్ ధామ గా పెండ్లి జేత్త “ అని బోసి నోటితోటి వక్కడ వక్కడ నవ్వేది. నిజంగనే సేత్తడు గావచ్చు అనుకోని కుడి సేతీలకు కత్తులు తీసుకొని  , పిర్రల మీది లాగు ఇంకా కిందికి జారిపోకుంట ఎడమ సెయ్యి తోటి మీదికి గుంజు కుంట గుంజుకుంట ఎనుకకు మర్రి గూడ సూడ కుంట ఇంట్ల వడేదాక ఉరికచ్చే టోన్ని.    ఆ గుడ్డి మనిషి చనిపోయిన తర్వాత ఆ గుడిసె ఉన్న జాగను పక్కనున్న వారు ఆక్రమించుకున్నరు. నిజాం సర్కార్ సాలార్ జంగ్ జమానల భూ సర్వే జరిపినప్పుడు ఊరుమ్మడి అవసరాల కోసం,  సదరుల కొంత భూమి తీసి అవసరం అయిన వారికి ఇచ్చేవారు. అలా వృత్తి పనివారికి, గుడుల పూజారులకు గృహ అవసరాలకు కొంత  భూమి ఇచ్చే వారు. అలాంటిదే ఈ   కొలిమి కోసం తీసిన జాగ అయి ఉంటుంది. . ఊరికి ఏ కమ్మరి ఉంటే ఆయిన ఇల్లు వేసు కొనే తందుకు  ఆ జాగా ఉంటది. మళ్ళా ఇంకో కమ్మరాయన అవసరం ఊరికి పడలేదు. ఆ భూమి మాత్రం ఎవరో ఒక్కరి సంతం అయిపోయింది. 


నిజానికి నాకు కమ్మరెంకయ్య మామ ఇంత గనం మతికి వచ్చే తందుకు కారణం ఇది రాస్తుంటేనే స్పురించింది. ఊరు మొత్తం ఉత్పత్తి లో భాగమై( పొలం దున్నే కాన్నుంచి ,పంట కోసేదాక, కోసిన పంట అన్నం ముద్దై కడుపు నిండే దాకా సకల జనుల పనిముట్ల కు కారణమైన )  ఊరందరికి అవసరమైన మనిషి కి అంత కస్టమ్ లో కూడా కడుపు నిండుగా అన్నం పెట్టని నా ఊరు,ఆయన  చస్తే ఆవల పారేసింది. ఉన్న భూమిని ఆక్రమించింది. కానీ అదే నా ఊరు,  ఊరిలో మంచికి  చెడ్డకు మంత్రం చదివే బాపనాయిన లేకపాయేనని యమ కలత చెంది    పక్కూరు నుంచి బాపనాయినను రప్పించి ఆయినకు ఇల్లు ఇరువాటు సమకూర్చి ఆయనకు మృ స్టాన్న భోజన వసతి కలిగించి శీగ్ర గతిన తంతు లకు హాజరయ్యే దానికి  ఇప్పుడో కారు కూడా కొనుక్కో గలిగిన సామర్థ్యాన్ని సమ కూర్చింది.         


Thursday, October 28, 2021

భారత స్వాంతంత్రోద్యమ చరిత్ర కు చెందిన సర్దార్ ఉద్దం సినిమా రివ్యూ.

 భారత స్వాతంత్రోద్యమానికి చెందిన ఒక అద్బుతమైన, ఉత్తేజ పూరితమైన , చరిత్ర పుటల లో నిక్షిప్తమైన భావోద్వేగ దృశ్య కావ్యం సర్దార్ ఉద్దం సినిమాను ప్రైమ్ వీడియోస్ లో మిత్రుడు సిద్ధార్థ్ సుభాష్ చంద్రబోస్ రివ్యూ చదివిన తర్వాత ఇప్పుడే చూసిన. 1952 లో నేను పుట్టే నాటికి ఇంకా స్వాతంత్ర్ ఉద్యమ చరిత్ర జ్ఞాపకాలను పెద్దవాళ్ళు చెపుతుంటే ఎంతో ఆసక్తిగా వినేవాళ్ళం.  నేను 1973 లో ఉపాధ్యాయునిగా  పనిజేసే పాఠశాలల్లో 15 ఆగస్తునాడు ఆ చరిత్రను ఉపాధ్యాయులుగా మేము చెబుతుంటే పిల్లలు ఎంతో శ్రద్ధగా వినేవాళ్ళు. ఆనాటి ఉపాధ్యాయ లోకం కూడా భారత స్వాతంత్రోద్యమం అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర అనే విధంగా చెప్పేవారు. అందుకు కారణం ఆనాటి ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది అగ్రవర్ణాల వారు ఉండేవారు. వారి కుటుంబాల్లో కాంగ్రెస్ నాయకులు ఉండేవారు. అందుకు వారు ఆ చరిత్రే చెప్పేవారు.  వారిలో కొందరికి  భగత్ సింగ్ త్యాగం గొప్పగా కనిపించినా ఆయన సిద్దాంతాల పట్ల వారికి సద్భావన ఉన్నట్లుగా కనిపించేది  కాదు.  ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ పుణ్యమా ఆని దేశ ప్రజల్లో  కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం సన్నగిల్లింది.ఇక  అప్పటినుండి  నుండి  కాంగ్రెస్ పార్ట్ అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాల వలన కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తిగా వ్యతిరేకత  రావడం, దాన్ని బిజేపి సొమ్ము చేసుకోవడం తో అంతటి త్యాగపూరితమైన భారత స్వాతంత్రోద్యమ చరిత్ర మసక బారి పోతున్న పరిస్తితి ఏర్పడింది. 


ఇలాంటి సందర్భం లో సుజిత సర్కార్ తీసిన సర్దార్ ఉద్దం సినిమా , ఆనాటి వీరుల త్యాగాలను కండ్లకు కట్టినట్టుగా చూపింది. జలియన్ వాలా బాఘ్ కాల్పులకు అనుమతి ఇచ్చే పంజాబ్ సివిల్ అధికారి జనరల్ డయ్యర్ తో కాల్పులు మామూలుగా ఉండకూడదు ప్రజలను భయో త్పా తానికి, దిగ్భ్రాంతి కి   గురి చేసేదిగా ఉండాలని హెచ్చరిస్తాడు. ప్రస్తుత పాలకులు సైతం మొన్నటికి మొన్న ఉత్తర ప్రదేశ్ లో రైతుల పట్ల  డయ్యర్ పాలసీ నే కదా అమలు చేసింది. 


1 &  2 ప్రపంచ యుద్ధాలలో బ్రిటీష్ ప్రభుత్వం తరుపున పోరాడి  26 లక్షల మంది సైనికులు , చర్చిల్ అవలంభించిన  వార్ టైమ పాలసీ కారణంగా  ఏర్పడ్డ బెంగాల్ కరువు వలన  40 లక్షల మంది భారత పౌరులు తమ ప్రాణాలను దారబోసి సాధించుకున్న భారత స్వాతంత్ర  ఉద్యమ ఫలితాలు ఎవరి పాలు అవుతున్నాయో చూస్తే , ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఉరికంబాలను ముద్దాడిన భగత్ సింగ్,రాజ్ గురు,  సుఖదేవ్, ఉద్దం సింగ్ లాంటి 3300 మంది వీరుల వీరమరణం  త్యాగాలన్నీ ఇలా వృథా కావాల్సిందేనా అనిపిస్తున్నది.   


ఇలాంటి సినిమాలు ఇంకా వస్తే నన్న నేటి యువ తరానికి ఎంత రక్త తర్పణం, ఎన్నెన్ని త్యాగాలు, ఎందరెందరో  బిడ్డలను కోల్పోయిన తల్లులు, తలీదండ్రులను, తోబుట్టువులను కోల్పోయిన యువత త్యాగాల పునాదుల మీదుగా బ్రిటీషయర్ల కబందా హస్తాల నుండి విడిపించబడిన దేశ వనరులు ఎవరి పాలవుతున్నాయో అర్థం చేసుకునే అవకాశం కొంతైనా కలుగుతుందేమో అన్న చిన్న ఆశ తో .. 


Thursday, May 6, 2021

మనిషి ప్రయాణం.

                                                 మనిషి ప్రయాణం. 


కరోనా కాటుకు మనుసులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆక్సీజన్ లబించడం లేదు. రెంసివిడర్ ఇంజెక్షన్ దొరుకదు. వాక్సిన్ వేయించుకోండి అని చెప్పుడే గాని వాక్సిన్ కేంద్రాలకు వెళితే వాక్సిన్ అందుబాటులో  ఉండడం లేదు. ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలై కొడారిపోయే పరిస్తితిలో ఉన్నాయి. ఈ పరిస్తితికి కారణం ఎవరూ అంటే చాలా మంది, మరి  ప్రజలు కాకుంటే మరెవరు అవుతారు అని  ఎదురు ప్రశ్న వస్తున్నది. 


దేశం లో గత ఏడు సంవస్తారాలుగా గతం లో అంతగా   లేనట్టి  ఒక కొత్త భావజాలం వేగంగా వ్యాప్తి చెందుతోంది. అది ఏమంటే? ప్రశ్నించడాన్ని సహించలేక పోవడం. తాము చెప్పిందే నమ్మాలి, వినాలి, ఆచరించాలి , అన్న అహంకారం , అధికారమై కాటువేస్తున్నది.


ప్రశ్నకు జవాబు లేని ఒక మూడత్వాన్ని, నేనే గొప్ప, నా జాతే గొప్పా, నా మతమే గొప్ప అనే ఒక దురహంకారానికి లోనైన ఒక వికృత మానవ నైజం ,   కాదన్నోన్ని  దేశ ద్రోహి, పాకిస్తానీ, కమ్యూనిస్ట్, అర్బన్ నక్సలైట్ అని వాని  మీద బడి కాలిపిక్కలను కరుస్తున్నది. . నిజానికి  ఈ భూమి పైన ఎన్ని సార్లు   జీవరాశి శూన్యమై పునర్నిర్మానమై ఈ 20 లక్షల సంవస్తారాల  ఆధునిక మానవుని (హోమోసేపియన్స్) జీవిత కాలం లో ఎన్నెన్ని ప్రస్తానాలు ఎక్కడెక్కడి నుండి ఎక్కడెక్కడిదాక జరిగినాయో  అన్న ఒక శాస్త్రీయమైన అవహాహన కలిగి ఉంటే వాళ్ళే చేప్బుతున్నట్లుగా ఈ వసు దైక కుటుంబం లో మానవులుందరూ ఒకటే, సమానమే, అందరికీ గాలి నీరు భూమి అనే పంచబూతాలపై సమాన మైన హక్కులు ఉంటాయి అన్న విషయం అర్థం అవుతుంది.


ఒకప్పుడు భూమి,  ఇప్పుడు మనం చూస్తున్న ఆరు కండాలుగా విభజించవడి లేకుండే అన్నది, ఈ భూమి పైన ఇదివరకు ఐదు సార్లు 440 బిలియన్ ,365 బిలియన్, 250 బిలియన్, 210 బిలియన్ చివరగా 65 బిలియన్ సంవస్తారాలక్రితం సర్వం నిర్మూలనమైపోయింది అని  ఫాసిల్స్ లో నిక్షిప్తమై ఉన్న శిలాజాల ద్వారా కార్బన్ టెస్ట్ తో  శాస్త్రీయంగా నిరూపించబడ్డసత్యం.


ఐస్ ఏజ్ . మంచు యుగం. 46 లక్షల సంవస్తారాలనుండి 26 లక్షల సంవస్తారాల క్రితం వరకు దఫాదఫాలుగా మంచుయుగం ఈ భూమి పైన వచ్చినట్లు శిలాజాలు చరిత్రను నిక్షిప్తం చేసినాయి.అప్పుడూ సర్వం నిర్మూలన అయింది.  అలాగే 70 వేల సంవస్తారాల క్రితం ఇండోనేషియా లోని తోబా అగ్నిపర్వత విస్పోటనం వలన కొన్ని వేల మైళ్ళ దూరం లో ఉన్న దక్షిణ  మధ్య భారతం పైన కొన్ని మీటర్ల మందంగా ధూళి , బూడిద వచ్చిపడ్డాయి. అనేక వృక్షాలు జంతువులు తుడిచిపెట్టుక పోయాయి. అనేక మంది ఆదిమ మానవులు మరణించారు. కర్ణాటకలోని జ్వాలాపురం లో ఆదిమ జాతుల నివాస ప్రాంతం లో జరిపిన తవ్వకాల్లో మీటర్ల మందాన పేరుకొని  పోయి ఉన్న ధూళి ని గమనించారు. ఆ ధూళి తోబా అగ్నిపర్వతం నుండి వెలువడ్డది గా నిర్ధారించారు. ఆ తర్వాత 12000 సంవస్తారాల నుండి  అరేబియా నుండి కొత్తగా వచ్చిన మానవ సమూహాలు కొత్త రాతి యుగానికి స్వీకారం చుట్టినాయి. పదునైన రాతి పనిముట్లను తయారుజేసుకొని సంచార నివాసం నుండి స్టిర నివాస ఏర్పాట్లు ప్రారంభం అయినాయి. పశ్చిమ ఆసియాలోని జేరికో, బలూచిస్తాన్ లోని మెహర్ గడ్ , వంటి ప్రదేశాల్లో గ్రామాలు వెలసినాయి. ఆ కాలం లో పశ్చిమ ఆసియా నుండి మధ్యధరప్రాంత జాతులు, దక్షిణ ఇరాన్ నుండి ఏలమైట్ జాతులవారు, సింధు ఉత్తరప్రాంతాలైన పంజాబ్, స్వాత్ లోయ, గాంధారా, వక్షు నది ప్రాంతం లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. క్రీ.పూ. 6000 నాటికి వక్షునది నాగరికత ప్రారభమ్ అయింది. సింధు నాగరికత క్రీ.పూ. 3000 నాటికి ఉచ్ఛదశ చేరుకోవడం తో ఆ నాగరికత ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్, తూర్పున పంజాబ్, రాజస్తాన్, గుజరాత్, మహారాస్ట్రా ప్రాంతాలవరకు విస్తరించింది. కొత్తరాతి యుగపు ఆదిమ జాతులను కూడా తనలో ఇముడ్చుకొంది. 


దాదాపు 10 వేల ఏళ్ల క్రితం ఆగ్నేయ ఆసియా ప్రాంతాలనుండి ఆస్ట్రలైడ్ జాతులవారు తిరిగి వెనుకకు వచ్చి భారత ఈశాన్య ప్రాంతం లో స్తిరపడ్డారు. వీరిలో నాగాలు, బోడోలు, చక్మాలు, కూకీలు, అంగామీలు, ఖాసీలు, తదితర జాతులు మాట్లాడే వివిధ భాషలు ఆస్ట్రోలైడ్ మూలాలు కలిగిఉన్నాయి. హిమాలయ పర్వత ప్రాంతాలకు చైనా ప్రాంతాలనుండి మంగోలాయిడ్ జాతుల ప్రజలు వచ్చి స్టిరానివాసాలు ఏర్పాటుజేసుకున్నారు. వీరినే వేదకాలం లో కిరాతులుగా ప్రస్తావించారు. వీరే కాక తోబా అగ్నిపర్వత భారీవిస్పోటనం తర్వాత జరిగిన వలసలలో అస్త్రలాయిడ్ జాతులకు చెందిన ఆదివాసులుగా పిలువబడే గొండ్లు, కోయలు, చెంచులు, తదితర అనేకజాతులవారు, ఒరిస్సా,మధ్యప్రదేశ్, చత్తిస్గడ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాలల్లోకి వలస వచ్చి ఇప్పటికీ నివసిస్తున్నారు. వీరే కాక అండమాన్ దీవులలోనూ, దక్షిణాది రాస్ట్రాల్లోనూ , నీగ్రోలాయిడ్ జాతులవారు నివసిస్తున్నారు. వీరికి మధ్య ఆఫ్రికా జాతులవారి మూలాలు ఉన్నట్లుగా జన్యుపరీక్షలో తేలింది. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ  మానవజాతి అనేక చేర్పులు మార్పులకు లోనౌతు ప్రకృతి శక్తులతో నిరంతరం పోరాడుతూ నిలిచి ఉంది. 


ఇక క్రీ పూ. 3000 సంవస్తారాల నుండి ఉన్న హరప్పా, మహొంజొదారో , సిందునాగరికత స్తానమ్ లో వచ్చిన ఆర్య నాగరికత అదో చరిత్ర. అసలు సిందూ నాగరికతే ఆర్యనాగరికత అనీ, అదే మొదటినుండి ఉంది. సిందూ లేదు ద్రావిడ లేదు అనే ఒక మొండి వాదన చారిత్రిక ఆధారాలు లేని, ప్రపంచ చరిత్రకారులెవ్వరూ అంగీకరించని ఒక వితండ  వాదన చేస్తున్నారిప్పుడు కొందరు . రాహుల్ సాంకృత్యాన్ రాసిన ఓల్గాసే గంగా, మర్ల విజయ్ కుమార్ రాసిన భారతీయుల మూలాలు చదివినా సింధు నాగరికత నుండి ఆర్యుల నాగరికత వరకు భారత దేశం లో జరిగిన చరిత్ర తెలుస్తుంది. ఈ పుస్తకాలకు చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. వట్టి పుక్కిటి పురాణాలు ప్రామాణికం కాజాలబోవు. అందులో ఉన్నది చరిత్ర కాజాలబోదు . ఒక కథ, ఒక నవల, ఒక ప్రబంధ సాహిత్యం, ఒక పురాణ సాహిత్యం, మాత్రమే.  అవన్నీ ప్రజల మధ్యన ఉండే సంబంధ బాంధవ్యాలను, జీవన విధానాలను, ఆహార విహారాలు,  ఆహార్యం, ఆలోచనా విధానాలను మాత్రం చెపుతాయి.


సింధు నాగరికత విధ్వంసం తర్వాత ఆయా పొలిమెరల్లో నివసించే భిల్లులు, సంతాలులు, గొండ్లు, తదితర జాతులు మధ్యభారం లోకి తరలి వచ్చారు. క్రీ. పూ. 1800 నాటికి చోటనాగ్పూర్  ప్రాంతం లో ఇనుపవస్తువుల తయారీకి శ్రీకారం చుట్టి ఇనుపయుగానికి నాంది పలికారు. క్రీ.పూ. 500 నాటికి పర్షియా సామ్రాజ్యం ఉత్తర ఆఫ్రికా నుండి పశ్చిమ ఆసియా, పర్షియా, తూర్పు సింధు ప్రాంతం , ఆఫ్ఘనిస్తాన్, తుర్కుమేనిస్తాన్, తజకిస్తాన్, వరకు విస్తరించింది. నేటి యుగోస్లేవియా, అల్బేనియా, టర్కీదక్షిణ భాగం, అశ్శీరియ, జోర్డాన్ ప్రాంతాలలో నివశిస్తున్న గ్రీకులు,  వీరందరని కలిపి యవనులు అనే వారు.పర్షియన్  చక్రవర్తి దారియన్ ఆకాలం లో ఈ యవన సైనికులను తన రాజ్యం లోని ఆఫ్ఘనిస్తాన్ అందలి  గాంధారా కు తీసుకు వచ్చారు. పర్షియన్ సామ్రాజ్యం పతనం అయిన తర్వాత, క్రీ.పూ. 326లో అలెగ్జాండర్ సింధు నది ప్రాంతం వరకు  విస్తరించాడు. గ్రీక రాజ్యం సెల్యూకస్ వారసుడు మినాండర్ బౌద్ధాన్ని స్వీకరించి మిళిందునిగా ప్రసిధ్ధి  చెందాడు. ఇండో గ్రీక్ రాజ్యాలు పతనమైణాంక ఆ యవన  సైన్యాలను అనేక రాజ్యాలు ఉపయోగించుకున్నాయి. కాల క్రమం లో వారు క్షత్రియులు గా బ్రాహ్మణులుగా భారతసమాజం లో విలీనం అయినారు. 


క్రీ.పూ. 3 వ శతాబ్దం నుండి దాదాపు 600 సం. పాలించిన పర్షియన్ రాజులు ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరపంజాబ్, వరకు తమ రాజ్యాన్ని విస్తరించారు. తర్వాత సింగియాంగ్ ప్రాంతం నుండి దండెత్తి వచ్చిన ఇండో యూరోపినులైన శకుల దాడితో ఇండో గ్రీకు రాజ్యాలు పతన దశకు చేరుకున్నాయి. శకులు జన్యుపరంగా ఆర్యులకు దగ్గరి వారు. అయితే చైనా లోని గ్వాంగ్జూ ప్రాంతం లో నివసించే మరో ఇండో యూరోపియన్ జాతి యుయఝీలు వీరు శకుల రాజ్యాన్ని ఆక్రమించుకొని క్రీ. పూ. 50 నాటికి కుశాన్ సామ్రాజ్యాన్ని ఏర్పర్చుకున్నారు. కుశాన్ రాజులలో కనిష్కుడు ప్రముఖుడు. ఈ విధంగా ఉత్తరాన ఉన్న పచ్చిక మైదానాల గుండా అనేక జాతుల వారు దక్షిణ ఆసియాలో రాజ్యాలు స్టాపించుకొని కాలక్రమేణా వారంతాకూడా భారతీయులలో కలిసి పోయారు. క్రీ.ష. 5,6 శతాబ్దం లో తుర్కెమినిస్తాన్ నుండి శ్వేతహూణులు దోపిడి ప్రధానగా దాడులు జరిపి వారు తిరిగి వెనుక్కు పోలేదు. 11 వ శతాబ్దం నుండి 7 వందల ఏండ్ల పాటు తురుష్కులు పాలించారు. జొరాష్ట్రీయన్ మతస్తులైన పార్శీలు పశ్చిమ భారత్ లో ప్రవేశించారు. ఆఫ్రికా జాతులైన అబిసీనియన్లను ఇతర తూర్పు ఆఫ్రికా దేశస్తులను ఇక్కడికి అంగరక్షకులుగా తెచ్చుకున్నారు. 17 వ శతాబ్దం నుండి యూరోపియన్లు ఈ దేశాన్ని పరిపాలించారు. అలా ఆంగ్లో ఇండియన్లు, ఫోర్చుగీసువారు, టిబెటీయులు , ఇరానీయులు ఆఫ్ఘనిస్తాన్ వారు భారత దేశం లో స్తిరపడ్డారు. 


1947 దాకా భారత దేశం నానా జాతుల సమితి. అందుకే భారత దేశం ఒక గణతంత్ర రాజ్యం. అనేక మతభేదాలతో, కులబెధాలతో వేల సంవస్తారాల నుండి ఇక్కడ  కలిసి మెలిసి సోదరభావం తో నివశిస్తున్నామ్. 

ఒక్క భారతదేశం లోనే కాదు.అన్ని  ప్రపంచదేశాల దేశాల్లో ఇదేవిధమైన అన్ని జాతుల, అన్ని మతాల, అన్ని రంగుల ప్రజలు కలిసి జీవిస్తున్నారు. కానీ ఈ దేశం లో ఈ మతస్తులే ఉండాలి, ఈ రంగు వాళ్లే ఉండాలి , ఈ జాతివారే ఉండాలి అని; మాట్లాడటం లో అర్థం లేదు. జాతి మతమూ రంగు అన్ని మనుషులు ఏర్పాటుచేసుకున్న పరిధులు మాత్రమే. భారతదేశం లో హిందూయిత్వం, , అమెరికాలో ట్రంప్ ఇజమ్,   ఆస్ట్రేలియాలో స్కాట్ మార్సియనిస్మ్, యు.కె. లో బోరిస్ జాన్సనిజమ్ ఇట్లా ఏదేశానికి ఆ దేశం ప్రజలను వేర్పాటు వాదం వైపు నడిపిస్తున్నాయి. కానీ మానవుల యొక్క సహజస్వభావం మనుషులను వెదుక్కోవడం. కలిసి ఉండడం. 


పోనీ మనుషులను విడదీస్తున్న ఈ మతరాజకీయాలు, జాతి రాజకీయాలు, ప్రజలందరి శ్రేయస్సుకోసం ఏమైనా చేస్తున్నాయా అంటే అదీ లేదు. ఇది అలనాటి రాచరిక వ్యవస్థ నాటి నుండి కూడా లేదు. రాజు సుప్రీం. దాన్ని స్తిరత్వం చేయడానికి పూజారివర్గం, కండబల వర్గం ఎలాగూ ఉండనే  ఉనాయి. ప్రజలు పనిజేసే యంత్రాలు మాత్రమే. సంక్షేమ రాజ్యాలు, రాజ్యాంగం , ప్రజాస్వామ్యం అంటూ వచ్చిన తర్వాత ఏమైందో చూద్దాం. 1698 లో స్టీమ్ ఇంజిన్ కనుక్కున్న తర్వాత 1860 ప్రాంతం లో వచ్చిన  పారిశ్రామిక విప్లవం , పెట్టుబడి శ్రామికులను సృస్టిస్తే ఆ తర్వాత శక్తికి అవసరమైన బొగ్గు, పెట్రోలియం, వచ్చిన తర్వాత సాంకేతిక అభివృధ్ధి జరిగి ఆ  తరువాత భూమి పైన, భూమి లోపల ఉన్న సకల వనరులను దోచుకోవడం ప్రారంభం అయింది. భూమి భోమితోబాటుగా ఉన్న అన్ని సహజసంపదలను ప్రజలందరికీ సమానంగా పంచవల్సిన బాధ్యతల ను వదిలి వేసిన పాలక పక్షం అవన్నీ డబ్బున్న సంపన్నులకు దోచి పెడుతూ అదే చాలా గొప్ప అభివృధ్ది అని ఊదరగొడుతున్నది. 


ఒక్క మతాన్ని నీ చేతిలో పెట్టి నీకున్నదంతా గోచిగుడ్డతో సహా సంపన్నులకు దోచిపెట్టి కార్యక్రమం ఒకవైపు నిరాఘాటంగా సాగుతుంటే,  నేనే గొప్ప, నా మతమే గొప్ప అంటో ఎంతకాలమైతే ప్రజలు ఆ మాయలో ఉంటారో అంతకాలం తమ వెనుకబాటు తనానికి ఆ ప్రజలే కారణ మౌతారు.  


అమెరికా లో ఎలాన్ మస్క్ అనే ఒక టెక్నో క్రాట్, పెట్టిబడి దారు, బ్యాటరీ కార్లు తేవడం తో బాటుగా ఇప్పుడు SN 15 అనే ఒక కొత్త 15 అంతస్తుల రాకెట్ కనుక్కొని రేపు అంగారక గ్రహం మీదికి రాకపోకలు సాగిస్తాడట. అంటే ఈ గ్రహాన్ని మానవయోగ్యం కాకుండా జెసి ప్రపంచ  సంపన్న వర్గాలు అంగారకునికి పైకి లేచిపోయే ప్రయత్నం ఒకవైపు సాగుతుంటే ఇక్కడ మన భారతదేశం లాంటి చోట్ల రోగులకు కనీసం ఆక్సీజన్ అందించలేని పరిస్తితి లో ఉంటూ నా దేశం , నా మతం, నా జాతి అంటూ శుష్కవాదాలు చేస్తూ ఎంతకాలం మనుషులను భ్రమల్లో ఉంచుతారు. ప్రజలు గొర్రెల్లా  తలలూపడం మానుకొని  ఇకనైనా మేల్కొని మనలో మనం కొట్టుకోవడం మానివేసి  ప్రశ్నించడాన్ని నేర్చుకొని ప్రకృతి ని కాపాడుకొంటూ పరిమితంగా మాత్రమే ప్రకృతి సంపదలను వాడాలని నినదిస్తూ ఉత్పత్తి అయిన సంపద సమానంగా పంచబడాలే అని, అందరికీ ఒకే విధమైన,ఒకే నాణ్యమైన  ఉచిత  విద్య, ఉచిత వైద్యం  అందే దానికి పాలక వర్గాని ప్రశ్నించండి. 


వీరగొని పెంటయ్య. 

రాష్ట్ర ఉపాధ్యక్షులు 

రైట్ ఎజుకేషన్ ఫర్ బెటర్ సొసైటీ. 

కరీంనగర్.