Friday, April 28, 2017

మనుసుల మాట 3 .

                                                        

1990 దశకం లో ఓరుగల్లు పోరుగడ్డ పైన పది లక్షల మంది తో , తమ జీవించే హక్కుకోసం ,సమాన అవకాశాల కోసం,  సమ సమాజం కోసం  రైతు కూలీ లందరూ కలిసి  మహా సభలు జరుపుకున్నరు. ఆ సభలల్లో పాట లు విన్నవారికి గుర్తుండే ఉంటుంది, పాట పాలక వర్గాన్ని , తమ హక్కుల కోసం, నిలదీసింది, ప్రజల హక్కులు పాలకవర్గాన్నుండి కాపాడుకోవడం  కోసం కలిసి ఉద్యమించ వలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది. కానీ " ఆకాశంబునందుండి  ,  హిమాలయ సానువుల పైనుండి, శివుని ఝటా ఝూటము నందుండి " గంగా , ఉత్తుంగ తరంగాన్నుండి , భూమి పైకి  దునికి వచ్చి భగీరథుని పూర్వీకుల స్మితా భస్మం పునీతమ్ జేయడానికి , గంగానది తలవంచుకొని భగీతతుని అడుగుజాడల వెంట నడిచినట్టుగా నిన్న అదే  ఓరుగల్లు పోరుగడ్డ నుండి పాట రాజుల రాజరికాన్ని కీర్తిస్తూ నర్తించిన విధానం చూసిన తర్వాత మనుసుల కలిగిన భావనలు మీతో పంచుకుందామని ఇది రాస్తున్నాను.

1857 లో జరిగిన మొదటి భారత స్వాతంత్ర యుధ్ధం లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు లో బ్రిటిష పరిపాలన వలన అణిచివేతకు గురైన అనేక ప్రాంతాల రాజులు వారి సైన్యం పాల్గొన్నప్పటికినీ దానికి నాయకత్వం కావాల్సి వచ్చినప్పుడు 81 సంవస్తారాల వృధ్ద్ధుడైన మొఘల్ వంశస్తుడైన బహదూర్ షా ను ముందు నిలుపుకోవాల్సి వచ్చింది. ఇక్కడ తెలంగాణ లో ఏమి జరిగిందో కూడా ఒకసారి చూద్దాం.  

మొఘలుల తాబేదారుగా నియమించబడిన అసఫ్జాహీ వంశస్తుడైన నిజాం చక్రవర్తి పాలన సాగుతున్న కాలం లో నైజాం పేరు తో పాలన జేస్తున్న స్టానిక దొరలు భూస్వాముల ఆగడాలు మితిమీరిన ఫలితంగా తెలంగాణ లో రైతుకూలీలంతా ఏకమై నిజాం అధికార, ఆర్థిక ,  మూలాలకు ఆయువుపట్టైన దొరల గడీలా పైన తిరుగుబాటు జేసిండ్రు . దాన్నీ తెలంగాణ సాయుధ పోరాటం గా చెప్పుకుంటున్నం,. అప్పుడు కామ్రేడ్ యాదగిరి పాడిన " బండేనుక బండి గట్టి ", సుద్దాల  హనుమంతు పాడిన " పల్లెటూరి పిల్లగాడ" లాంటి అనేక పాటలు ప్రజలను సమీకరించడానికి , దొరతనం పైన పోరాటం జేయడానికి ప్రజలకు గుండె ధైర్ణం ఇచ్చినయి. అణిచివేతను, ఆధిపత్యాన్ని సహించని లక్షణం మూలవాసులది. ఆ మూలాలనుండి పుట్టి పెరిగి వచ్చిన తెలంగాణ సమాజం నిరంకుశ నిజాం పాలనను కూల్చివేయడానికి పాటను ఆయుధంగా వాడుకున్నది. భారత యూనియన్ సర్కారు సేనలు నిజాము ను లొంగదీసుకొనే పేరు తో తెలంగాణ లో ప్రవేశించి పనిలో పని గా తెలంగాణ సాయుధ పోరాటాన్ని తన " ఉక్కు పాదం " తో సమూలంగా తొక్కి వేసింది.

1948 నుండి 1969 దాకా 21 యేండ్ల కాంగ్రెస్ పాలనలో కూడా  తెలంగాణ సమాజానికి దక్కవలసిన హక్కులు దక్కక పోవడం చేత తొలి దశ ఉద్యమం 1969 వచ్చింది. ఇక్కడ కూడా తెలంగాణ పాట ప్రధాన పాత్ర పోషించింది.  అది కూడా ఉక్కు పాదం తో అణిచివేయబడిన తర్వాత , 1970 లోవచ్చిన  వసంత మేఘా ఘర్జనలకు మేఘాలు ద్రవించి వర్షం కురిసినట్లుగా తెలంగాణ లో దొర తనానికి వ్యతిరేకంగా , ఆధిపత్యానికి వ్యతిరేకంగా పాటను ఆలంబన జేసుకొని ఒక గూడ అంజన్న, ఒక గద్దర్, ఒక సంజీవ్, ఒక జయరాజన్న, దొర ఏందిరో దొర పీకుడేందిరో అని నిలదీసుడు షురూ జేసిండ్రు. లక్షలాది మంది వారివెనుక దండుగట్టిండ్రు. సహించలేని కాంగ్రెస్ సర్కారుగానీ, ఆ తర్వాత వచ్చిన టి.డి.పి. సర్కారు గాని అదే ఉక్కు పాదం తో అణిచివేత పేరుతో తెలంగాణ ఉద్యమ కారులను పట్టుకొని కాల్చి చంపిన చరిత్ర చదివినమ్. కానీ కనీసం  రాజ్యాంగ విహితమైన ప్రత్యేక తెలంగాణ ఐనా సాధించుకుందాం అని  1997 వరంగల్ డిక్లరేషన్ , ఆకుల భూమయ్య కన్వీనర్ గా తెలంగాణ జనసభ, పాశం యాదగిరి కన్వీనర్ గా తెలంగాణ ఐక్య కార్యా చరణ కమిటీ జీవన్మరణ పోరాటాలు జెసి ఎందరో కార్యకర్తలను పోగొట్టుకున్నది. ముందు వరుసల ఉన్న నాయకత్వం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడినప్పటికినీ అనుచర గణాలు మాత్రం, అణిచివేతనుండి కొంత వెసులుబాటు దొరికితే బాగుండుననుకుంటున్న కాలం లో 2001 లో వచ్చిన ఈ రాజకీయ పార్టీ వచ్చింది.  ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాటం జేస్తున్న వారికి ఈ రాజకీయ పార్టీ ,  ఒక కవచం వలె ఉపయోగ పడుతుందనుకొన్నారు.   ఫలితంగ ముందువరుసలో ఉండి  పోరాటం జేస్తున్న శక్తులన్నీ ఇటువైపు రాలీ అయినాయి. మిలియన్ మార్చ్ , సాగరహారం, సకలజనుల సమ్మె లాంటి అనేక పోరాటాలకు  వెన్ను దన్నుగా నిలిచింది  మాత్రం మొదటినుండి చెప్పుక వస్తున్న తెలంగాణ  పోరువారసత్వమే !  దాని ఫలితమే  భౌగోళిక తెలంగాణ .

  1857 సైనిక్ మ్యుటినీ అణిచివేయబడింది. తిరుగుబాటు లో పాల్గొన్న యుద్ధయోధులను చంపివేస్తే నాయకత్వం వహించిన నేరానికి బహదూర్ షా రాజభరణం రద్దుజేసి జైల్లో వేస్తారు. ఆ మ్యుటినీ గెలిచి ఉంటే బహదూర్ షా మళ్ళీ చక్రవర్తి అయ్యేవాడు.  పాపం ఆయన పోరాటం లో భాగస్వామి కాకపోయినా గూడా !  ( చెప్పవలిసిన చెరిత్ర ఇంకా చాలా మిగిలే పోయింది, సంక్షిప్తత దృస్ట్యా ముగిస్తున్నాను)

Thursday, April 20, 2017

మనుసుల మాట 2

                                                    
మొన్న ఒక రోజు మా ఉపాధ్యాయ ఉద్యమ మిత్రుడు పెద్దపల్లి లో ఉండే జీవన్ రాజు గారి వద్దకు వెళ్ళిన. అంతకు ముందు ఆయనకు నేను వాట్స్ అప్ లో ఇక పోస్ట్ పంపించి ఉంటి . అందులో కార్పొరేట్ స్కూల్ హాస్టల్ లో చదువే ఒక పిల్లవాని వేదన, బాధ ఎట్లా ఉంటదో ఆ అబ్బాయే రాసినట్టు, ఆ వాట్స్ అప్ పోస్ట్ లో ఉంది. .  ఆ విషయం ఆయన గుర్తు జేసి మీరు పంపిన పోస్టులో పసివాళ్ళ బాల్యాన్ని తలిదండ్రులే ఎలా నలిపివేస్తున్నారో బాగానే చెప్పిండ్రు గాని, వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉంది సార్ అన్నాడు.
అవునా ఎట్లా ఉందేమిటీ అన్నాను.
మా మనుమడు ఇంట్లో అసలు చదువడు, ఆయనకు ఎప్పుడు చేతిల ఐ పాడ్ ఉండాలే , లేదంటే స్మార్ట్ ఫోన్ ఉండాలే, ఇయ్యకుంటే ఇల్లుపీకి పందిరి వేస్తడు . ముందుగాల తల్లులు అన్నం తినిపించేటప్పుడు వాటిని అలువాటుజేస్తున్నారు . ఆ అలువాటు ను వాళ్ళు మరువ లేక పోతున్నరు. అని అంటూ ఇంకో ఉదాహరణ చెపుతానంటూ , ఒక యెంగ్ ఫాదర్  తనకు పుట్టిన తొలుసూరు కొడుకును అతిగారాబంగా పెంచి, ఇతడు ఎటు పోయినా బండి మీద వెంట తీసుక పోవుడు అలువాటు జేసిండట . ఆఖరుకు వాడు అయ్యలెందే అడుగు ఆవల పెట్టని పరిస్తితి అట.  బడికి గూడా నువ్వు అక్కడ ఉంటేనే నేను ఉంటా అని మారాం జేస్తున్నాడట . ఇగ ఇట్లా జేస్తే గాదని , ఆ పిల్లవాన్ని హాస్టల్ లో వేసి వచ్చిండట. అని చెప్పుతూ తన మనువడిని గూడా హాస్టల్ లో వేసి వచ్చినమ్ అన్నడు.
ఆ తర్వాత మా ఇద్దరి మధ్య జరిగిన చర్చలో చాలా మంది తలిదండ్రులు పిల్లలను అతి గారాబం జేస్తున్నారు అనీ , , తమ కు ఏదైతే ఎంతో కస్టపడితే గాని అందలేదో అది తమ  పిల్లలకు  కస్టమ్ లేకుండా అందాలన్న తపన, ఆరాటం లో వాళ్ళకు అడిగిండల్లా అందిస్తూ , పిల్లలు తాము ఏదీ కోరినా తమ తలిదండ్రులు ఏదో విధంగా అందిస్తారు లే అనే సూత్రీకరణకు వచ్చే విధంగా తలిదండ్రులే కారణం అవుతున్నారనీ ,  తాము కస్టపడి దాన్ని సంపాదించుకోవాలి, కస్టపడితే గాని దాన్ని పొందలేము అన్న జ్ఞానం వారికి అందకుండా తలిదండ్రులే పిల్లలను ఈ రకంగా తయారు జేస్తున్నారని అనుకున్నాము. మన కాలం లో మన పిల్లలు ఇట్లా చూసిందల్లా అడుగక పోదురు. ఒక వేల అడిగినా అది మనకు అందుబాటులో ఉండని విషయం వాళ్ళకు చేప్బితే అర్థం జేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. కొందరు పిల్లలైతే ఎవరి ప్రభావమో గానీ ఇసోంటోనివి మరి మమ్ములను ఎందుకు కన్నవని గూడా అడుగుతున్నరట , అని ఆశ్చర్య పోయినమ్.
ఇంతల నాకు ఒక విషయం యాదికి వచ్చి ఇద్దరం షేర్ జేసుకున్నం. కరీంనగర్ శివారులో ప్రతిమా మెడికల్ కాలేజీ ఉంటది. దానికి సమీపం లోని హోటల్ లో నేను ఒకసారి చాయ్ దాగుతున్న. ఇంతల నలుగురైదుగురు మెడికల్ విద్యార్థులు కూడా అక్కడికి చాయ్ కు వచ్చిండ్రు. వాళ్ళంతా హౌస్ సర్జన్ జేస్తున్నట్టు అర్థం అయింది. హౌస్ సర్జన్  తర్వాత ఏమి జేసుడు అని వాళ్ళ మధ్య చర్చ వచ్చింది.
" మా డాడీ ది పెద్ద నర్సింగ్ హోమ్ . నాకు పెద్దగా కస్టపడవలసిన అవసరం లేదు. ఈ ఎంబీ బిఎస్స్ సీటు గూడా మా డాడీ కొని ఇచ్చిందే " అని ఒకరు అంటే, మరొకరేమో " మా డాడీ ఎన్ని కొట్లైనా ఖర్చు పెట్టి నాకు పీజీ సీటు కొని ఇస్తాడనీ " అనుకుంటున్నరు. డబ్బులు పెట్టి విద్యా కొనుక్కోవడం , మళ్ళీ వడ్డీతో సహా వసూలు జేసుకోవడం అయిపోతున్నదికదా అని  అనుకుంటూ ,  ప్రొఫెషనలిజం ఎక్కడున్నది అని ఇద్దరం వాపోయినమ్. .

మహా విప్లవ యోధుడు , రెవెల్యూషనరీ లెజెండ్ గా పిలువబడే  " చేగువెరా " , తాను డాక్టర్ చదువు చదివినప్పటికినీ తాను డాక్టర్ గా కంటే విప్లవకారునిగా సమాజానికి ఎక్కువ న్యాయం చేయగలనని నమ్మి  , అమెరికా  ఆధిపత్య ధోరణితో లాటిన్ అమెరికా దేశాలను అణిచివేస్తన్నప్పుడు ఆయన దక్షిణ అమెరికా లోని గ్యాటిమాల లో విప్లవమ్ లేవదీసి దాన్ని ఇతర లాటిన్ అమెరికా దేశాలకు విస్తరింప జేసిన వాడు, ఫెడరల్ క్యాస్త్రో ప్రభుత్వం లో మంత్రిగా, విదేశీ రాయబారిగా ,కమ్యూనిస్ట్ ప్రభుత్వం లో ఎన్నో బాధ్యతల్లో  పనిజేసిన వాడు . అలాంటి ఆయన కొడుకు ఒక సారి ఏదో వేదిక నుండి మాట్లాడుతూ " మా నాన్న మాకు ఏమీ సంపాదించి కూడబెట్టకుండా మాకు మహోపకారం జేసిండని " చెప్పిండట . కానీ మనకు ఇప్పుడు, అంబానీలు, ఆదానీలు ఆదర్శమై పోతున్నారు.తమ సంతానానికి సంపద కూడా బెట్టి ఇస్తే సరిపాయే , విలువల వలువలు ఎంత ఊసిపోయినా మాసిపోయినా ఫరువాలేదని తలిదండ్రులు,  తమ తమ అయ్యవ్వలు సంపద కూడా బెట్టి ఇవ్వాలని పిల్లలు భావిస్తున్న పరిస్తితి.

Friday, April 14, 2017

మనుసుల మాట 1

                                                    

తెలంగాణ ముఖ్యమంత్రి రైతులకు ఎరువులు ఉచితంగనే ఇస్తడట అన్న ముచ్చట చదివినంక చిన్నప్పుడు మా నాయిన జెప్పిన సాత్రమ్ మతికచ్చింది . ఆయిన ఏదన్న ముచ్చట జెప్పుతే అది కథ తీరుగానే ఉండేది.

వందేండ్ల కిందట మా ఉర్లే పొద్దుగాల  ముంతవట్టుకొని పోకడగూడా అడివిలకే ఉండేదట. అంటే అడివి ,  ఊరును ఆనుకొనే ఉండేదట . నెమలి పిట్టెలు మేతకోసం అప్పుడప్పుడు పంట సెండ్లళ్లకు వచ్చేటియట. ఒక నెమిలి పిట్ట రోజు అడివంచుదాక వచ్చి పంట సేండ్ల వడి ఏరుక తిని పోయెదట. ఆ నెమిలి పిట్టెను గమనిస్తున్న ఓ ఇగురమంతుడు , " నెమిలి పిట్టే , నెమిలి పిట్టే , నువ్వు రోజు అడివిల నుంచి ఇంత దూరం దాకా నడిచి వచ్చి ధాన్యం ఏరుక తింటున్నవ్ గదా , నీకు గంత కస్టమ్ ఎందుకు ,  నడిచి నడిచి నీ సొగసు, వొయ్యారం , అందమంత అలిసిపోతాంది  , నాకు రోజుకు నీ ఒంటిమీదున్న ఒక్క ఈక పీకి ఇస్తివా అంటే నీకు రోజు తినే అంత ధాన్యం , అడివంచుదాక తెచ్చి ఇస్తా , నీకు ఈ సేను సెలకల సుట్టు దిరిగే కస్టమ్ లేకుంట నీకు సేవ జేస్త ,"  అన్నడట .
నెమలి పిట్టెకు ఇదేదో చాలా బాగానే ఉంది గదా అనిపించిందట. సరే మంచిది అని ఒప్పుకున్నదట . ఇగ అప్పటి నుంచి రోజు అడివిల నుంచి నెమిలి పిట్ట బయిటికి రాంగానే ఈ ఇగురమంతుడు ఓ బుట్టనిండా ధాన్యం తీసుకపొయ్యి దాని ముందట వెడితే , అది ఆ ధాన్యం తిని ఓ ఈక అతనికి ఇచ్చి అడివిలకు పోయి నిద్రపోయెదట . కొన్ని రోజులకు నెమిలి పిట్టే పెయి మీదున్న ఈకలన్నీ ఒడిసి పోయినై. ఈకలు ఒడిసిపోయినంక , ఇగురమంతుడు ఇటుదిక్కు మర్రి చూడ లేదు. కడుపులకు ఆహారం లేక, ఎగిరి పొయ్యేతందుకు రెక్కలకు ఈకలు లేక కస్టపడి ఆహారం వెదుక్కోనే అలవాటూ ఓపిక లేకుంట పోయింది. అందం వొయ్యారం అన్నీ లేకుంట పోయినై. బూరు పీకిన కోడి తీరుగా సొడలు , సోడలు పోతున్నదట , నడువలేక.   ఆకరికి   రేసుకుక్కల వేటకు నెమలి పిట్టే బలై పోయిందట " అని మా నాయిన సాత్రమ్ అయిపోయిందన్నడు.  

రైతులు పండిచ్చిన పంటకు గిట్టుబాటు దర లేక రైతులు ఎంతగా అల్లల్లలాడి పోతున్నారో అందరం దినామ్ చూస్తునే ఉన్నాం. . వాళ్ళ ఆత్మహత్యలు ఆపండి అని నెత్తినోరు కొట్టుకుంటూ దేశమంతా మొత్తుకున్నాగూడా  రైతుల ఆత్మహత్యలు ఇయ్యాల కొత్తయా అని సర్కారు ఎదురు ప్రశ్నలు వేసిన ఉదంతాలు చూసినమ్. ఇయ్యాల పుక్కటికే ఎరువులు ఇస్తామంటే ఇండ్ల ఏదో మతులబు ఉండున్టది అని జనమంతా  అనుకుంటుండ్రు. రసాయన ఎరువుల కూడు తిని ఆరోగ్యాలన్నీ పాడై పోతున్నయని ఒగదిక్కు లోకమంతా కొడై కూస్తుంటే ఈనే ఇప్పుడు "  రసాయన ఎరువులు ముద్దు ఆరోగ్యాలు రద్దు " ,  " ప్రజల ప్రాణాలు, పైసలు- ప్రైవేటు విద్యా వైద్యాల పాలు " . అంటూ కుయుక్తులు జేస్తున్నడు .  నిజంగా సర్కారుకు చిత్తశుద్ది ఉంటే ప్రైవేటుకు తావులేని విధంగా నాణ్యమైన విద్యా వైద్యం ప్రజలందరికీ సమానంగా ఉచితంగా  అందేటట్లు చూస్తూ రైతులు పండిచ్చిన పంటకు గిట్టుబాటు దర చెల్లించే ఏర్పాటు జేస్తే ఏ ఉచితాలు ప్రజలు ప్రభుత్వం నుండి కోరుకోరు.

పైనజెప్పిన కథల ఇగురమంతుని ప్రేమంతా ఈకల మీదనే గాని నెమలి పిట్ట ఆరోగ్యం, ఆకలి మీద కానట్టే ఇక్కడ సర్కారోని ప్రేమంతా ప్రజల ఓట్ల మీదనే గాని వాళ్ళ బతుకుదెరువు మీదగాదన్న సత్యాన్ని ప్రజలు గ్రహిస్తారని ఆశిద్దాం.

                          

Monday, April 3, 2017

ఇంటిమీదెవుసమ్ 39

                                             


ఇయ్యాల పొద్దుగాల మొక్కలకు నీళ్ళు పడుతుంటే ఒక గొప్ప అనుభూతి కలిగింది. నవవవలాడుతున్న, తోట కూర, పాల కూర , మొక్కలు ఒకవైపు, మరో వైపు పోంగా పోంగా దక్కిన బిడ్డల తీరుగా ఆనిపకాయ పిందెలు మరో వైపు ఆరోగ్యంగా కండ్లకు కనిపించేవారకు , నేను పోస్తున్న నీళ్ళు వాటికి జీవధారాలు అవుతుంటే, వాటి భాష  కంటికి కనిపించక పోయినా నీవేదో మంచిపనే  చేస్తూన్నావని మొక్కలు అనుకుంటున్నట్టు ఒక భావన మనుసులో మెదిలింది .  ఒక  ఎంతో హాయి అనిపించింది. కాకుంటే నేను కురిపిస్తున్న ప్రేమంతా చివరికి వాటిని కూర వండుకోవడానికే గదా అనుకున్న. కానీ,  వేతనం తీసుకొనే అయినా , ప్రతిఫలాపేక్ష  లేకుండా చేసిన కొన్ని పనులు  గూడా , నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చిన , కొన్ని పాత జ్ఞాపకాలు కూడా మనుసుల సుళ్ళు దిరుగుతూ  మీతో పంచుకోవాలని ఒక్కటే ఆరాట పడుతున్నై .


డిగ్రీ కాంగానే ఏరకమైన ట్రెనింగ్ లేకుండానే గంగారం హైస్కూల్లో లెక్కల సార్ గా ఉద్యోగం వచ్చింది. అది అప్పుడు అప్ గ్రేడెడ్ హైస్కూల్ కనుక 8 వ తరగతే పెద్ద క్లాస్. మొట్టమొదటి సారిగా ఎనిమిదవ తరగతి కి వెళ్ళిన. అంతవరదాకా వాళ్ళకు లెక్కల సారు ఫలానా అంటూ లేకపోవడం చేత నా బోధన పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ( ఈ ఎండాకాలం ల సాయంత్రం నీళ్ళ తడికి మన కూరగాయల మొక్కలు నీళ్ళకోసం ఎదిరిచూస్తున్నట్టే ) . నన్ను నేను పరిచయం చేసుకున్న. మీ వాడినే, నేనూ నిన్నటిదాకా మీ తీరుగనే క్లాస్ లో కూచోని చదువుకున్నోన్నే. మీ తిప్పల ఎట్లుంటదో తెలిసినోన్నే. అయితే లెక్కల అంత  అలుకటి సబ్జెక్ట్ ఇంకోటి లేదు. అని కొన్ని నిత్య జీవితం లో ఉపయోగపడే విషయాలు లెక్కలతో అనుసంధానం ఉన్నవి చెప్పిన. నా బెరుకూ పోయింది, వాళ్ళకు కూడా సహజంగా లెక్కల సార్ అంటే ఉండే భయం పోయింది. ఆ పీరియడ్ అంతా అట్లా ముచ్చట్ల తోటే గడిసి పోయింది.

తెల్లవారి నేను వాళ్ళకు బీజగణిత సమీకరణ సాధనాలు చెప్పాల్సి ఉంది.  పోతె ,  పోతేనే నేను ఈ రోజు మీకు  ఒక కథ చెప్పుతా అని మొదలు పెట్టంగానే , పిల్లల్లో ఉండే సహజమైన ఉత్సుకతతో చెప్పండి సార్ చెప్పండి సార్ అని కోరస్  పలికిండ్రు. ఎండా కాలం మాపటీలి ఇంటిముంగట పట్టెమంచం వేసుకొని ఒక తాత , మనువడు పండుకున్నరట .  అప్పటి రోజులల్లో ,   మన తెలంగాణ  గ్రామాలల్లో ఉండే చెరువలల్లా నీళ్ళు పుష్కలంగా ఉండేటియి . అందుకని ఎక్కడెక్కడి నుంచో పక్షులు తెలంగాణ చెరువులళ్ళకు వలసలు  వఛ్చేటియి . అట్లా ఒక కొంగల గుంపు ఈ తాత మనువడు పండుకున్న మంచం పైనుండి పోతున్నయట .. మనువడు పైనుండి పొయ్యే కొంగలను లెక్కవెడుతున్నడట. అవి తేపకు ఒకటి వెనుకకు  ,మరోటి  ముందుకు రావడం తోటి మనువడు లెక్కవెట్టలేక పోతున్నడట  . ఏహ్ నీ యవ్వ ! ఈ కొంగలు సల్లగుండ లెక్కవెడుదామంటే కుదిరి చస్తలెవ్వు . తాత ! ఆ పైనుంచి పోతున్న  కొంగలు ఎన్నే అని అడిగండట . తాత నిదానంగా లెక్కవెట్టి , ఇగో మంచిగ యిను మళ్ళా ఊకూకే అడుగకు అంటూ , అన్నీ , అన్నీ , ఆన్నిల సగం, సగం ల సగం , నాతోటి కలుపుకుంటే నూరు ,అని చెప్పిండట. పిలగానికి కోపం వచ్చిందట లెక్క అర్థంకాక. తాతా పోరన్ని గాజూసి లెక్కజెప్పుమంటే కైతికాలు జేస్తున్నవ్ లే, మాపటీలి బువ్వకుండాకాడ అరుసుకోమని అమ్మకు చెప్పిన్నంటే నీ తిక్క కుదురుతది అన్నడట . ఓహ్ మొగోనికి అగ్గువ దొరికిందోయ్ షికాయత్ జేసుడు. నీకు నేను చెప్పింది అర్థం జేసుకొనే తెలివి లేక , నా మీద ఎగురుడేనా ? ఏమన్నా ఆలోచన చేసుడు ఉన్నదా లేదా అన్నడట . పిల్లలు మీరు చెప్పండోయ్ అన్న. చాలా సేపు పిల్లలు తర్జన బర్జన్లు వడ్డరు . రక రకాల నంబర్లు చెప్పినారు. ఆ జవాబు ఎట్లా వచ్చింది అంటే ఎవరు చెప్పలేదు. సరే మనకు ఏదైయానా తెలువకుంటే లెక్కల్లో దాన్ని x అంటమని తెలుసుకదా అంటే అందరూ ఓహ్ !  అన్నారు. సరే అన్నీ అంటే x అనుకుందాం సరేనా. అన్నీ , అన్నీ , ఆన్నిల సగం, సగం ల సగం నాతోటి కలుపుకుంటే నూరు కదా ? పిల్లలు కోరస్ గా అవును అన్నారు. x +x +x/2+x/4+1=100 . ఈ సమీకరణాన్ని సాధించండి అంటే , సాధించిన పిల్లలు ,  పైన పోతున్న కొంగల గుంపుల ఉన్న కొంగలు 36 సార్ అని , ఆనాడు చెట్టుమీది నుండి ఆపిల్ పండు భూమి మీద ఎందుకు పడ్డదో కనుగొన్న సర్ ఐజాక్ న్యూటన్ వలె ఎగిరి గంతులేస్తూ చెప్పిండ్రు. ఇగ అప్పటి నుండి నా లెక్కల పీరియడ్ అంటే పిల్లలు ఇస్టంగా వినేటోల్లు . నా పాఠం పిల్లలు ఇస్టంగా విన్న ప్రతీ సారీ మనుసుకు గొప్ప సంతృప్తి కలిగేది. అయితే నేను మొట్టమొదటి సారి పాఠం చెప్పిన లెక్క మా నాయిన చిన్నప్పుడు నాకు చెప్పిందే. గమ్మతి ఏందంటే , మా నాయిన కు సదువు రాకపోయేది.