Saturday, December 31, 2016

ఇంటిమీదెవుసమ్ 17

                                                                ఇంటిమీదెవుసమ్ 17

రఘోత్తమ్ రెడ్డి సార్ మిద్దె తోట చూసినప్పుడు, దాంట్లే ఒక్క సారికే అయిపోయే ఆకు కూరలున్నయ్ , ఎక్కువ రోజులు కాసే బెండ, బీర , సొర, కాకర, చెమ్మ, అలసంద, రకాలు ఉన్నయ్ , అట్లనే బొప్పాయి, జామ లాంటి పండ్ల చెట్లు ఉన్నయ్ వీటన్నింటితో బాటు రకరకాల పూల చెట్లు గూడా ఉన్నయ్. ఆకు కూరలు, కూరగాయలు, ఫల పుష్పాదులన్నింటి సమాహారమే మిద్దె తోట అయ్యింది.

అట్లనే ఒక మనిషి ఈ సమాజం లో ఉన్నడంటే అతడు  లేదా ఆమె ఎందరెందరితోనో కలిసి జీవన యానాం చేయవల్సి ఉంటుంది. వారి ప్రతి అడుగులో ఒక కొత్తదనం , ఆ కొత్తదనం లో ఎందరెందరిదో తోడ్పాటు ఉంటుంది . ఆ మనిషి అక్కడ దాకా చేరుకోవడానికి తన ప్రయోజకత్వమే అనుకోవడం అహంకారమే అవుతుంది. తోటివారు చేసిన తోడ్పాటును మరిచి పోతే మనిషి సమాజం లో ఇమడ లేక ఇబ్బందులు పడుతాడు.

ఇదే విషయాన్ని నిన్న పదవీ విరమణ పొందిన మా సోదరి రోజా చాలా సింపుల్ గా తన వీడుకోలు సందేశం లో చెప్పిన విషయాలు మీతో పంచుకోవాలని చెపుతున్నాను. తన ఉనికి కారణమైన తలిదండ్రులను స్మరిస్తూనే తన తోడబుట్టిన అక్క అన్నలు, చెల్లెల్లు,కట్టుకున్న భర్త, అతని కుటుంబ సభ్యులు, కన్నకొడుకులు, వారి భార్యలు, వారి పిల్లలు, తన వ్యక్తిగత కుటుంబ జీవనం సుసంపన్నం చేయడానికి ఎవరెవరు  ఎట్లా తోడ్పడింది, తన ఆటల్లో పాటల్లో చదువులో, సత్ప్రవర్తనలో ఒక్కరోక్కరు ఎప్పటి కప్పుడు తన ఎదుగుదలకు, తనను ఆనందంగా ఉంచడానికి ఎలా తోడ్పడింది మామూలు మాటల్లో చెప్పింది. అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఆత్మీయ మిత్రులు, ఉద్యోగ సహచరులు తన ప్రతి ముందడుగుకు ముండ్లు లేకుండా ఏరి న విషయాన్ని ఎంతో వినమ్రత తో చెప్పింది.

అయితే నిజంగానే ఇవన్నీ ఆమె చెప్పినంత సుహృద్భావ వాతావరణం లో సులభంగా ఆడుకున్నంత అలవోకగా జరిగి ఉంటాయా ఎవరికైనా ? అస్సలు జరుగదు. ఏ  మనిషికైనా  ఉండే సహజమైన అభిజాత్యం, ఇగో లు అడ్డు వస్తూనే ఉంటాయి. మనసులో, మనసుతో ,మనషులతో అనేకమైన సంఘర్షణలు జరుగుతుంటాయి.  మనిషి ఇంగితం, సహచరుల తోడ్పాటు ఆ సమస్యలనన్నింటిని అధిగమించ డానికి తోడ్పడతాయి.

మన మిద్దె తోటలో ఆకు కూరలకు , కూరగాయలకు , పండ్లకు రకరకాల చీడ పీడలు సోకుతున్నాయి. ఐనా వాటిని తొలగించుకొని అమృత తుల్యమైన ఆహారాన్ని మనం భుజీస్తున్నాము. ఆలాగీ మన సహచరులు మనతో మసలుతున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా చేసి నప్పుడు, అక్కరకు రాని పండు ముక్కను కోసివేసి తినదగింది తిన్నట్లు గానే మనకు బాధ కలిగించిన సందర్భాలను మరిచిపోయి వారి వలన మనం పొందిన ఆనందాలను యాది జేసుకుంటే జీవితం ఆనందమయం . అలా గాకుండా వారి వలన కలిగిన బాధలను  అదే పనిగా గుర్తు జేసుకొని గొడవలు పడితే అదే దుఖమయం. ఆమె అంత అలవోకగా చెప్పిన మాటల్లో ఇంత అంతరార్థం ఉన్నట్లు నాకు అర్థమైంది.

Friday, December 30, 2016

ఇంటిమీదెవుసమ్ 16

                                                      ఇంటిమీదెవుసమ్ 16

పాలకూర తింటున్న పురుగులకు  నీమాయిల్ గొట్టిన. దెబ్బకు పురుగులు సచ్చి ఊరుకున్నయ్ .  హమ్మయ్య ! పీఢా వొయింది. నేనింతగనమ్ తండ్లాడి తండ్లాడి పానం తీరుగ పెంచుకున్న పాలకూరను ఇగ దింటరా బిడ్డా ! ఆయ్ ! .

ఇయ్యాల చెప్పే ముచ్చట సదువు బడిల సంగతి కనుక సదువుకున్నోల్ల లెక్క మాట్లాడుకోవాలే గదా ! సరే అట్లనే మాట్లాడుకుందాం ! సరేనా !

ఈ రోజు మా సోదరి రోజా రెటైర్మెంట్ సభకు వెళ్ళిన. ఆమె సోషియల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్. విద్యార్థులు, ఉప్పాధ్యాయులు, బంధుమిత్రులు చాలా పెద్ద సంఖ్యలోనే హాజరైనారు. ఒక పండుగ వాతావరణం కనిపించింది పాఠశాలలో. ఆ సభను ఉద్దేశించి ఒక పూర్వ విద్యార్థి ఉపాధ్యాయ వృత్తి ప్రాశస్త్యాన్ని చాలా గొప్పగా చెప్పాడు. తమ తలిదండ్రులు తమకు మాంసపు ముద్దల్లాంటి దేహాలను  ఇస్తే ,  ఆ మాంసపు ముద్దలను ముద్దార తమ హృదయాలకు హత్తుకొని  మానవీయ మనీషులుగా తీర్చి దిద్దేది ఉపాధ్యాయులు అనీ చెబుతూ  ఇవ్వాళ అందరు గొప్పగా చెప్పుకుంటున్న సొసైటీ కార్య దర్శి గూడా ఒక ఉపాధ్యాయుని వల్లనే అంత గొప్పవాడు అయినాడని చెప్పి అక్కడున్నవారందరి ప్రశంశలు పొందాడు.

ఆ తర్వాత మాట్లాడిన సభాధ్యక్షులు ఆ మాటలకు  స్పందిస్తూ, ఆ అబ్బాయి మాట్లాడిన తర్వాత మా ఉపాధ్యాయులకు ఓహో మేము ఇంత గొప్ప వాల్లమా అన్న ఆలోచన కలిగి ఉంటుందన్నారు. ప్రస్తుతం తమ చుట్టూ ఉన్న పరిస్తితుల వలన మేము ఉపాధ్యాయులమ్ అని చెప్పుకోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నం .అవమాన భారాన్ని అదిమి పట్టుకొని ఆత్మ విశ్వాసం కోల్పోయి మర బొమ్మల వలె పిల్లలకు బోధిస్తున్నాము.  ఉపాధ్యాయుడంటే పాఠాలు చెప్పలేని వాడని, విలువలు లేని వాడని, సంపాదన లేని వాడని మొత్తంగా ఒక గౌరవ ప్రదమైన మనిషే కాదనే భావం సమాజం
లో  బలపడే విధంగా పాలకులు స్తిరీకరించారు.

ఒక విద్యార్హిని భవిష్యత్తులో నీవు ఎమౌదామనుకొంటున్నావని అడిగేతే , " నేను, ఐ పి ఎస్, ఐ ఏ ఎస్ , డాక్టర్ , ఇంజనీర్, అయితే పోలీస్ అంటున్నాడు గాని ఒక్క పిల్లవాడైనా నేను టీచర్ ను అవుతానని అనడం లేదు. ఎందుకు? కానీ నిజానికి ముఖ్యంగా ఏ సమాజానికి ఐనా ముఖ్యంగా ముగ్గురు తక్షనావసరంగా ఉంటారు. ఒకరు ఆకలికి అన్నం పండించే రైతు,రెండు  బార్డర్ పైన ఉండి అందరికీ భద్రతనిచ్చే సైనికుడు, మూడు జ్ఞాన నేత్రం తెరిపించి బతుకు దెరువు నేర్పే గురువు. కానీ ఇవ్వాళ ఆ వృత్తే చులకనై పోయింది. ఈ అబ్బాయి లాంటి వాళ్ళు ఇలా గుర్తు జేస్తే ఓహో మేము గురువులమే కదా అని గుర్తుకొస్తున్నది .

ఈ పరిస్తితి మారాలి. లేకుంటే ఈ బడులళ్లనుండి విలువలు లేని, సమాజాన్ని పట్టి పీడించే దొంగలు బైటికి వస్తారు. అప్పుడు ఈ రాజ కీయ నాయకుడు దేశాన్ని దోచుక తింటున్నాడని అన్నా, ఒక డాక్టరు కడుపులు కోసి ప్రాణాలు తీస్తున్నాడని అన్నా, ఈ ఇంజనీరు కూలిపోయే భవనాలు, ప్రాజెక్టులు కట్టి ప్రజల ఉసురు తీస్తున్నాడని అన్నా, ఈ బ్యూరోక్రాట్ పెద్ద లంచగొండి అని అన్నా. ఈ ఐ పి ఎస్ నకిలీ ఎంకౌంటర్లు చేసి ప్రజలను చంపుతున్నాడని గొంతు చించుకున్నా గోల చేసిన ప్రయోజనం ఉండదు. ఆదర్శవంతులైన ఉపాధ్యాయులకోసం, సమాజాహితమైన చదువుల కోసం నిజాయితీ గా కృషి జరుగలన్నాడు.

తమ సంతానాలకు పెద్ద పెద్ద చదువులు కొని పెడుతాము , ఆ వెంటనే వాళ్ళు పెట్టిన పెట్టుబడి పోను ఇబ్బడి ముబ్బడి గా లాభాలు తెచ్చే డబ్బు మిషన్లు గా ఎదుగాలని తలిదండ్రులు ఎంతవరకైతే  కోరుకుంటారో అంతవరకు ఈ  సమాజానికి శ్రేయస్కరం జరుగదు. తమ పిల్లలు ఏ వృత్తిలో స్తిరపడ్డా ఫరువా లేదు, ఎంత సంపాదించినా ఫరువా లేదు కానీ వారు మనుసున్న మనుషులు గా ఎదుగాలన్న బలమైన ఆకాంక్ష తలిదండ్రుల్లో వచ్చినప్పుడే ఏ సామాజానికైనా నిష్కృతి అని ముగించాడు.


Tuesday, December 27, 2016

ఇంటిమీదెవుసమ్ 15

                                                    ఇంటిమీదెవుసమ్ 15

ఈ సలి పాడుగాను పొద్దుగాల లేద్దామంటే ఓ దిక్కు  యేళ్ళు కొంకర్లు వోతున్నయ్ మల్లోదిక్కు మొక్కలు వంకర్లు వోతున్నయ్ . తోట కూర సరే, కోతిమీర గూడా సరే. కానీ పాల కూరనైతే పచ్చి సొప్ప తీరుగ మేస్తున్నయ్ పురుగులు. యే గా పురుగువట్టిన ఆకు కూరెట్ల వండుతరు , పురుగు పురుగు రాదా కూరంత అని ఇంట్లకే రానిస్తలేరు . ఇగ మిరుప శెట్లైతే పురాగా అన్నాలమే , ముడుసుక పోయిన ముక్కు మొఖాలతోటి వాటిని సూడనే బుద్దైతలేదు . ఒక్క టమాటా శెట్లు మాత్రం మొఖంగడుక్కోని పొడరేసుకున్నట్టున్నయ్ . సరే  , మెడకేసుకున్న పాము కరువక దప్పుతదా ? ఫలితం ఎదచ్చినా రైతుకు ఎవుసమ్ జేసుడు దప్పనట్టే మనసోంటోల్లమ్  ,మొదలు వెట్టుకున్న మొక్కల సాగైతే విడిచి పెట్టం గదా?

మా పక్కోళ్ళకు చెప్పున్టి, మనం కూరగాయలు కొనే అవసరం ఉండది, మనకే మస్తు కాస్తయి అని. నా తిప్పల జూసి వాళ్లెమి అడుగుత లేరు గని , కూరగాయలు కొనవోతే సిల్లర లేక జనం పాట్లు జూస్తుంటే , నాకే మా సిన్నప్పటి ముచ్చట యాదికి వచ్చింది. ఈ సలి కాలం ల మా ఊర్ల పొంటి పరికి పండ్లు  ,బొట్టుగ్గడ్డలు (మీద నల్లటి తోలు, లోపట పసుపు పచ్చటి మెత్తటి గడ్డ) ,  పల్లి కాయలు అమ్మచ్చేటియి . ఈ కాలం లనే ఇంటి నిండా అప్పుడే పండిన వడ్లు గూడా ఉండేటియి . మా అవ్వ ను గీమాలుదుము (బతిమాలుడు) . గొట్టే గుల్ల  (వెదురు బద్దల్తో చేసిన చిన్న బుట్ట) నిండా వడ్లు వెడితే , సరికి సరి అంటే ఎన్ని వడ్లు వెడితే అన్ని పరికి పండ్లు, అన్ని పల్లి కాయలన్న మాట. ఆ బుట్ట మూతి వెడల్పు ఉండేది. పైన శిఖరం ల వడ్లు ఎక్కువగా నిలువై కానీ పరికి పండ్లు మెత్తగ ఉండి చాలా ఎత్తు శిఖరం నిలిచేది. మేము పోటీలు వడి అగో ఆనికి ఎత్తు శిఖరం కోలిసినవ్ నాకు తక్కువ కోలిసినవ్ అని తకురార్ (తగవు ) వెట్టుకోని ఎక్కువ పండ్లు తీసుకుంటుంటిమి . వరి గోసినంక మెద ఏద్దురు . మెద ఎండినంక మోపులు గట్టి కల్లం లకు తెచ్చేటోల్లు. మాపటి బడి విడిచి పెట్టినంక మెద ఎత్తిన పొలం లకు పొయ్యి పోరాగాండ్లు అందరం పరిగే ఏరుకుందుమ్. ఆ పరిగే కంకులను నలిసి వడ్లు తయారు జేసుకొని కోమటి సత్తెయ్య దుకాణం లకు వొయ్యి వడ్లు ఇస్తే ఆయిన మాకు పిప్పరమెంట్లు, బోలు పేలాల ముద్దలు ఇచ్చేది .

పొద్దంత పని జేసినోళ్లకు కూడా ధాన్యమే కూలి గా ఇద్దురు . జొన్నలైతే విసురుకోని గడుక వోసుకుందురు , వడ్లైతే దంచుకోని దబ్బడ ,  లేకుంటే నూకల బువ్వ అండుకుందురు . అందుకనే కైకిలి , వడ్ల కంటే జొన్నలనే కొలువు మందురు . ఆ కైకిలి ధాన్యం ల నుండే ఉప్పు మిరుప కాయల కోసం కొన్ని సావుకారికి కొలిస్తే ఆయిన అడిగిన సామాను ఇచ్చేది. ఏగాని కొత్త లేక పోయినా రైతు కూలీలకు ఏడు గడిచేది. నగదు రహితం మనకు నాడే ఎరుక. కానీ మన బతుకులు మనల బతుకనియ్యకుంట మన బతుకులు బతుకులే గావనీ , మోటు గాళ్ళు మీరని మొమాటం బెట్టి  తిండ్ల దగ్గెర నుంచి బండ్ల దగ్గెరిదాకా మనది గాని బతుకులను అలువాటు జేసి మార్కెట్ మట్టుకు (గుంజ, ఇంగ్లీష్ ల పోల్ ) మమ్ముల గట్టేసి , మమ్ముల రానియ్య కుంట పోనియ్య కుంట రాజిర్కం జేస్తున్నరు . అరె ఆ రాజీర్కాల కాలం ల అయినా మేము తయారు జేసుకున్నది మేము తింటుంటిమి . మేం ఏం దినాలెనో ఎంత దినాలెనో ,  నువ్వే నిర్ణయం జేస్తవ్  , మేము ఏమి తాగన్నో నువ్వే జెప్పుతవ్ . మాకు ఎంత కూలో నీదే నిర్ణయం. అండ్ల మళ్ళా రోజు కు ఎంత ఖర్చు జేయన్నో గూడా నిర్ణయం నీదే . ఇగ ఈ దేశం ల మేమేందో మాకైతే ఏమీ సముఝైత లేదు.

Friday, December 23, 2016

ఇంటి మీదెవుసమ్ 14

                                                      ఇంటిమీదెవుసమ్ 14


ఎన్ని ఇకమాతులు జేసినా అస్ నీ ! అటేటే , అంటానయి మొక్కలు గాని కాసంతన్న పండ్లిగిలిత్త లెవ్ ,పగులవడి నవ్వకుంటే మానాయే గాని అన్నా సుత ! పాసిపోయిన మొఖాలేసుకొని మొక్కలన్నీ అట్లనే బిర్రబిగుసక పోయ్యున్నై . ఎందుకీటికి గింతనన్న నెనరు లేకపాయే , నేను ఇంత పోదన జేస్తున్న గూడా అని మనుసు మదన వడుతున్నది . పాయే నెల రోజులు గడిచి పాయే . నీ మిద్దె తోట ఎట్లున్నదో సూద్దామని దోస్తులు రావట్టిరి . . ఇయ్యాలనే మా సుబ్బా రావ్ సార్ గూడా వచ్చిండు హన్మకొండ నుంచి. కానీ సూడ వొతే ఏమున్నది , ఊరి బైటి బోడ గుట్టల తీరుగ  కాయ లేని పువ్వు లేని కాకిరి బీకిరి శెట్లు . ఒక్క సారి మళ్ళా సిన్నప్పటి ఎవుసమ్ ముచ్చట యాదికి దెచ్చుకున్న.


కరీంనగర్ జిల్లా మంతెన మాదేపూర్ తాలుకాల ఉత్తరం దిక్కు గోదావరి నది పడుమటి నుండి తూర్పుకు పారుతుంటడి , మరో దిక్కు మంతెన మాదేపూరాన్ని వేరుజేసుకుంట మానేరు నది దక్షిణం నుంచి ఉత్తరానికి పారుతుంటది .ఒక వైపు కాటారం మండలం దామెరకుంట, మరో వైపు చెన్నూరు మండలం పొక్కూరు వద్ద మానేరు గోదావరి నదిల కలుస్తది .  అప్పట్ల ఇవి రెండూ  ఏడాదొకి పెన్నెండు నెల్లూ పారుతూనే ఉండేటియి తియ్యటి నీళ్ళ తోటి. దసర పండుగు వరకే   తెల్లజొన్న పోతలు అయ్యేది. అప్పుడు అంతా తెల్ల జొన్న చేన్లే . సత్తెపు పంట అందురు. ఒక్కొక్కటి ఇసుర్రాల్లంత ,  ఇసుర్రాల్లంత పెల్లలు , ఆ  పెల్లల్ల జొన్నలు వొస్తే , వానలు పడ్డా పడక పోయినా సల్ల ముంతలంత సళ్ళముంతలంత కంకు లు వెట్టేటియి కర్రలన్నీ. ఇగ నీళ్ళ వసతి ఉన్న కాడ మక్కజొన్నలు వేద్దురు . అప్పుడు మా ఉర్లే నాలుగు కుటుంబాలకే బావులు ఉండేటియి. ఈ రెండు నదుల నడుమ భూమి ఎండ గొడితే బర బర , వాన గొడితే బుర్ద, బుర్ద, . అయితే మా బాయి కి మోట వెట్టి మా నాయిన అప్పుడు మా ఊల్లే కొత్తగా మక్క జొన్నలు పెట్టిండు. మక్క జొన్నలు తియ్యగ ఉంటయని అవి తింటే వాతం అని వ్యవసాయ కూలీలు కైకిలికి (కూలికి ) మక్కలు తీసుకోక పోదురు . అప్పటికి మక్క జొన్న సాగు అధునాతనమైందన్న మాట .


ఇత్తునాలు మా నాయిన పుట్టినూరైన కల్వచెర్ల ( కమాన్ పూర్ మండలం ) నుండి తెచ్చిండట . సంకరం కాని విత్తనాలు , సారవంతమైన నేల ల సాలినంత పశువుల ఎరువు వేసిన భూమిల విత్తనాలు నాటేది . ఇక్కడ కూడా పెద్ద పెద్ద పెల్లలు ఉండేది. గోడ్డండ్లు వట్టి పెల్లలను మెత్తగా నలుగ గొడుదుము . అట్లా మెత్తగైన నేలల జానేడు జానేడు దూరం ల ఒక్కొక్క గింజ నాటుదుము . నాటినంక పాయలు దీసి ఓరలు గుంజి , కాలువలు జెసి నీళ్ళు గట్టెటిది . తెల్లారంగా పుంజులు గూసే యేళ్లకు మోటలు గడితే బాయిల నుంచి గోరెచ్చటి నీళ్ళు మోట బొక్కన నిండా వచ్చేటియి . మోట గొట్టుడు షురూ అయినంక కాలువ సాగే వరకు ఉడుకుడుకు మోట నీళ్ళ తోటి మొఖం గడుక్కోని , గప్పుడే సంటి నుండి మా నాయిన విండిన నురుగులు గక్కే గోరెచ్చటి  పాలు , ఇత్తటి పాల సర్వల నుంచి కంచు గిలాసల , గిలాస నిండ వొసిత్తే , కమ్మగ దాగి పెయ్యంత యెచ్చ జేసుకొని అగో గప్పుడు గాని నీళ్ళు గట్టెతందుకు మక్క తోటలకు పోక పోదుము .


మక్క పెరటిల ఉన్న పెల్లలు ఒరుసుక పోయి కాళ్ళ యేళ్ళ కు నెత్తుర్లు గారేది అప్పుడప్పుడు. మక్క కర్రల మీద రాత్రి కురిసిన మంచు తోటి  తడిసిన మక్క కర్రల ఏనెలు,  సెంపల పొంటి ఒరుసుక పొయ్యి బగ బగ మండుతుండే సెంపలు . పెల్లల కింద బతుకు జీవుడా అని దాక్కొనున్న తేలు పిల్లల్లు మోట నీళ్ళు తాకంగానే పెల్లల్ల నుంచి బైటికి వచ్చేటియి . అప్పుడప్పుడు కాళ్ళ పొంటి మీదికి ఎక్కేటియి .దెబ్బకు సలి దెంక పోతుండే .  తేలు కుట్టినట్టు మాత్రం యాదికి లేదు. అంత కస్ట పడి పంట దీసిన మనం గీయింత పడావు జేసె ఫలితం రాక పాయే గదా అని నీరస పడితే యెట్లా అని నాకు నేనే సమ్జాయించు కుంటున్న .


Thursday, December 22, 2016

ఇంటిమీదెవుసమ్ 12

                                                               ఇంటెమీదెవుసమ్ 12

ఇంటిమీదెవుసమ్ ల ఇత్తునాల్ వెట్టి నెల రోజులకచ్చింది. ఆకు కూరలు కంచం ల కొచ్చినయ్ గాని తీగ జాతులింకా తీగ సాగుత లెవ్. ఈ సలి కాలం పాపం వాటిని సాగనిస్తలేనట్టున్నది . ఓ తీగ సాగుతున్న ముచ్చట జెప్పుత సదువుండ్రి .

ఎవుసమ్ 10 సదివినంక చాలా మందే మాట్లాడిండ్రు. మా పిల్లలిద్దరు కూడా దక్కన్న రాజ్యం నుంచి సంబుర పడుకుంట వాళ్ళకు ప్రకృతి తోనున్న సంబంధం గురించి  రాసిండ్రు. అట్లనే మా పెద్దల్లుడు బుర్ర తిరుపతి గూడా రాసిండు. రఘోత్తమ్ రెడ్డి సారు తిరుపతి మీద కైతికాలు గూడా రాసిండు. ఈ సిల్ సిలా (పరంపర) మీద గూడా మనం రాయొచ్చు అని రఘోత్తమ్ రెడ్డి సార్ చెప్పిన తర్వాత ఇయ్యాల ఇదే ముచ్చట జెప్పుదామని రాస్తున్న.

చెప్పిన గదా! మాదో చిన్న పల్లెటూరని, పంట పొలాలున్న ఎవుసమ్ దార్ల కుటుంబమని. మా నాయిన తెలివి తోటి నన్ను డిగ్రీ చదివిచ్చిండు,దాంతోటి బడి పంతులు నౌకరొచ్చింది ఉన్నూరి పక్కన్నే. బడి, ఇల్లు ఎవుసమ్ నా ప్రపంచం.  పిల్లలను సేను సెలుకల పొంటి తీసుక పోతుంటి. భూముల గురించి పంటల గురించి వాళ్ళకు చెప్పేటోన్ని . సమాజం లో అనేక మార్పులు జరుగుతుంటాయి. మనం  నడిచి వస్తున్న దారి నేర్పిన అనుభవం  మేరకు  మనం వాటికి అనుకూలంగానో  ప్రతికూలంగానో మనిషిగా మాట్లాడకుండా ఉండలేము. అట్లా మాట్లాడి నందుకే ఒక్క నూకుడు నూకుతే ఇగో ఇట్లా కరీంనగర్ ల వచ్చి పడ్డ. ఇక్కడికి వచ్చినంక గూడా బడి, సంఘం అంట బాగనే తిరిగిన.  పిల్లల చదువుల గురించి పెద్దగా పట్టించుకున్నది ఏమి లేదు. కానీ సమయం చిక్కినప్పుడల్లా వాళ్ళను చుట్టూ కూచుండ బెట్టుకొని మా ఊరి ముచ్చట్లు, మా నాయిన కాలం నాడు వాళ్ళు కుటుంబాల కోసం ఎట్లా కస్టపడేదో , నేను గూడా ఐదో తరుగతి కాంగానే చిన్నతనం ల మా ఊరు నుంచి మంతెన కు వచ్చి వండుక తినుకుంట ఎట్లా ఇబ్బంది వడి సదువుకున్ననో చెప్పుతుంటి. నాకు వచ్చే జీతం  ఎంతో గూడా చెప్పేటొన్ని. దీంతో నా పిల్లలు ఎప్పుడు గూడా నాకు ఇది గావాలే అది గావాలే అని నన్ను ఒక్క నాడు గూడా ఇబ్బంది పెట్టక పొదురు . ( ఇప్పటి పిల్లల సంగతి జూస్తే అస్సలు పొలికే లేదు) .

ఓ సారి మా పెద్దోడు నేను మంతెన పక్కనున్న గోదావరి  ఔతలి ఒడ్డుకున్న మా అక్కోల్ల ఊరు పౌనూరుకు పోయినమ్. బాగా వర్షం పడ్డది. మేము తిరిగి మంతెనకు రావాలే . గంగోడ్డుకు వచ్చేవారకు గోదారి నిండుగ పారుతున్నది . మావోని ప్రశ్నలు జూడాలే ! ఈ నీళ్ళు ఎక్కడియి, వానన్టేంది , నీళ్ళు  ఎందుకు అటు ఉరుకుతున్నయి , ఇటెందుకు ( వెనుకకు ) రావు. నీళ్ళ మీది నుంచి మనం ఎదుకు నడిచి పోలేము, ఓడ అన్టేంది , అండ్లెక్కితే ఎందుకు మునుగమ్ మరి, ఇట్లా అనేక ప్రశ్నలు . ఓపికగా ఆన్నింటికి జవాబు చెప్పి ఇంటికి వచ్చినం . పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు ఏమ్మాట్లాడుకున్నారో గాని అబ్బా! మా నాన్నకు తెలిసినంత  ఈ బూమ్మీద మరెవ్వనికి తెలువది అన్న అభిప్రాయానికి వచ్చినట్టు ఆ తర్వాత నా చిన్న బిడ్డ జెప్పితే నాకు అర్థమయింది. ఎవ్వరికైనా నాన్నే తొలి గురువు అని ప్రాక్టికల్ గా నాకు అప్పుడు అర్థం అయింది. నా చిన్న బిడ్డ జవహర్ నవోదయ చొప్పదండి లో చదువుకునేది. ఆమెను ప్రోత్సహించే కొరకు చదువు, ప్రవర్తన, విలువల గురించి నాకు తోచినప్పుడల్లా ఉత్తరాలు రాస్తుండే వాణ్ని . ఆ ఉత్తరాలను తాను ఒక్కతే గాకుండా మిత్రులందరితో కలిసి చదువుకొనేదాట . మొన్న జులై నెలలో నేను తన వద్దకు పోయినప్పుడు ఆ విషయం గుర్తు జెసి ఆ ఉత్తరాలు ఇప్పటికీ తన నగల తో బాటుగా దాచుకున్నానని చెపితే నా కళ్ళల్లో నీళ్ళు ఊరినై .

రెన్డేండ్ల  కింద ఒక సారి నేను మా చిన్నోని దగ్గరికి పోయిన . అప్పటికి వాణ్ని చూడక మూడేన్ద్లు అయితాంది . . వాణ్ని చూడంగానే ఎక్కణ్ణుంచో చెప్పరాని దుఃఖం ముంచుకొనచ్చింది , వాణ్ని పట్టుకోని కడుపుల సొద కరిగి పోయేదాకా ఏడ్చిన . వాని కళ్ళల్లో గూడా కన్నీళ్లు. ఈ నీళ్లూరుడు కరిగి పోవడాలు లేకుండా ఉంటే మనుషులు మంచుగడ్డల్లాగా బిర్ర బిగుసుకొని ఉంటే మానవ నాగరికత ప్రేమ ఆప్యాయాలతో ఇలా సజీవ స్రవంతి లాగా ఉండజాలదేమో . మనుషుల మధ్యన ఈ సంబంధ బాంధవ్యాలు , ప్రేమానురాగాల పెనవేత ఎంత బలంగా ఉంటే కుటుంబ సంబంధాలు అంత బలంగా ఉంటాయి. కుటుంబాల వ్యవస్త ఎంత బలంగా ఉంటే సమాజాల జీవన శైలి అంత బలంగా ఉంటుంది. కనుక మనిషి ప్రథమంగా తనను తాను ప్రేమించుకోవాలంటే తాను ఆరోగ్యంగా ఉండాలి. అందుకు అవసరమైన ఆహారం, శారీరక శ్రమ చేయాలి. తనతో మొదలిడిన ప్రేమ తన పరిసరాలను , పక్కవాళ్లను నచ్చుకుంటూ , మెచ్చుకుంటూ విశ్వ వ్యాప్తం కావాలని ఆశిద్దాం.!

ఇంటిమీదెవుసమ్ 8&9

                                                          ఇంటిమీదేవుసం 8 & 9 .

ఈ రోజు వెల్డింగ్ జేసిన నిలువు పందిరి పోల్స్ ఇంటికి తీసుక వచ్చిన. మొత్తం 6 పోల్స్. ఒక్కొక్కటి 9 ఫీట్ల ఎత్తు . పైన బొమ్మ లాంటిది ఏదైనా పెట్టేతందుకు అడ్డంగా ఒక ఫీట్ ముక్కను వెల్డింగ్ చేయించిన. దీనికి గాను, ఇనుము ఖరీదు, 1800/ రూ : వెల్డింగ్ కు 700 కలిసి 2500 రూ: అయినయి. పోల్స్ పైకి తీసుక వెళ్ళిన తర్వాత పేయింట్   వేసి గాని గోడకు బిగించడం కుదురదు అని ఆలోచించుకుంటూ గతం లో ఎట్లా ఉండే ఇప్పుడు ఎలాంటి పరిస్తితి వచ్చిందీ అని ఒక్క సారి యాబై ఏండ్ల కిందటి  గత అనుభవం లోకి వెళ్ళిన.

మా ఊరు పాత కరీంనగర్ జిల్లా మహాదే పూర్ తాలాకా ధన్నవాడ. మా బంధువులు మహాముత్తారం లో కూడా ఉండేటోల్లు . అప్పుడప్పుడు బంధువుల ఇండ్లళ్ళకు ఎడ్ల బండి మీద పోతుంటిమి. అట్లా మహాముత్తారం  పోయేటప్పుడు మా ఊరు దాటంగానే చిన్న చిట్టడివి వచ్చేది. కారెంగా పోరుకలు, కోడిశే పోరుక అక్కడక్కడ తునికి చెట్లు పాల చెట్లు కనిపించేటియి . ఆ తర్వాత కొత్తపల్లి, మొలుగుపల్లి దాటిన తర్వాత అడివి వచ్చేది. ఆ అడివిల నుంచి పోతుంటే నడీ అడివిల ఎక్కడనైతే చెట్లు ఉండక పొయ్యేదో అక్కడ ఒక చిన్న ఊరు ఉండేది. అంటే అప్పుడు ఒక ఊరు కోసం అడివిని నరికి ఊరు పొందిచ్చుకుందురు . ఇండ్లంటే పెద్ద దూలాలు మొగురాలు ఉండేటియి  కాదు. పెండెలు అనే వాళ్ళు. పెండెలు అంటే మనిషి దండ దొడ్డు ఉండే చెట్ల కొమ్మలు. వాటితోటే ఇల్లు కట్టుకోని చుట్టూ పంజర పోరుక తోటి దడి పెట్టుకొని ఆ దడి కి చుట్టూ ఎర్ర మట్టి మెత్తి మీది నుంచి పూత పూద్దురు . ఎండాకాలం వేడి , దగడు గాలిరాకుంట సలి కాలం అయితే సలి వెట్టకుంట . పై కప్పు ఏమో మోతుకాకు, లేకుంటే తేకుటాకు పూసుకు ఆకుల  తోటి కప్పుదురు . కొంచెం ఉండగలిగినోళ్లయితే కోపిరి గడ్డి కప్పుదురు. ఆ ఇండ్లు సలి కాలం ల వెచ్చగ , ఎండా కాలం ల సల్లగా ఉండేటివి .అంత కంటే ఎక్కువ అడివిని వాళ్ళు నరుకక పొయ్యేటోల్లు . అడివిని కాపాడేది నిజంగా  ఆ ఊరు వాళ్ళే అయి ఉండేది.కానీ అడివి నరుకుతున్నారని వాళ్ళ మీద కేసులు అయ్యేటివి.  ఆడివికి కాపల ఉండే జంగలాత్ అధికారులే అడివిని పెద్ద పెద్దోళ్ళకు అమ్ముకుందురు.

అట్లా చుట్టూ అడివి నడుమ ఉర్లు ఉండే పరిస్తితి నుండి నాగరికత మనుషులకు అసలు అడువన్నదే లేకుండా  కనపడకుండా జేసె గదా అని ఆలోచిస్తుండగానే ,  అడివంటే అన్నం అని యాదికి వచ్చింది. అప్పుడు ఆడివికి పోతే తునికి పండ్లు, పాల పండ్లు, పరికి పండ్లు, బలుసు పండ్లు,మొర్రి పండ్లు, మస్తుగా దొరికేటియి . మొర్రి పండ్లను తిన్నంక ఎండబెట్టి పలుగ కొడితే సారె  పప్పు వచ్చేది. సణ్ణే గడ్డలు, బొట్టుకు గడ్డలు, దామెర గడ్డలు , పసుపు గడ్డలు, బెల్లం గడ్డలు, ఇట్లా అనేక రకమైన గడ్డలు దొరికేటియి. వాటిల కొన్నింటిని ఉడుక వెట్టుకొని తింటే మరికొన్నింటిని మంటల వేసి కాల్చుకొని తిందుము . మందు మాకు లేని సచ్చమైన తిండ్లు అప్పటియి. ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు వచ్చేవారకు పెట్టుబడి వచ్చింది.  దాంతో బాటే లాభం కోసం రకరకాల మోసాలు, వేషాలు వచ్చి చేరినయి .

నాడు ఇసొంటి బీర శెట్లు , పోట్ల, దోస, దొండ , కాయల కోసం భూమి మీదనే , అడివి నుండి పందిరి గుంజలు కొట్టుకోని వచ్చి పందిర్లు వేసుకునే టోల్లమ్ . అటువంటిది ఇప్పుడు ఇండ్ల పైకప్పుల మీద ఇనుప పైపుల తోటి నిలువు పందిర్లు వేసుకుంటున్నం. మనుషుల అత్యాశ, ప్రకృతికి శాపం అవుతున్నది.

ఇంటిమీదెవుసమ్ 11

                                                                ఇంటిమీదెవుసమ్ 11

మా సర్కస్ రింగ్ మాస్టర్ ( ఎనుకటి మా పెద్ద సారు తీరుగ ) కొరడా చడేల్ మనిపిచ్చిండు. అర్రెర్రే ఎనుకబడి పోతినా అని పొద్దుగాల యోగాసనాలు కాంగానే ఇగో ఇట్లా మొదలువెట్టిన . .ఇయ్యాల ఎవుసమ్ పని గూడ లేదు. ఈ సలి మంచు జెయ్యంగా తడి ఎక్కువై తున్నదని మడులను ఆరవెట్టి తవుటమ్ బెట్టిన  . ఇండ్ల ఈ కంప్యుటరొకటి సతాయిస్తున్నది ..

మా చిన్నప్పుడు మంతెనలకు ఓ సర్కస్ వచ్చుండే. అండ్ల రింగు మాస్టర్  గుండ్రటి సర్కిల్ ల హంటర్ వట్టుకొని ఉండేటోడు . తెల్లటి , ఎర్రటి , నల్లటి నాలుగైదు గుర్రాలు పరిగెత్తుకుంట వచ్చేటియి . రింగు మాస్టర్ హంటర్ చడేల్ మని కొట్టంగనే రింగు బయిట ఉన్న కర్ర ట్రాక్ మీది నుంచి జోరు తోటి గుర్రాల ఉరుకుడు మొదలయ్యేది. ఒక పొట్టి గుర్రం ట్రాక్ మీద కాసేపు ఉరికినట్టు జేసి రింగు మాస్టర్ తనను చూడనప్పుడు ట్రాక్ దిగి కింది నుంచి ఉరికేది . రింగు మాస్టర్ హంటర్ దీసుకోని దానెంట వడంగానే  ఆయనకు అందకుంట ముందుకు ఉరికి పోయి  ట్రాక్ ఎక్కేది. అది మళ్ళా మళ్ళా అట్లనే జేసేది . మేం పొరగాండ్లమంతా ఆ దొంగ గుర్రం ఎప్పుడు దిగుతదా అని చూసుకుంట అది ట్రాక్ దిగంగానే ఓ ఓ అని మొత్తుకుందుం . మా లొల్లికి హంటర్ మాస్టర్ వచ్చేకంటే ముందే అది ట్రాక్ ఎక్కేది.  దిగేది , మొత్తుకొంగనే ఎక్కేది మాకది ఓ గొప్ప ఆనందమిచ్చిన గుర్రం, పోరగాండ్ల ఆట.  తర్వాత తేలింది మాకు , పొల్లాగాండ్లను రప్పించే తందుకే ఆ గుర్రానికి అట్లా తర్ఫీద్ ఇచ్చిండ్రని.

నిన్న రఘోత్తమ్ రెడ్డి సార్ తోటి మాట్లాడిన తర్వాత రాసేది రాయవల్సింది చాలా ఉన్నదని  మల్లోసారి యాదికి వచ్చింది. మేము గూడా ఆకుల భూమయ్య సారుతోటి చాలా సార్లు చెప్పేటోల్లమ్ మీరు రాయండి సార్, రాయాలి సార్  అని. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆయన చాలా విషయాలు బిగ్ బ్యాంగ్ థీరి నుండి మొదలువెడితే దైవ కణం దాకా అరిటీ పండు ఒలిచి పెట్టినట్టు చెప్పేటోడు . ఆయన్ను మేమంతా నడిచి వస్తున్న పుస్తక భాండాగారం అందుము.ఆయన చెప్పే విషయాలు చాలా అథారిటేటివ్ గా సైంటిఫిక్ గాఉండేటియి . మీరు చెప్పేవి అన్నీ రికార్డ్ అయితే సమాజానికి చాలా ఉపయోగం అని మేము ఆయనతో అనేక మార్లు అనే వాళ్ళం .  రాద్దామ్ రాద్దామ్ అని చెప్పేటోడు. కానీ ఎల్లుండి డిసెంబర్ 23 న ఆయన 3 వ వర్దంతి.

ఇంటిమీదెవుసమ్ 10

                                                                  ఇంటిమీదెవుసమ్ 10 .

ఇయ్యాల మొక్కలకు నీళ్ళు జల్లంగ కొతిమీర మొక్కళ్ళ తెల్ల జొన్న కర్ర ఆగవడ్డది . దాన్ని జూడంగానే అబ్బ ఏం జెప్పలే తియ్యటి , తియ్యటి ముచ్చట్లు మతికి రావట్టినయి . మీతోటి పంచుకోవాన్నని మనుసు ఒక్కతీరుగ తండ్లాడుతాంది.

అయితే నాకున్నయన్ని పాత పాత ముచ్చట్లే . మీకు నచ్చినా నచ్చక పోయినా నేను సెప్పెటియైతే గవ్వే మరి. మా సిన్నతనం ల మా దండి సలి వెట్టేది సలికాలం ల. ఈ సలి కాలం అచ్చిందంటే మా ఊళ్ళల్లా అందరి ఇండ్ల ముందట నెగడి ఉండుడే . నెగడి అంటే పెద్ద పెద్ద మొద్దులు అంటే బాగా దొడ్డు ఉన్న దుంగలు , పొద్దుగూకిందంటేనే ఆ మొద్దులను ఒక్క దగ్గెరికి జరిపి నిప్పేద్దురు. జల్డిన అంటుకునే తందుకు సన్నపు శెక్క పేళ్లు పక్కల పొంటి పేరుద్దురు . మాపటీలి మా బువ్వలు దినుడు నెగటి కాడనే అయ్యేది. నిదురవొయ్యేదాక అక్కన్నే. అయితే ఈ నెగల్లు ఎడ్లు ఎవుసమ్ ఉన్నోల్ల ఇండ్లల్లనే ఉండేటియి . అడివిల నుంచి కట్టెలు తెచ్చేతందుకు ఎడ్ల బండ్లు కావలెనాయే. అయితే ఎద్లేవుసమ్ లేనోళ్లందరు ఈ నెగటి కాడికే వద్దురు. ఇగ అక్కడ నిద్రలు వొయ్యేదాకా సాత్రాలు ( కథలు ) జెప్పుడు ఉండేది. -ఒక్కొక్క సాత్రమ్ రోజుల తరబడి సాగేది. సాత్రాలు వినేతందుకు మేం పోరగాండ్లమంత పొద్దుగుకేతాళ్ళకే నెగడి కాడికి చేరే టోల్లమ్ .

తెల్లారే టప్పుడు ఓ దిక్కు బగ్గ సలివెడుతుంటే ఇంకో దిక్కు కోడి పుంజులు అవుతలి వాడలకు వినబోయే టట్టు కుక్కురూ కూ అంటే కుక్కురూ కూ అని ఇరామ్ లేకుంట కూసెటియి . ఈటితోటి ఇగ వశపడదని మళ్ళా నెగడి కాడికి చేరుదుమ్ . అప్పటికే లేసి బర్రెల పాలువిండి న మా  నాయిన పిట్టే కావలి పొమ్మని పోరువెడుతుండే. పిట్టే కావల్లప్పుడు ఎవుసదారుల కుటుంబాల ఇంటిల్లి పాది ఏదో ఒక సేను కావలికి పోకదప్పక పోయేది. కర కర పొద్దువొడిసే వారకు సేనులకు చేరకుంటే ఆ పూటకు రామ శిలుకలకు తిన్నన్ని జొన్న కంకులు . అందుకని ఆ సలికి గజ గజ వణుక్కుంట మెడకు అరి కట్లమ్ ( మెడ చుట్టూ , చేతుల చుట్టూ, పెయ్యన్త కప్పుతూ తల పై నుండి ఒక బట్ట కట్టుదురు ) కట్టుకోని సేనుకు చేరుదుము . ఒహోయ్ ! ఓడా ఓడా అనుకుంటా , రామ చిలుకలను, గొర్రే గొర్రె అనుకుంట గోర్రెంకలను జొన్న కర్రల మీద వాలకుంట ఒడిశెల తోటి కొడుదుము . పొద్దువొడిసిన కాన్నుంచి అంబటెల్ల దాకా పిట్టెలను ఆర్చి కొడుదుము. మబ్బు వడితే పగటెల్ల దాకా ఈ లొల్లి ఉండేది. పిట్టెలు అచ్చుడు మగ్గిన తర్వాత ఇంటికి వోదుము . అయితే బడికి పోబుద్ది కాన్నాడు పిట్టెలు బాగా వచ్చినయని సాకులు జెప్పి బడి ఎగ్గొట్టి జొన్న చేంలనే   ఉండి జొన్న కంకులతోటి అటుకులు కాపుకొని బుక్కుదుము కమ్మగ . ( అటుకుల ముచ్చట ఇంకా ఉన్నది రేపు చెప్పుకుందాం )

ఇంటిమీదెవుసమ్ 13

                                                             ఇంటిమీదెవుసమ్ 13 .


రెండు రోజులనుండి మొక్కలకు నీళ్ళు ఇవ్వకుండా ఆరబెట్టిన . ఒక రోజు తవటం బెట్టిన , మట్టి మొత్తం ఆర నిచ్చి ఆ తర్వాత నిన్న ఓరలు దొబ్బిన ( మా వైపు దొబ్బడం ఆంటే నెట్టడం ) ..ఓరల  ఫోటో పెట్టిన చూడండి.మొక్కలు అనుకున్న విధంగా పెరుగడం లేదన్న నా బాధను విన్న జయంత్ గారు , వర్మి కంపోస్ట్ నానబెట్టిన నీళ్ళు పోయండి ,సలైన్ ఎక్కించినట్టు ఉంటుంది అని అంటే ఇవ్వాళ ఆ నీళ్ళు పోసిన. చూడాలే మరి !


ఎవుసమ్ 10 పైన స్పందించిన మా చిన్నోని మాటలు తేప తేపకు యాదికొస్తున్నయి . " నీ చుట్టూ ఉన్న పోరాగాండ్లల్ల పోరాగాన్నై, మేం బతుకని బతుకును కండ్ల ముందుంచడం, సూడని తాతను సూపుల్ల నిలుపడం , పొగవట్టిన జొన్న కంకుల వాసన ఇప్పటికీ తాజాగా తన చుట్టూ ఆవరించి నట్టుండడం " . ఆ అనుభవాలన్నీ వాని నోటి నుండి రావడం నాకైతే గొప్ప అనుభూతే ! ఆనందం అయింది కూడా !  ఓ ముప్పైయ్యేండ్ల కిందటి ముచ్చట్లు ఇప్పటికీ పచ్చి పచ్చిగా ఆ మనిషి మస్తిష్కం లో ఎందుకు చిక్కుబడి పోయి ఉన్నట్టు ? ఆ అనుభూతి అతనికి ఎందుకు అంత ప్రీతి పాత్రమైంది? తన పెద్దలు ఆ అనుభవాలు కలిగి ఉన్నందుకేనా? లేక అంతకంటే ఎక్కువైన సామాజిక ప్రయోజనాలు  ఏమైనా ఆ అనుభూతుల వెనుక దాగి ఉన్నాయా ? అపురూపమైన ఆ యాద్ గార్లు, ఇప్పటికీ ఇంకా ఇంకా కావాలని ఏ మనిషైనా ఎందుకు కోరుకుంటాడు? ఏ మనిషైనా  తనదైనది ఏదో పోగొట్టుకొంటినా అన్న దేవులాట తోటి అతని లోపటి మనిషి ఏమైనా తండ్లాడుతడా ? నిజానికి ఈ ప్రశ్నలన్నీ మా చిన్నోని ఆర్తి వెనుక దాగి ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఈ ప్రశ్నలన్నింటికి జవాబులు మొత్తంగా నా వద్ద కూడా లేవు .


మానవ నైజం చాలా చిత్రమైంది. పాతది, ఉన్నది  ఉండాలే , కొత్తది వచ్చేది కూడా రావాలి అని కోరుకుంటుంది. అవును అట్లా కోరుకోవడం లో తప్పు లేదు. కానీ కొత్త ఆవిష్కరణ జరుగాలంటే పాతది విధ్వంసం కాక తప్పది. కానీ ఏ కొత్త ఆవిష్కరణ అయినా పాత దాని పునాదుల పైన్నే నిర్మించ బడుతుందని మరో చోట . నిదానమే ప్రధానం అని ఒక చోట, ఆలస్యం అమృతం విషం అని ఇంకో  చోట. ఇలా పరస్పర విరుధ్ధ సూత్రీకరణలు ఉంటాయి. అయితే మనం మన మన విచక్షణా పరిజ్ఞానం మేరకు ఏది ఎక్కడ అవసరమో అక్కడ వినియోగించుకోవాల్సి ఉంటుంది . .


మన సాంప్రదాయ వ్యవాసాయం వలన భారత దేశం లో పెరుగుతున్న జనాభాకు సరిపోయినంత ఆహార పదార్థాలు పండించలేమని ఎవరో శాశ్త్రాజ్ఞుడు చెబితే మన తాతల తండ్రుల నాటి పద్దతులు మరిచి పోయి పైసలున్నోల్ల బేపారం కోసం తయారైన సంకర జాతి విత్తనాలు, పురుగు మందులు, ఎరువు మందులు తయారు జేసుకున్నం. అవి తినీ తినీ అనారోగ్యాలు తెచ్చుకున్నం . ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళా పాత బాటవడుతున్నం .

విచక్షణ పరిజ్ఞానం ఉండి దాన్ని  ఉపయోగించుకునే పాటి చైతన్యం ఉన్న మన లాంటి వాళ్ళం   కొందరం ఇగో  ఇట్లా  త్రిశంఖు స్వర్గం తీరుగా ఆకాశం లో ఈ   మిద్దె తోటలు పెంచుతున్నాం . విశ్వామిత్రుని వలె ఎంతో పరిజ్ఞానం , పట్టుదల ఉంటేగాని ఈ ప్రక్రియ సాధ్య పడటం లేదు. . దీన్ని ఇలాగే కొనసాగిద్దాం . మనెంట ఓ పది మందిని వెంటేసుక పోదాం. !

Friday, December 16, 2016

ఇంటిమీదెవుసమ్

                                                          ఇంటిమీదేవుసం 8 &9


ఈ రోజు వెల్డింగ్ జేసిన నిలువు పందిరి పోల్స్ ఇంటికి తీసుక వచ్చిన. మొత్తం 6 పోల్స్. ఒక్కొక్కటి 9 ఫీట్ల ఎత్తు . పైన బొమ్మ లాంటిది ఏదైనా పెట్టేతందుకు అడ్డంగా ఒక ఫీట్ ముక్కను వెల్డింగ్ చేయించిన. దీనికి గాను, ఇనుము ఖరీదు, 1800/ రూ : వెల్డింగ్ కు 700 కలిసి 2500 రూ: అయినయి. పోల్స్ పైకి తీసుక వెళ్ళిన తర్వాత పేయింట్   వేసి గాని గోడకు బిగించడం కుదురదు అని ఆలోచించుకుంటూ గతం లో ఎట్లా ఉండే ఇప్పుడు ఎలాంటి పరిస్తితి వచ్చిందీ అని ఒక్క సారి యాబై ఏండ్ల కిందటి  గత అనుభవం లోకి వెళ్ళిన.


మా ఊరు పాత కరీంనగర్ జిల్లా మహాదే పూర్ తాలాకా ధన్నవాడ. మా బంధువులు మహాముత్తారం లో కూడా ఉండేటోల్లు . అప్పుడప్పుడు బంధువుల ఇండ్లళ్ళకు ఎడ్ల బండి మీద పోతుంటిమి. అట్లా మహాముత్తారం  పోయేటప్పుడు మా ఊరు దాటంగానే చిన్న చిట్టడివి వచ్చేది. కారెంగా పోరుకలు, కోడిశే పోరుక అక్కడక్కడ తునికి చెట్లు పాల చెట్లు కనిపించేటియి . ఆ తర్వాత కొత్తపల్లి, మొలుగుపల్లి దాటిన తర్వాత అడివి వచ్చేది. ఆ అడివిల నుంచి పోతుంటే నడీ అడివిల ఎక్కడనైతే చెట్లు ఉండక పొయ్యేదో అక్కడ ఒక చిన్న ఊరు ఉండేది. అంటే అప్పుడు ఒక ఊరు కోసం అడివిని నరికి ఊరు పొందిచ్చుకుందురు . ఇండ్లంటే పెద్ద దూలాలు మొగురాలు ఉండేటియి  కాదు. పెండెలు అనే వాళ్ళు. పెండెలు అంటే మనిషి దండ దొడ్డు ఉండే చెట్ల కొమ్మలు. వాటితోటే ఇల్లు కట్టుకోని చుట్టూ పంజర పోరుక తోటి దడి పెట్టుకొని ఆ దడి కి చుట్టూ ఎర్ర మట్టి మెత్తి మీది నుంచి పూత పూద్దురు . ఎండాకాలం వేడి , దగడు గాలిరాకుంట సలి కాలం అయితే సలి వెట్టకుంట . పై కప్పు ఏమో మోతుకాకు, లేకుంటే తేకుటాకు పూసుకు ఆకుల  తోటి కప్పుదురు . కొంచెం ఉండగలిగినోళ్లయితే కోపిరి గడ్డి కప్పుదురు. ఆ ఇండ్లు సలి కాలం ల వెచ్చగ , ఎండా కాలం ల సల్లగా ఉండేటివి .అంత కంటే ఎక్కువ అడివిని వాళ్ళు నరుకక పొయ్యేటోల్లు . అడివిని కాపాడేది నిజంగా  ఆ ఊరు వాళ్ళే అయి ఉండేది.కానీ అడివి నరుకుతున్నారని వాళ్ళ మీద కేసులు అయ్యేటివి.  ఆడివికి కాపల ఉండే జంగలాత్ అధికారులే అడివిని పెద్ద పెద్దోళ్ళకు అమ్ముకుందురు.


అట్లా చుట్టూ అడివి నడుమ ఉర్లు ఉండే పరిస్తితి నుండి నాగరికత మనుషులకు అసలు అడువన్నదే లేకుండా  కనపడకుండా జేసె గదా అని ఆలోచిస్తుండగానే ,  అడివంటే అన్నం అని యాదికి వచ్చింది. అప్పుడు ఆడివికి పోతే తునికి పండ్లు, పాల పండ్లు, పరికి పండ్లు, బలుసు పండ్లు,మొర్రి పండ్లు, మస్తుగా దొరికేటియి . మొర్రి పండ్లను తిన్నంక ఎండబెట్టి పలుగ కొడితే సారె  పప్పు వచ్చేది. సణ్ణే గడ్డలు, బొట్టుకు గడ్డలు, దామెర గడ్డలు , పసుపు గడ్డలు, బెల్లం గడ్డలు, ఇట్లా అనేక రకమైన గడ్డలు దొరికేటియి. వాటిల కొన్నింటిని ఉడుక వెట్టుకొని తింటే మరికొన్నింటిని మంటల వేసి కాల్చుకొని తిందుము . మందు మాకు లేని సచ్చమైన తిండ్లు అప్పటియి. ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు వచ్చేవారకు పెట్టుబడి వచ్చింది.  దాంతో బాటే లాభం కోసం రకరకాల మోసాలు, వేషాలు వచ్చి చేరినయి .

నాడు ఇసొంటి బీర శెట్లు , పోట్ల, దోస, దొండ , కాయల కోసం భూమి మీదనే , అడివి నుండి పందిరి గుంజలు కొట్టుకోని వచ్చి పందిర్లు వేసుకునే టోల్లమ్ . అటువంటిది ఇప్పుడు ఇండ్ల పైకప్పుల మీద ఇనుప పైపుల తోటి నిలువు పందిర్లు వేసుకుంటున్నం. మనుషుల అత్యాశ, ప్రకృతికి శాపం అవుతున్నది.

Thursday, December 15, 2016

ఇంటిమీదేవుసమ్ 7

                                                                ఇంటిమీద ఎవుసమ్. 7

ఇయ్యాల పొద్దుగాల సూదమ్ రమేశ్ గారికి పోన్ జేసినప్పుడు , సార్ ! మీరు రాస్తున్న కాలం పేరు మిద్దె మీద ఎవుసమ్ అని పెడితే బాగుంటది అని సూచన జేసిండు. నాకు గూడా అవును గదా? ఎవుసమ్ అంటే నేల  మీద నిలబడి భూమిని దున్ని చేసేది  సేద్యమైతది గదా ? రమేశ్ చక్కని సూచన చేసిండు అనుకున్న, ఆయన తోటి గూడా అన్న మంచి సూచన అని , కానీ తీరా రాద్దామని మొదలువెట్టే వారకు మిద్దె ఎందుకనో గాని నాకు పరాయిది అనిపించింది . ఇంటి మీద, లేకుంటే ఇల్లు మీద ఎవుసమ్ అని పెడితే బాగుంట దేమో అనిపించి ఇట్ల మొదలు వెడుతున్న. సరే ఇది చదివిన తర్వాత ఎవరైనా సూచన చేస్తే అప్పుడు ఏమన్నా చేర్పులు మార్పులు చేద్దాం అని ఇగో ఇట్లా " ఇంటి మీద ఎవుసమ్ " అని రాస్తున్న. మిద్దెల ఉండు కుంట మిద్దె పరాయిది ఎట్లయింది అని మీరు ప్రశ్నించ వచ్చు . దీనికి జవాబు మల్లోసారి రాస్త గాని యింత కంటే ముఖ్యమైన సంగతి ఓటి మాట్లాడు కునేది ఉన్నది, జర ఆ చర్చను వాయిదా వేద్దామ్ >

రఘోత్తమ్ రెడ్డి సార్ పంపిన " ఇంటి పంట " పుస్తకం కరీంనగర్ లో ఉన్న రత్న ప్రభ గారికి ఇచ్చే తందుకు పోయిన. ఇంట్లోకి వెళ్ళేటప్పుడే చూసిన లాన్ లో  తీర్చి దిద్దినట్టు  అందం గున్న సక్కదనాల పూల శెట్లు . అవి దాటుకుంట లోపటికి పోయిన . రత్న ప్రభ గారి సాదర ఆదరణ. అప్పుడే ఇంటి తోటలనుంచి తెంపుక వచ్చిన జామ పండ్లు పెట్టింది తినడానికి, అమ్మతనం గదా ఆదరణ అట్లనే ఉంటది మరి.  పరిచయాలు , యోగ సమాచారాలు అయిన తర్వాత మిద్దె మీదికి పోయి ఆమె పెంచు తున్న తోటను చూసిన. వాటి ఫోటోలు కూడా కొన్ని పెడుతున్న చూడండి. కానీ ఆ మొక్కల గురించి ఆమె తీసుకుంటున్న జాగ్రత్తలు, శ్రద్ద విన్న తర్వాత ఈ కాలం లోని కొందరు తలిదండ్రులు వాళ్ళ  పిల్లల పైన తీసుకుంటున శ్రద్ద కంటే గూడా మిక్కిలిగా ప్రభావతి గారు తోట పైన తీసుకుంటున్నట్లు అనిపించింది నాకు. వారు ఎప్పుడన్నా పని పైన
ఊరేలితే ఇక్కడ ఉన్న వాళ్ళు వాటి ఫోటోలు తీసి  పంపితే చూసి గాని సంతృప్తి చెందే వారు కాదట .. అంతటి అవినాభావ సంబంధం ఆమెకు మొక్కల తో . ఒక నిమ్మ మొక్క ఉంది దానికి ఆకుల కంటే గూడా పూత,  పిందే ఎక్కువగా ఉంది. కింద గూడ ఇంకా చాలానే ఉన్నాయి మొక్కలు. ఆమె అంత శ్రద్ద తీసుకుంటున్నది కనుకనే ఆ మొక్కలు అంత ఫలవంతంగా ఉన్నాయి అనిపించింది. మిద్దె తోట ను పెంచే మనం ఎవ్వరమైనా గూడా అట్లా శ్రద్ద తీసుకో గలిగినప్పుడే అంత చక్కని ఫలితాన్ని ఎక్స్ ఫెక్ట్ చేయగలం అనిపించింది . కరీంనగర్ కలక్టరేట్ లాంటి ఒక కాంక్రీట్ జంగల్ మధ్యన సహజ సిద్దమైన ప్రకృతిని తలిపించే పరిసరాలను వారు క్రియేట్ చేయడానికి ఎంతో నిబద్దత ఉంటే కానీ సాధ్యం కాదు. తన ఆరోగ్యం ఆనంద రహస్యాలు మిద్దె తోట పెంపకమే అన్నారు ఆ మానువాడ ఆడ బిడ్డ. వచ్చే టప్పుడు చక్కని సువాసనలు కలిగిన కొతిమీర , తాజా చుక్క కూర , చెట్టుమీదనుండి అప్పుడే కోసిన నిమ్మ, దానిమ్మ, జామ కాయల తో బాటు గా ఒక మునగ చెట్టు, కొన్ని కురాగాయాల విత్తనాలు ఇచ్చింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అది వారి ఆఫీస్ కం రెసిడెన్సీ, ఇంకో రెండు మూడు నెలల్లో అక్కడి నుండి వారు బదిలీ అయి వెళ్ళి పోయే అవకాశం ఉందట. చూడండి అంత అనిశ్చిత పరిస్తితి లో కూడా , కుదురు గా ఉండి గూడా ఏమీ చేయిలేని వారికంటే ఎంతో గొప్పగా తన తోటను తీర్చి దిద్దినారు .

ఇంకొక్క ముచ్చట జెప్పి ముగిస్త గని జర బోర్ ఫీల్ గాకుండ్రి . ఒక మిత్రుడు బంగుల పైకప్పు మిద్దె తోట  బరువు మోస్తదా అని అడిగితే రఘోత్తమ్ రెడ్డి సార్ జవాబు రాసిండు. ఇక్కడ నేను నా అనుభవం రాస్తే కొత్తవాళ్ళకు ఏమైనా ఉపయోగ పడుతుందో ఏమో అన్న తపన తోటి  చెప్తున్న.
\
చిన్నప్పటి నుండి ఎవుసమ్ జేసిన అనుభవం నాది . కానీ అది మా నాయిన సంపాయించిన  40 ఎకురాల ఎవుసం అనుభవమైతే ,  ఇది 4 ఫీట్ల తోటి పది  మడుల ఎవుసమ్. రిటైర్ అయిన తర్వాత ఎక్కడన్న కొంత భూమి తీసుకొని ఎవుసమ్ జేస్తే ఎట్లుంటదని అనుకుంట మిత్రుడు ఆకుల భూమయ్య తోటి ఆలోచన జేసిన. ఇన్ని రోజుల నుంచి ఎందరికో మాటలు జెప్పి అప్పుడే చెప్పిన మాటలు, చేసిన పనులు మరిచి పోయి నీ సంతోషం కోసం స్వార్త పూరితంగా ఆలోచిస్తే ఎట్లా అన్నడు . గతించిన మా సేవా కాలం లో మేము సమాజం నుండి మనం చాలా పొందినామన్న సంగతి ఒక్కటోక్కటిగా గుర్తు జేసెటోల్లమ్ . మనం పొందిన విద్య, ఉద్యోగం,తినే తిండి, కట్టే బట్ట,  ఉద్యోగం ద్వారా సంక్రమించిన సామాజిక హోదా, ఆ ఉద్యోగం వలన పొందిన వేతనం, ఆ వేతనం వలన పిల్లలను ఉన్నతంగా చదువించుకోవడం ,చాలా చాలా మంది కంటే మెరుగైన జీవనం గడుపడం ,  ఇవన్నీ సమాజం నుండి పొంది సామాజానికి మనం ఏమిస్తున్నామో ఎవరికి వారుగా మనల్ని మనం ప్రశ్నించు కోవాలని అనేక సందర్భాల్లో చెప్పిన వాళ్ళం గదా మనం. ఇప్పుడు ఇంకా కుటుంబ బాధ్యతలు గూడ   పెద్దగా లేవు కనుక నీకు నచ్చిన రంగం లో సామాజిక బాధ్యత నిర్వహిస్తే బాగుంటదని అన్నడు. నా బాధ్యతను మల్లోసారి గుర్తు చేసిండు. పర్యావరణ రక్షణ  పైన కొంత కాలం పనిజేసిన , ఆయన అమరుడు అయిన తర్వాత చాలా రోజుల దాకా కాలం నిరాసక్తి గా గడిచిపోయింది .ఎప్పుడో నేను రాసిన కతలను పుస్తకంగా అచ్చు వేయించిన అదీ మా పెద్దల్లుడు బుర్ర తిరుపతి ప్రేరణతో . అయితే  ఒక రెన్నెల్ల క్రితం మా పిల్లల దగ్గరకి పోయినప్పుడు మళ్ళీ ఎవుసమ్ మీదికి మనుసు మళ్ళింది. అది కూడా ఇగో ఇసొంటి ఇంటిమీదేవుసమే. అగో అప్పుడు రఘోత్తమ్ రెడ్డి సార్ ను ఫేస్ బుక్ ల చూసిన. మా సోపతి గూడా పాత కతల సోపతే . కనుక ఇండియా కు రాంగానే  సార్ ఇంటికి వెళ్ళి మిద్దె తోట చూసి వచ్చిన . ఆయన సూచన మేరకు సూదమ్ రమేశ్ గారి సిమెంట్ మడులను చూసిన .


కరీంనగర్ లో చౌకగా దొరికే షాబాద్ బండలు, తేలిక పాటి సిమెంట్ ఇటుకలు పెట్టి 4x4 ఫీట్ల తోటి 11 సిమెంట్ తొట్లు  కట్టించిన . 1 : 1 నిష్పత్తిలో మట్టి , మాగిన పెండ కలిపి తొట్ల ను నింపి , కొన్నింటిలో విత్తనాలు కొన్నింటిలో మొక్కలు నాటిన . మంచి వ్యాపకం . సంతృప్తి అనిపిస్తున్నది. రఘోత్తమ్ రెడ్డి సార్ రాసినట్టు ప్రకృతి పరిరక్షణ బాధ్యత, ఒంటి ఆరోగ్యం బాధ్యత రెండూ ఎంతో కొంత నిర్వహించి నట్లు అనిపిస్తున్నది. ( తొట్ల నిర్మాణానికి 18000/ మట్టి, ఎరువు కొని నింపడానికి 7000/ రూపాయల వరకు ఖర్చు వచ్చింది )

Tuesday, December 13, 2016

ఎవుసమ్ 7

                                                                       ఎవుసమ్ 7

ఈ రోజు ఉదయం నేను నా మిత్రుడు నాగేందర్ సార్ కల్సి మొక్కలకు నీళ్ళు పెడుతున్నం,  అప్పుడే పాత్రికేయ మిత్రుడు కరుణాకర్ గారు పోన్ జేసి మీరు పెంచుతున్న కూరగాయల తోట చూసి వార్త రాద్దామనుకుంటున్నాను ఇంట్లో ఉన్నారా అని అడిగిండు. ఆయనకు సాదరంగా స్వాగతం చెప్పిన. ఆయన రాసే వార్త వలన ఒక్కరు స్పూర్తి పొంది నా ప్రకృతికి మేలు జరిగి ఆయనకూ  ఆరోగ్యం చేకూరుతుంది గదా అన్న ఆశ తో . కరుణాకర్ గారి సోపతి జీవ గడ్డ పత్రిక నడుస్తున్న నాటి నుండి ఉంది. ఆయన ఇంటికి వచ్చి విజయ కుమార్ సార్ ఉన్నప్పుడు వచ్చిన్నంటే మళ్ళా ఇప్పుడే రావడం అని జీవ గడ్డ విజయ్ కుమార్ ను యాదికి తెచ్చిండు.

1970 ల నుండి కరీంనగర్ ల నిర్మల ప్రింటింగ్ ప్రెస్ ల విద్యుల్లత పత్రిక అచ్చు అయ్యేది. మిత్రుడు నాగేందర్ నేను ప్రెస్ కు  పోయినప్పుడు ప్రూఫ్ రీడింగ్ చూస్తుంటిమి .1970  నుండి 1973 దాకా మేము కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ డిగ్ర్ర్ కాలేజ్ ల చదువుతుండే వాళ్ళం .  మాకు మంథని లో ఉన్నప్పుడు లైబ్రరీ కి వెళ్ళి పుస్తకాలు చదివే వ్యసనం బాగా ఉండేది కనుక విద్యుల్లత పత్రిక మాకు పెద్ద చెరుకు గడ దొరికి నట్టే ఉండేది. అక్కడనే మాకు " సృజన " తో పరిచయం అయింది.అప్పటి దాకా గాంధీ మహాత్ముడే ఇంగ్లీషోళ్లతోటి  కొట్లాడి దేశానికి స్వాతంత్రం తెచ్చిండాని నమ్మేటోల్లమ్ . ఈ పత్రికలను చదివిన తర్వాతనే మాకు దేశం కోసం ఎవరవరు ఎట్లా త్యాగాలు చేసిండ్రో అర్థం అయ్యింది.

కరుణాకర్ గారు టీ పాయ్ మీద ఉన్న " ఇంటి పంట " పుస్తకం చేతి లోకి తీసుకొని మిద్దె తోటలు పెంచే కాన్సెప్ట్ ను ఇక్కడ  ఈ సారే మొదలు పెట్టిండా అని రఘోత్తమ్ రెడ్డి సారు పోటో చూపుతూ అడిగిండు. నాకు తెలిసి అయితే రఘోత్తమ్ రెడ్డి గారు ఆరేడు యేండ్ల నుండి ఈ కృషి చేస్తున్నాడు. అంతకు ముందు ఎవరైనా చేస్తే చేసి ఉండవచ్చు . కానీ ఈయన వల్ల , ఆయన రాస్తున్న రాతల వలన జనం లో బాగా ప్రాచుర్యం లోకి వచ్చిందని చెప్పిన .మిద్దె తోటల గురించిన వార్తలు రాయడానికి ఈ పుస్తకం చాలా ఉపయోగ పడుతుంది కనుక  ఈ పుస్తకం నేను తీసుక వెలతా అన్నారు. వాస్తవానికి ఆ పుస్తకాలు సూదమ్ రమేశ్ గారని మన మిద్దె తోట మిత్రుడు నిన్న  నే  కరీంనగర్ లో ఉన్న మిద్దె తోట సేద్యకారులకు ఇవ్వుమని రఘోత్తమ్ రెడ్డి సార్ పంపించినాడని ఇచ్చి పోయిండు . సరే పాత్రికేయుని చేతిలో పడితే పది మందికి అందులోని సమాచారం వెళ్తుందన్న ఆశతో ఆ పుస్తకం వారికి ఇచ్చాను, పంపిన వారి అనుమతి లేకుండానే.


మిద్దె తోట లో పెట్టిన బీర, సొరకాయ, కాకరకాయ విత్తనాలు మొలకెత్తి చాలా రోజులే అవుతున్నా కూడా తీగలు ఇంకా వేయడం లేదన్న ఆతృత  నాలో. చలికా , లేక ఎరువు ఎక్కువయ్యిందా ఏమైనా అనేది నా ఆతృతకు కారణం. నా ఆతృత కాక పోతే దానికి ఆ వయసు రావద్దూ ? నాలోకి నేనే ఒక సారి తొంగి చూస్తే ఈ తరం తలిదండ్రులు ఎలాగైతే తమ పిల్లలకు మూడేన్లు దాటక  ముందే ముద్దార చదువక పోతున్నారే అని ఆన్ధోలన చెందినట్టుగానే నేనూ ఆలోచిస్తున్నాను  కదా అనిపించింది. ఎందుకు నేను ఇట్లా ఆలోచిస్తున్నానా అని అవలోకిస్తే , నేను ఓ రెండు వేలు పెట్టి నిలువు పందిరి చేయించినా కదా ? మరి ఆ పందిరికి ఈ తీగలు ఎక్కాలి కదా ?ఇంకా ఎప్పుడు ఎక్కుతాయన్న ఆన్ధోలన ,  ఓహో ! ఇదన్న మాట ఆంతర్యం. సాధ్యమైన కాడికి ప్రకృతి వనరులను పిండి పిప్పి జేసి కూడబెట్టిన సంపాదన వినియోగం లోకి రావాలి కదా?  అందునా తన సంతానానికి దక్కాలన్న స్వార్థంపు ఆలోచనకు నాందే అన్నీ తొందరగా ఎదుగాలన్న , అన్నీ తొందరగా అనుభవించాలన్న ఆలోచనలకు కారణం అనిపించింది. ప్రకృతి ప్రేమికులు గా, ప్రకృతి పరిరక్షకులు గా పండకుండానే , పండించ కుండానే , ఫలితం అనుభవించడం నేరం కదా ? పండించ కుండానే అంటే నా భావం , ఉత్పత్తి లో భాగం కాకుండానే  అని అర్థం . అందుకని ఎవరికి వాళ్ళం ఎంతలో కొంతైనా ఉత్పత్తిలో భాగం అవుదాం రండి !

Sunday, December 11, 2016

అశోకం

ఆదివారం ఆంధ్ర జ్యోతి ల ఓల్గా రాసిన " అశోకం " కథ చదివిన తర్వాత మోడి పాలనకు ఆ కథ లోని కొన్ని సంభాషణలకు  దగ్గరి సంభంధం ఉన్నట్టు అనిపించింది.
కథ మండోదరి, సీత, ఆర్య ద్రావిడ సంస్కృతి గురించి ఉంది.
రావణుడికి ఆర్య సంస్కృతి పైన మోజు పెరిగిందట. దాన్ని తాము అందుకొనక పోతే వెనుకబడి పోతామేమో,ఆ మహోధృతి లో ఇక తాము మిగులమేమో అన్న  దిగులు పట్టుకోని నగర లోలత్వం లో పండ్లు, ఫలాలు ఇచ్చే అనేక వృక్షాలను , ప్రకృతిని కాపాడి ప్రాణ వాయువును ఇచ్చే అనేక అడవులను నరికి వేసి అశోక వనం నిర్మిస్తాడట .
అప్పుడు మండోదరి రావనుడి తో అంటుందట " ఆర్య నాగరికతలో ఆడదాని శోకం వినబడుతున్నది . నువ్వు ఎంత ప్రయత్నించినా నగరం లో దాని విషాద ఛాయలు ప్రవేశించక మానవు , అరణ్యాన్ని తీసి వనాన్ని పెంచుతున్నావు."

మోడి కి కూడా విదేశే మోజు బాగా పెరిగింది. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం లో వెనుక బడి పోతే ఎక్కడ మిగుల కుంట పోతామేమో అన్న భయం పట్టుకునట్టు ఉంది. స్మార్ట్ పోన్, ఇంటర్నెట్, క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్,అంటూ "  నగరీకరణ
నాగరికతను నేర్పించడానికి నానా తంటాలు పడుతున్నడు. ఆర్య నాగరికతలో మండోదరికి ఆడదాని శోకం వినిపించినట్లు ఇక్కడ కార్పొరేటీకరణలో దినసరి కూలీల, స్ట్రీట్ వెండర్ల, చిరు వ్యాపారుల శోకం మొదలైతదన్న విషయం ఆయనకు పట్టడం లేదు.

నిన్న హైద్రాబాద్ లో ఆటో లో వస్తుంటే జనం బారులు తీర్చి ఉంటే ఏ టి ఏం ఉందేమో అనుకోని దృస్టి సారించి చూస్తే అది రిలేయన్స్ ఫ్రెష్ . ఎందుకు అంత మంది ? బయట షాపులు లేవా అంటే,  సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కార్డ్ సౌకర్యం ఉందని అట . ఇక్కడ మోడి విధానాలు ఎవరికి మార్కెట్ అవుతున్నది. ఎవరికి దోచి పెడుతున్నట్టు? స్వైప్ మిషన్లు, ఇంటర్ నెట్లు, స్మార్ట్ ఫోన్లు, క్రెడిట్, డెబిట్ కార్డులు ,పేటియమ్ లు,   వాటి మార్కెట్ ప్రజల నిత్యావసరాల తో ముడి పెట్టి , గ్రామీణ భారత ప్రజల విద్యా , వైద్యం రవాణా, బాధ్యతల నుండి పూర్తిగా వైదొలిగి ఆర చేతిలో  లో వైకుంఠం చూపేడుతున్నాడు . ఆయన భజన సంఘం ఏమో అచ్చే దిన్ ఆగే హై అంటున్నది.

" ఏది ధర్మమో నిర్ణయించే అధికారం చేతి లోకి తీసుకున్న వారు ఏ మాటలైనా చెప్పగలుగుతారు. ఎంత ప్రాజాపకారం చేసినా అది ప్రజోపకారమే అని బుకాయించి నమ్మించే ప్రయత్నం చేస్తారు. "

అశోకం కథలో మండోదరి అంటుంది " ప్రతి నగరం లోనూ రావణ కాస్టమ్ ఒకటి రగులుతోంది . రావణుడి చితిని ఆరకుండా చేసింది రాముని ఆర్య సంస్కృతి . ప్రతి నగరం లో అవి మండితేనే తమకు మనుగడ అని ఆ సంస్కృతి భావిస్తోంది " . ఈ మాటలు ప్రస్తుత పరిస్తితులకు సరిగ్గా సరిపోతున్నాయి.


ఎవుసమ్ 6

                                                              ఎవుసమ్  6

నేను దుంప బచ్చలి కోసం రఘోత్తమ్ రెడ్డి సార్ ను అడిగిన విషయం ఎఫ్ బి ల చూసిన జయంత్ సార్ నా కోసం దుంప బచ్చలి మొక్క తీసుకొనచ్చిండు. నాకు చాలా సంతోషం అయ్యింది. అయితే నాకు కొన్ని టమాటా, మిరుప మొక్కలు కూడా కావాన్నని , అవి ఎక్కడ దొరికే అవకాశం ఉందని అడిగిన. హైద్రాబాద్ రోడ్డుల తిమ్మాపురం స్టేజ్ తర్వాత రోడ్డు పక్కన కొన్ని కూరగాయల నర్సరీలు ఉన్నట్టు సార్ చెప్పిపోయిండు .
తెల్లవారి రోజు నేను, నా మిత్రుడు నాగేందర్ సార్ కల్సి రోడ్డు వెంట చూసుకుంట పోయినం . తిమ్మ పురం స్టేజ్ పక్కనే ఒక నర్సరీ ఉంది. అలాగే చాలానే ఉన్నాయి. ఒక నర్సరీ లోపటికి వెళ్ళి చూసినం . టమాట , మిరుప, కాలి ఫ్లవర్ , మునగ, బొప్పాయ మొక్కలు చాలా ఆరోగ్యంగా పెంచబడి ఉన్నాయి, నాకు అబ్బురమే అనిపించింది. నా అనుభవం లో రైతులే వారికి అవసరం ఉన్న మొక్కల కోసం నారు పెంచుకుందురు. మా చిన్నతనం లో అయితే రైతుల ఇండ్లల్లనే అవసరం అయిన విత్తనాలు ఉండేటివి. ఇప్పుడంటే విత్తనాల దుకాణం ల కొని నారు పోసుకొనేటోల్లు .
తీరా ఇక్కడ రెడీ మేడ్ మొక్కలు దొరుకుతున్నయ్ . అవి ఎవరివి అని ఆరా దీస్తే ఆంధ్ర నుంచి వచ్చి కౌలు కు తీసుకొని నారు పెంచుతున్నారని తెల్సింది. ఇప్పుడిప్పుడే స్టానిక రైతులు కూడా పెంచుతున్నారట. మొక్కలు అమ్ముడు పోతున్నాయా అని ఆరా దీస్తే వెంట వెంట నే పోతున్నాయట , అందుకే ఒకరి పైన ఒకరు పోటీలుబడి నర్సరీ దొడ్లు పెడుతున్నారని చెప్పిండ్రు. రైతులకు కూడా సమయం కల్సి వస్తున్నదట .
బాగానే ఉందని పించింది . అవసరాలకు అనుగుణంగా మార్కెట్ , దాని రూపాన్ని ఎట్లా మార్చుకుంటుందో అక్కడ కనిపించింది. ఆధునిక కాలానికి నా బాల్యానికి అంటుబంధం తెగుతున్నట్టు అనిపించింది.
మా చిన్నతనం ల ఏ కాలం కూరగాయలు ఆ కాలం లో ఇంటి అవసరాలకు పోగా మిగిలింది దగ్గరి వాళ్ళకు ఇచ్చుకుందుమ్ ఇంకా మిగిలినప్పుడు ఇంటికి వచ్చే వారికి కూడా ఇచ్చేటోల్లమ్. పాడి ఉన్న ఇండ్లల్ల పెరుగునుండి వెన్న దీసిణాంక మిగిలిన చల్లను ఎవరడుగుతే వాళ్ళకు పోసేది. సల్ల అమ్ముడు ఉండేది కాదు. ఈ కూరగాయల విత్తనాలు గూడా ఎవరు అమ్మినట్టు, కొన్నట్టు నా యాదిల లేదు. అవసరం ఉన్నోళ్ళు అడుగుతే , ఎవరిదగ్గరన్నా ఉంటే ఇద్దురు . మనుషుల మధ్యన సంబంధాలు ఇచ్చి పుచ్చుకొనే తీరుగా ఉండేటివి. ఎక్కన్నన్న చిన్న చిన్న గొడవలు వచ్చినా పండుగలప్పుడో, పెండ్లిల్లప్పుడో మాట్లాడుకునుడు అయి కలిసి పోదురు . మనుషుల మధ్యన ఒక సుహృద్భావ పరిస్తితులు ఉండేటివి. కానీ ఇప్పుడాన్ని వ్యాపార సంబంధాలే!
అనుకుంటా మొక్కలు కొనుక్కొని తెచ్చి నాటిన. అన్నీ బతికినయి. మిరుప టమాట, వంకాయ మొక్కలు రోజు పలకరిస్తున్నయి . మా చిన్నప్పుడు పెద్ద ఎవుసమ్ జేసిన్నాడు ఇంత థ్రిల్లింగ్ అనిపించ లేదు. ప్రతి మొక్క తోటి ఇప్పుడో దైహిక సంబంధం, దాని ప్రతి ఎదుగుదల లో మనది మాత్రమే అయిన శ్రమ , స్పర్శ ఉన్న కారణంగానో ఏమో సమయం చిక్కినప్పుడల్లా అక్కడికి పోబుద్ధి ఔతున్నది. వాటికి మనకు మధ్యన ఏదో సంబంధం. మనది ఖచ్చితంగా వ్యాపార సంబంధమే , కానీ మొక్కలదే ప్రకృతి సంబంధం.
జంధ్యాల పాపయ్య శాస్త్రి" పుష్ప విలాపం"  లో ఆ పువ్వులు ఇట్లా అంటాయట ,

ఆయువు గల్గు నాల్గు ఘడియల్ కనిపెంచిన తీగ తల్లి జాతీయత తీర్చి దిద్దేదము
తదీయ కరమ్ముల లోన వెచ్చగా ఊయల లూగుచు మురియుచుందుము
ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ కాలి వ్రేళ్ళ పై !


అట్లా తనను కని పెంచిన తల్లి రుణం మొక్కలు తీర్చుకుంటాయని అన్నాడు కవి. కానీ మనమో !