Wednesday, October 18, 2017

మనుసుల మాట 16.

                                                                 

సంబరాల పేరుతో పటాకులు పేల్చి వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ మనుషులు ఆరోగ్యంగా జీవించే ప్రాథమిక హక్కుకు  భంగం వాటిల్లజేయడం మంచిది గాదు అని భారత అత్యున్నత న్యాయస్తానమ్ చెప్పిన తీర్పు నచ్చని కొందరు ఇది మా తరతరాల సాంప్రదాయం అని వాదిస్తున్నారు. అలాగే ఈ రోజు నేను నివసిస్తున్న కరీంనగర్ పట్టణం లో కూడా  మా ఇంటి చుట్టూ విపరీతమైన పటాకలు కాలుస్తున్నారు.  

క్రీ:పూ: 200 సం. లో చైనా వాళ్ళు  దయ్యాలను, భూతాలను పారద్రోలాడానికి కంక బొంగులతో " Baozhu " అనే ఫైర్ క్రాకర్   " బొంగు ప్రేలుడు " ను ఉపయోగించేవారట. ఆ చప్పుడుకు దయ్యాలు దెంక పోతాయని వారివిశ్వాసమట. 9 వ శతాబ్దం నాటికి బొంగు ప్రేలుడునే   చైనా వాళ్ళు అభివృధ్ధి పరిచి గన్ పౌడర్ ను కనుక్కున్నట్లు చెప్పబడుతున్నది. ,1) .కంపాస్.  2 ) గన్ పౌడర్, 3) పేపర్. 4). ప్రింటింగ్ అనేవి ద గ్రేట్ ఫోర్ ఇన్వెన్షన్స్ ఆఫ్ చైనా అని పిలువబడుతున్నాయి. ఇదంతా అబద్దం మన భారత రామాయణ కాలం లోనే బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం ,ఉండేవి అనే వాదన కూడా ఉంది. కానీ సర్వ వేద విద్యా పారంగతుడైన చాణుక్యుడు క్రీ:పూ: 322-185 కాలం లో చంద్రగుప్తుని తోటి కత్తి యుధ్ధాలే చేయించాడెందుకో  !   క్రీ: శ: 1030 ప్రాంతం లో భారత దేశం పైన 17 సార్లు దండయాత్ర చేసి  సోమనాథ దేవాలయాన్ని కొల్లగొట్టి 50,000 మందిని చంపి 1,300కిలోల బంగారం, 50,00000 దీనారాలను కొల్లగొట్టుక పోయినపుడు కొట్లాడింది కత్తులు బల్లాల తోటే .  క్రీ: శ: 1178-1192 లో పృథ్వీ రాజ్ చౌహాన్ మహ్మద్ ఘోరీ తో పోరాడినపుడు మన ఆయుధాలు కత్తులు బల్లాలు, బాణాలే.

ప్రారంభం లో సల్ఫర్ , చార్కోల్, పొటాషియం నైట్రేట్ ల మిశ్రమం ఈ గన్ పౌడర్.  గంధకం , చార్కోల్ తో కలిసి మండిన వేడికి   నైట్రైట్  కరిగి వాయు రూపం చెంది అధికంగా వ్యాకోచించి వాటిని చుట్టి ఉన్న గొట్టాన్ని పెద్ద ఫోర్స్ తో బద్దలు గొట్టుకొని పెద్ద శబ్దం తో బయటకు మిరుగులను విరజిమ్మెది. క్రీ: శ: 11 వ శతాబ్దం నాటికి సాంగ వంశ చక్రవర్తి అయిన హ్యూజాంగ్ సాంగ్  దీనిని రాకెట్ గా అభివృధ్ధి పరిచినాడట. క్రీ: శ: 1240 లో చైనా వారినుండి ఈ పరిజ్ఞానాన్ని అరబ్బులు సంపాదించినారట . క్రీ: శ: 14 వ శతాబ్దం లో అరబ్బులు , చైనా నుండి ఈ మందు గుండు సామాగ్రిని  ఇండియా కు మరియు యూరప్ కు తీసుకొని వెళ్ళినట్లు గా చెప్పబడుతోంది. క్రీ: శ: 1497-1539 లో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన గజపతి ప్రతాపరుద్రదేవుడు రాసిన కౌటుక చింతామణి అను సంస్కృత  గ్రంథం  లో వివాహాది శుభకార్యాలల్లో , పండుగ పబ్బాల సందర్భంగా చైనా లో వాడిన ముడి పదార్థాలు ఇక్కడ లభించనందున  దేశీయ పదార్థాలను వాడి పటాకులను తయారుచేసి  వాడినట్లుగా రాయబడింది.  క్రీ: శ: 1609 లో బిజాపుర్ సుల్తాన్ ఇబ్రాహీం అదిల్ షా కుమారుడైన మాలిక్ అంబర్ ,  పెళ్ళికి ఆనాడే రూ: 80,000 రూపాయల విలువ చేసే పటాకులు కాల్చినట్లు " మధ్య యుగాల పాలకుల పాలన " అన్న పుస్తకం లో ఆధునిక చరిత్ర కారుడు సతీశ్ చంద్ర రాసినాడు.  క్రీ: శ: 19 వ శతాబ్దం నాటికి , కులీనులు, సంపన్నులు , వారి వారి ఇండ్లలో జరిగే వేడుకలల్లో,  ఘనంగా , తమ తమ డాంబీకాలను, గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి ఈ టపాకాయళ్ను పేల్చేవారు.  అది సంపన్నుల సాంప్రదాయం , శ్రమజీవుల సాంప్రదాయం కాదు అనేది చరిత్ర.

అట్లా ఎందుకు అంటున్నానంటే 1977- 78 లో మా ఊరి భూస్వామి మా ఊరిలో మొదటి సారిగా పట్నం నుండి పటాకులు తెచ్చి దీపావళి రోజున తన కొడుకులు, కూతుర్ల తోటి కాల్చి పేల్చి పిస్తుంటే  మా ఊరోళ్ళంతా అబ్భురంగా విచిత్రంగా చూసిన విషయం నాకింకా కండ్ల ముందు కదులాడుతున్నది.  కాకుంటే పంట చేండ్లను నక్కలు, అడివి పందుల నుండి కాపాడుకోవడానికి మోతుబరి రైతులు గన్ పౌడర్ ను ఇనుప రోలు రోకలి లో వేసి బండకు కొట్టి ఢాం ఢాం అని దెబ్బలు వేగించేది.

నా అనుభవం లో మా చిన్నతనం లో " దివిలె " పండుగు మా ఊరిల ఎట్లా జరుపుకుందురు అంటే,ఆనాటికి వరిపంట మంచి పాలు పోసుకొనే సమయం ల ఉండేది. వరి పొలాలకు  నీళ్ళు పెట్టె పనిల ఊరు ఊరంతా తలమునుకలై ఉండేది. అప్పటెకే వర్షాలు వెనుకకు పట్టేది కనుక చెరువు నీల్లే ఆధారమై ఉండేది. తూము నుండి వచ్చే నీళ్ళు , పొలం తడారక ముందే  తడి అందాలన్న ఆరాటం అందరికీ ఉండేది. ఇక మడ్లల్ల పోసిన తెల్ల జొన్నలు నాగటి సాలెక్కి ( ఆరేడు అంగుళాల ఎత్తుకు పెరిగేవి) చేనంత పచ్చటి తివాచీ పరిచినట్టు ఉండేవి. అవే గ్రామీణులకు ఆహ్లాద  కేంద్రాలు, ఆనందం పంచుకొనే ఆటమైదానాలు, సంబురాలు జరుపుకొనే సంపద వెలుగులు. దీపావళికి సన్నగా చలి మొదలెయ్యేది. అడివంచు ఊరాయే చెట్ల ఈదర గాలికి సాయంత్రం అయ్యేవారకు  చలి చలి ఉండేది. సాయంత్రం అయిందంటే , దడుల పొంటి బీర తీగల కు కాసి , ఆకుల సాటున దొరుకకుంట దాగుండి పోయిన  ముదిరిన బీరకాయలను కోసుకొని తెచ్చి వాటికి టేకు పేళ్లు బిగించి అగ్గి ముట్టిచ్చి " కొలర కోలా"  అని ఆ మంట మండుతున్న కొలను తలచుట్టూ తింపుకుంటూ ఊరంతా తిరిగేది. ఇక రేపు భోగి ఆనంగా మొత్తం కర్రతో చేసిన కోల లు ఎవరివి వారు పెద్దవాళ్లతో కట్టించుకొనేది, ఊరు మొత్తానికి ఒక పెద్ద కోల కట్టించి దాన్ని ఊరు మధ్యన ఉండే సావడి కాడ  పెడుదురు.రేగు లేదా తునికి కర్ర కు సన్నగ పాపిన టేకు కొయ్యలు కొట్టి అవి కాలినప్పుడు  కూలి పోకుంట దుస్శేరు తీగల కడాలు తొడుగుదురు.  బలవంతుల పోటీ అది. దాన్ని అందరికంటే ముందు ఒక చుట్టు  తింపి జాగ్రత్తగా కింద పెట్టినోడు సిపాయన్న మాట. చాలా మంది  ప్రయత్నం చేద్దురు కానీ ఎవరో మంచి ఒడుపు మీద ఉన్న బలవంతుడు మాత్రమే లేపి తింపేది. అక్కడ కుల ప్రస్తావన ఉండక పోయేది. మా బోడోళ్ళ మొద్దెంకటి మామ ఎప్పుడైనా మొదట తింపే బలవంతుడు. మొద్దెంకటి మామ దళితుడు , కానీ ఆ పట్టింపులు ఆనాడు ఉండక పొయ్యేది.  అది అలుకగ అయినంక పొరగాండ్లమ్ అందరం కొలర కోల అని ఓ సుట్టు తింపి కింద వెడుదుం. ఇంటికచ్చి తానం జేసి , జొన్న ఛేండ్ల కు పాండువ దేవుళ్ళకు మొక్కవోదుము. పెరిగిన జొన్న కర్రలకు పురుగు పట్టవద్దని, రోగాలు రావద్దని మంచి పంట పండాలని మొక్కుడన్న మాట. పలిగిన పాత కుండలకు సున్నం రాసి, సర్వల నీళ్ళు పట్టుకొని, పప్పుబెల్లం కలుపుకొని , పసుపు కుంకుమ పట్టుకొని ఆవి  కావడిల పెట్టుకొని చేనుకు పోదుము . తంగేడు కొమ్మలతోటి పందిరి వేసి పందిరిల సర్వతోటి తెచ్చిన నీళ్ళు చల్లి నున్నగా అలికీ పసుపు కుంకుమ తోటి పట్టు పోసి పందిరి చుట్టూ, చెనుల మధ్య మధ్యన సున్నం పూసిన కుండలు బోర్లిద్దుమూ. కనుక చీడ పీడలు పంటను ఆశించక పొయ్యేది. పందిరిల మొక్కిణాంక పప్పుబెల్లం పలారం తిని ఇంటికి వద్దుము. దాదాపుగా అందరి ఇండ్లల్ల కేదారి వ్రతం అని నోములు ఉండేటియి. అప్పుడే పండిన పత్తి,  దారం తీసి దండ జెద్దురు. గుమ్మడికాయ , చిక్కుడు కాయ, కొత్త చింతకాయ, దోసకాయ, కాకర కాయ , తమాట ,ఇట్లా అన్నీ కూరగాయలతోటి వంట జెద్దురు. నేతిల కాల్చిన బెల్లపు అప్పాలు,పాశం బువ్వ  నైవేద్యం తయారు జెద్దురు . పొద్దుగూకంగా సదువచ్చినోళ్ళు ఎవరి ఇంటికాడ వాళ్ళు కత చదువంగనే అందరం సామూహికంగా భోజనం చేద్దుము. ఇది ఆనాటి మా దీపావళి పండుగ. ప్రకృతి సల్లంగా ఉండాలని ప్రకృతిని కాపాడుకొని బతుకాలని మా తరం దాకా  దీపావళి అంటే  అట్లుండే టిది .