Thursday, December 15, 2016

ఇంటిమీదేవుసమ్ 7

                                                                ఇంటిమీద ఎవుసమ్. 7

ఇయ్యాల పొద్దుగాల సూదమ్ రమేశ్ గారికి పోన్ జేసినప్పుడు , సార్ ! మీరు రాస్తున్న కాలం పేరు మిద్దె మీద ఎవుసమ్ అని పెడితే బాగుంటది అని సూచన జేసిండు. నాకు గూడా అవును గదా? ఎవుసమ్ అంటే నేల  మీద నిలబడి భూమిని దున్ని చేసేది  సేద్యమైతది గదా ? రమేశ్ చక్కని సూచన చేసిండు అనుకున్న, ఆయన తోటి గూడా అన్న మంచి సూచన అని , కానీ తీరా రాద్దామని మొదలువెట్టే వారకు మిద్దె ఎందుకనో గాని నాకు పరాయిది అనిపించింది . ఇంటి మీద, లేకుంటే ఇల్లు మీద ఎవుసమ్ అని పెడితే బాగుంట దేమో అనిపించి ఇట్ల మొదలు వెడుతున్న. సరే ఇది చదివిన తర్వాత ఎవరైనా సూచన చేస్తే అప్పుడు ఏమన్నా చేర్పులు మార్పులు చేద్దాం అని ఇగో ఇట్లా " ఇంటి మీద ఎవుసమ్ " అని రాస్తున్న. మిద్దెల ఉండు కుంట మిద్దె పరాయిది ఎట్లయింది అని మీరు ప్రశ్నించ వచ్చు . దీనికి జవాబు మల్లోసారి రాస్త గాని యింత కంటే ముఖ్యమైన సంగతి ఓటి మాట్లాడు కునేది ఉన్నది, జర ఆ చర్చను వాయిదా వేద్దామ్ >

రఘోత్తమ్ రెడ్డి సార్ పంపిన " ఇంటి పంట " పుస్తకం కరీంనగర్ లో ఉన్న రత్న ప్రభ గారికి ఇచ్చే తందుకు పోయిన. ఇంట్లోకి వెళ్ళేటప్పుడే చూసిన లాన్ లో  తీర్చి దిద్దినట్టు  అందం గున్న సక్కదనాల పూల శెట్లు . అవి దాటుకుంట లోపటికి పోయిన . రత్న ప్రభ గారి సాదర ఆదరణ. అప్పుడే ఇంటి తోటలనుంచి తెంపుక వచ్చిన జామ పండ్లు పెట్టింది తినడానికి, అమ్మతనం గదా ఆదరణ అట్లనే ఉంటది మరి.  పరిచయాలు , యోగ సమాచారాలు అయిన తర్వాత మిద్దె మీదికి పోయి ఆమె పెంచు తున్న తోటను చూసిన. వాటి ఫోటోలు కూడా కొన్ని పెడుతున్న చూడండి. కానీ ఆ మొక్కల గురించి ఆమె తీసుకుంటున్న జాగ్రత్తలు, శ్రద్ద విన్న తర్వాత ఈ కాలం లోని కొందరు తలిదండ్రులు వాళ్ళ  పిల్లల పైన తీసుకుంటున శ్రద్ద కంటే గూడా మిక్కిలిగా ప్రభావతి గారు తోట పైన తీసుకుంటున్నట్లు అనిపించింది నాకు. వారు ఎప్పుడన్నా పని పైన
ఊరేలితే ఇక్కడ ఉన్న వాళ్ళు వాటి ఫోటోలు తీసి  పంపితే చూసి గాని సంతృప్తి చెందే వారు కాదట .. అంతటి అవినాభావ సంబంధం ఆమెకు మొక్కల తో . ఒక నిమ్మ మొక్క ఉంది దానికి ఆకుల కంటే గూడా పూత,  పిందే ఎక్కువగా ఉంది. కింద గూడ ఇంకా చాలానే ఉన్నాయి మొక్కలు. ఆమె అంత శ్రద్ద తీసుకుంటున్నది కనుకనే ఆ మొక్కలు అంత ఫలవంతంగా ఉన్నాయి అనిపించింది. మిద్దె తోట ను పెంచే మనం ఎవ్వరమైనా గూడా అట్లా శ్రద్ద తీసుకో గలిగినప్పుడే అంత చక్కని ఫలితాన్ని ఎక్స్ ఫెక్ట్ చేయగలం అనిపించింది . కరీంనగర్ కలక్టరేట్ లాంటి ఒక కాంక్రీట్ జంగల్ మధ్యన సహజ సిద్దమైన ప్రకృతిని తలిపించే పరిసరాలను వారు క్రియేట్ చేయడానికి ఎంతో నిబద్దత ఉంటే కానీ సాధ్యం కాదు. తన ఆరోగ్యం ఆనంద రహస్యాలు మిద్దె తోట పెంపకమే అన్నారు ఆ మానువాడ ఆడ బిడ్డ. వచ్చే టప్పుడు చక్కని సువాసనలు కలిగిన కొతిమీర , తాజా చుక్క కూర , చెట్టుమీదనుండి అప్పుడే కోసిన నిమ్మ, దానిమ్మ, జామ కాయల తో బాటు గా ఒక మునగ చెట్టు, కొన్ని కురాగాయాల విత్తనాలు ఇచ్చింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అది వారి ఆఫీస్ కం రెసిడెన్సీ, ఇంకో రెండు మూడు నెలల్లో అక్కడి నుండి వారు బదిలీ అయి వెళ్ళి పోయే అవకాశం ఉందట. చూడండి అంత అనిశ్చిత పరిస్తితి లో కూడా , కుదురు గా ఉండి గూడా ఏమీ చేయిలేని వారికంటే ఎంతో గొప్పగా తన తోటను తీర్చి దిద్దినారు .

ఇంకొక్క ముచ్చట జెప్పి ముగిస్త గని జర బోర్ ఫీల్ గాకుండ్రి . ఒక మిత్రుడు బంగుల పైకప్పు మిద్దె తోట  బరువు మోస్తదా అని అడిగితే రఘోత్తమ్ రెడ్డి సార్ జవాబు రాసిండు. ఇక్కడ నేను నా అనుభవం రాస్తే కొత్తవాళ్ళకు ఏమైనా ఉపయోగ పడుతుందో ఏమో అన్న తపన తోటి  చెప్తున్న.
\
చిన్నప్పటి నుండి ఎవుసమ్ జేసిన అనుభవం నాది . కానీ అది మా నాయిన సంపాయించిన  40 ఎకురాల ఎవుసం అనుభవమైతే ,  ఇది 4 ఫీట్ల తోటి పది  మడుల ఎవుసమ్. రిటైర్ అయిన తర్వాత ఎక్కడన్న కొంత భూమి తీసుకొని ఎవుసమ్ జేస్తే ఎట్లుంటదని అనుకుంట మిత్రుడు ఆకుల భూమయ్య తోటి ఆలోచన జేసిన. ఇన్ని రోజుల నుంచి ఎందరికో మాటలు జెప్పి అప్పుడే చెప్పిన మాటలు, చేసిన పనులు మరిచి పోయి నీ సంతోషం కోసం స్వార్త పూరితంగా ఆలోచిస్తే ఎట్లా అన్నడు . గతించిన మా సేవా కాలం లో మేము సమాజం నుండి మనం చాలా పొందినామన్న సంగతి ఒక్కటోక్కటిగా గుర్తు జేసెటోల్లమ్ . మనం పొందిన విద్య, ఉద్యోగం,తినే తిండి, కట్టే బట్ట,  ఉద్యోగం ద్వారా సంక్రమించిన సామాజిక హోదా, ఆ ఉద్యోగం వలన పొందిన వేతనం, ఆ వేతనం వలన పిల్లలను ఉన్నతంగా చదువించుకోవడం ,చాలా చాలా మంది కంటే మెరుగైన జీవనం గడుపడం ,  ఇవన్నీ సమాజం నుండి పొంది సామాజానికి మనం ఏమిస్తున్నామో ఎవరికి వారుగా మనల్ని మనం ప్రశ్నించు కోవాలని అనేక సందర్భాల్లో చెప్పిన వాళ్ళం గదా మనం. ఇప్పుడు ఇంకా కుటుంబ బాధ్యతలు గూడ   పెద్దగా లేవు కనుక నీకు నచ్చిన రంగం లో సామాజిక బాధ్యత నిర్వహిస్తే బాగుంటదని అన్నడు. నా బాధ్యతను మల్లోసారి గుర్తు చేసిండు. పర్యావరణ రక్షణ  పైన కొంత కాలం పనిజేసిన , ఆయన అమరుడు అయిన తర్వాత చాలా రోజుల దాకా కాలం నిరాసక్తి గా గడిచిపోయింది .ఎప్పుడో నేను రాసిన కతలను పుస్తకంగా అచ్చు వేయించిన అదీ మా పెద్దల్లుడు బుర్ర తిరుపతి ప్రేరణతో . అయితే  ఒక రెన్నెల్ల క్రితం మా పిల్లల దగ్గరకి పోయినప్పుడు మళ్ళీ ఎవుసమ్ మీదికి మనుసు మళ్ళింది. అది కూడా ఇగో ఇసొంటి ఇంటిమీదేవుసమే. అగో అప్పుడు రఘోత్తమ్ రెడ్డి సార్ ను ఫేస్ బుక్ ల చూసిన. మా సోపతి గూడా పాత కతల సోపతే . కనుక ఇండియా కు రాంగానే  సార్ ఇంటికి వెళ్ళి మిద్దె తోట చూసి వచ్చిన . ఆయన సూచన మేరకు సూదమ్ రమేశ్ గారి సిమెంట్ మడులను చూసిన .


కరీంనగర్ లో చౌకగా దొరికే షాబాద్ బండలు, తేలిక పాటి సిమెంట్ ఇటుకలు పెట్టి 4x4 ఫీట్ల తోటి 11 సిమెంట్ తొట్లు  కట్టించిన . 1 : 1 నిష్పత్తిలో మట్టి , మాగిన పెండ కలిపి తొట్ల ను నింపి , కొన్నింటిలో విత్తనాలు కొన్నింటిలో మొక్కలు నాటిన . మంచి వ్యాపకం . సంతృప్తి అనిపిస్తున్నది. రఘోత్తమ్ రెడ్డి సార్ రాసినట్టు ప్రకృతి పరిరక్షణ బాధ్యత, ఒంటి ఆరోగ్యం బాధ్యత రెండూ ఎంతో కొంత నిర్వహించి నట్లు అనిపిస్తున్నది. ( తొట్ల నిర్మాణానికి 18000/ మట్టి, ఎరువు కొని నింపడానికి 7000/ రూపాయల వరకు ఖర్చు వచ్చింది )

Tuesday, December 13, 2016

ఎవుసమ్ 7

                                                                       ఎవుసమ్ 7

ఈ రోజు ఉదయం నేను నా మిత్రుడు నాగేందర్ సార్ కల్సి మొక్కలకు నీళ్ళు పెడుతున్నం,  అప్పుడే పాత్రికేయ మిత్రుడు కరుణాకర్ గారు పోన్ జేసి మీరు పెంచుతున్న కూరగాయల తోట చూసి వార్త రాద్దామనుకుంటున్నాను ఇంట్లో ఉన్నారా అని అడిగిండు. ఆయనకు సాదరంగా స్వాగతం చెప్పిన. ఆయన రాసే వార్త వలన ఒక్కరు స్పూర్తి పొంది నా ప్రకృతికి మేలు జరిగి ఆయనకూ  ఆరోగ్యం చేకూరుతుంది గదా అన్న ఆశ తో . కరుణాకర్ గారి సోపతి జీవ గడ్డ పత్రిక నడుస్తున్న నాటి నుండి ఉంది. ఆయన ఇంటికి వచ్చి విజయ కుమార్ సార్ ఉన్నప్పుడు వచ్చిన్నంటే మళ్ళా ఇప్పుడే రావడం అని జీవ గడ్డ విజయ్ కుమార్ ను యాదికి తెచ్చిండు.

1970 ల నుండి కరీంనగర్ ల నిర్మల ప్రింటింగ్ ప్రెస్ ల విద్యుల్లత పత్రిక అచ్చు అయ్యేది. మిత్రుడు నాగేందర్ నేను ప్రెస్ కు  పోయినప్పుడు ప్రూఫ్ రీడింగ్ చూస్తుంటిమి .1970  నుండి 1973 దాకా మేము కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ డిగ్ర్ర్ కాలేజ్ ల చదువుతుండే వాళ్ళం .  మాకు మంథని లో ఉన్నప్పుడు లైబ్రరీ కి వెళ్ళి పుస్తకాలు చదివే వ్యసనం బాగా ఉండేది కనుక విద్యుల్లత పత్రిక మాకు పెద్ద చెరుకు గడ దొరికి నట్టే ఉండేది. అక్కడనే మాకు " సృజన " తో పరిచయం అయింది.అప్పటి దాకా గాంధీ మహాత్ముడే ఇంగ్లీషోళ్లతోటి  కొట్లాడి దేశానికి స్వాతంత్రం తెచ్చిండాని నమ్మేటోల్లమ్ . ఈ పత్రికలను చదివిన తర్వాతనే మాకు దేశం కోసం ఎవరవరు ఎట్లా త్యాగాలు చేసిండ్రో అర్థం అయ్యింది.

కరుణాకర్ గారు టీ పాయ్ మీద ఉన్న " ఇంటి పంట " పుస్తకం చేతి లోకి తీసుకొని మిద్దె తోటలు పెంచే కాన్సెప్ట్ ను ఇక్కడ  ఈ సారే మొదలు పెట్టిండా అని రఘోత్తమ్ రెడ్డి సారు పోటో చూపుతూ అడిగిండు. నాకు తెలిసి అయితే రఘోత్తమ్ రెడ్డి గారు ఆరేడు యేండ్ల నుండి ఈ కృషి చేస్తున్నాడు. అంతకు ముందు ఎవరైనా చేస్తే చేసి ఉండవచ్చు . కానీ ఈయన వల్ల , ఆయన రాస్తున్న రాతల వలన జనం లో బాగా ప్రాచుర్యం లోకి వచ్చిందని చెప్పిన .మిద్దె తోటల గురించిన వార్తలు రాయడానికి ఈ పుస్తకం చాలా ఉపయోగ పడుతుంది కనుక  ఈ పుస్తకం నేను తీసుక వెలతా అన్నారు. వాస్తవానికి ఆ పుస్తకాలు సూదమ్ రమేశ్ గారని మన మిద్దె తోట మిత్రుడు నిన్న  నే  కరీంనగర్ లో ఉన్న మిద్దె తోట సేద్యకారులకు ఇవ్వుమని రఘోత్తమ్ రెడ్డి సార్ పంపించినాడని ఇచ్చి పోయిండు . సరే పాత్రికేయుని చేతిలో పడితే పది మందికి అందులోని సమాచారం వెళ్తుందన్న ఆశతో ఆ పుస్తకం వారికి ఇచ్చాను, పంపిన వారి అనుమతి లేకుండానే.


మిద్దె తోట లో పెట్టిన బీర, సొరకాయ, కాకరకాయ విత్తనాలు మొలకెత్తి చాలా రోజులే అవుతున్నా కూడా తీగలు ఇంకా వేయడం లేదన్న ఆతృత  నాలో. చలికా , లేక ఎరువు ఎక్కువయ్యిందా ఏమైనా అనేది నా ఆతృతకు కారణం. నా ఆతృత కాక పోతే దానికి ఆ వయసు రావద్దూ ? నాలోకి నేనే ఒక సారి తొంగి చూస్తే ఈ తరం తలిదండ్రులు ఎలాగైతే తమ పిల్లలకు మూడేన్లు దాటక  ముందే ముద్దార చదువక పోతున్నారే అని ఆన్ధోలన చెందినట్టుగానే నేనూ ఆలోచిస్తున్నాను  కదా అనిపించింది. ఎందుకు నేను ఇట్లా ఆలోచిస్తున్నానా అని అవలోకిస్తే , నేను ఓ రెండు వేలు పెట్టి నిలువు పందిరి చేయించినా కదా ? మరి ఆ పందిరికి ఈ తీగలు ఎక్కాలి కదా ?ఇంకా ఎప్పుడు ఎక్కుతాయన్న ఆన్ధోలన ,  ఓహో ! ఇదన్న మాట ఆంతర్యం. సాధ్యమైన కాడికి ప్రకృతి వనరులను పిండి పిప్పి జేసి కూడబెట్టిన సంపాదన వినియోగం లోకి రావాలి కదా?  అందునా తన సంతానానికి దక్కాలన్న స్వార్థంపు ఆలోచనకు నాందే అన్నీ తొందరగా ఎదుగాలన్న , అన్నీ తొందరగా అనుభవించాలన్న ఆలోచనలకు కారణం అనిపించింది. ప్రకృతి ప్రేమికులు గా, ప్రకృతి పరిరక్షకులు గా పండకుండానే , పండించ కుండానే , ఫలితం అనుభవించడం నేరం కదా ? పండించ కుండానే అంటే నా భావం , ఉత్పత్తి లో భాగం కాకుండానే  అని అర్థం . అందుకని ఎవరికి వాళ్ళం ఎంతలో కొంతైనా ఉత్పత్తిలో భాగం అవుదాం రండి !

Sunday, December 11, 2016

అశోకం

ఆదివారం ఆంధ్ర జ్యోతి ల ఓల్గా రాసిన " అశోకం " కథ చదివిన తర్వాత మోడి పాలనకు ఆ కథ లోని కొన్ని సంభాషణలకు  దగ్గరి సంభంధం ఉన్నట్టు అనిపించింది.
కథ మండోదరి, సీత, ఆర్య ద్రావిడ సంస్కృతి గురించి ఉంది.
రావణుడికి ఆర్య సంస్కృతి పైన మోజు పెరిగిందట. దాన్ని తాము అందుకొనక పోతే వెనుకబడి పోతామేమో,ఆ మహోధృతి లో ఇక తాము మిగులమేమో అన్న  దిగులు పట్టుకోని నగర లోలత్వం లో పండ్లు, ఫలాలు ఇచ్చే అనేక వృక్షాలను , ప్రకృతిని కాపాడి ప్రాణ వాయువును ఇచ్చే అనేక అడవులను నరికి వేసి అశోక వనం నిర్మిస్తాడట .
అప్పుడు మండోదరి రావనుడి తో అంటుందట " ఆర్య నాగరికతలో ఆడదాని శోకం వినబడుతున్నది . నువ్వు ఎంత ప్రయత్నించినా నగరం లో దాని విషాద ఛాయలు ప్రవేశించక మానవు , అరణ్యాన్ని తీసి వనాన్ని పెంచుతున్నావు."

మోడి కి కూడా విదేశే మోజు బాగా పెరిగింది. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం లో వెనుక బడి పోతే ఎక్కడ మిగుల కుంట పోతామేమో అన్న భయం పట్టుకునట్టు ఉంది. స్మార్ట్ పోన్, ఇంటర్నెట్, క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్,అంటూ "  నగరీకరణ
నాగరికతను నేర్పించడానికి నానా తంటాలు పడుతున్నడు. ఆర్య నాగరికతలో మండోదరికి ఆడదాని శోకం వినిపించినట్లు ఇక్కడ కార్పొరేటీకరణలో దినసరి కూలీల, స్ట్రీట్ వెండర్ల, చిరు వ్యాపారుల శోకం మొదలైతదన్న విషయం ఆయనకు పట్టడం లేదు.

నిన్న హైద్రాబాద్ లో ఆటో లో వస్తుంటే జనం బారులు తీర్చి ఉంటే ఏ టి ఏం ఉందేమో అనుకోని దృస్టి సారించి చూస్తే అది రిలేయన్స్ ఫ్రెష్ . ఎందుకు అంత మంది ? బయట షాపులు లేవా అంటే,  సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కార్డ్ సౌకర్యం ఉందని అట . ఇక్కడ మోడి విధానాలు ఎవరికి మార్కెట్ అవుతున్నది. ఎవరికి దోచి పెడుతున్నట్టు? స్వైప్ మిషన్లు, ఇంటర్ నెట్లు, స్మార్ట్ ఫోన్లు, క్రెడిట్, డెబిట్ కార్డులు ,పేటియమ్ లు,   వాటి మార్కెట్ ప్రజల నిత్యావసరాల తో ముడి పెట్టి , గ్రామీణ భారత ప్రజల విద్యా , వైద్యం రవాణా, బాధ్యతల నుండి పూర్తిగా వైదొలిగి ఆర చేతిలో  లో వైకుంఠం చూపేడుతున్నాడు . ఆయన భజన సంఘం ఏమో అచ్చే దిన్ ఆగే హై అంటున్నది.

" ఏది ధర్మమో నిర్ణయించే అధికారం చేతి లోకి తీసుకున్న వారు ఏ మాటలైనా చెప్పగలుగుతారు. ఎంత ప్రాజాపకారం చేసినా అది ప్రజోపకారమే అని బుకాయించి నమ్మించే ప్రయత్నం చేస్తారు. "

అశోకం కథలో మండోదరి అంటుంది " ప్రతి నగరం లోనూ రావణ కాస్టమ్ ఒకటి రగులుతోంది . రావణుడి చితిని ఆరకుండా చేసింది రాముని ఆర్య సంస్కృతి . ప్రతి నగరం లో అవి మండితేనే తమకు మనుగడ అని ఆ సంస్కృతి భావిస్తోంది " . ఈ మాటలు ప్రస్తుత పరిస్తితులకు సరిగ్గా సరిపోతున్నాయి.


ఎవుసమ్ 6

                                                              ఎవుసమ్  6

నేను దుంప బచ్చలి కోసం రఘోత్తమ్ రెడ్డి సార్ ను అడిగిన విషయం ఎఫ్ బి ల చూసిన జయంత్ సార్ నా కోసం దుంప బచ్చలి మొక్క తీసుకొనచ్చిండు. నాకు చాలా సంతోషం అయ్యింది. అయితే నాకు కొన్ని టమాటా, మిరుప మొక్కలు కూడా కావాన్నని , అవి ఎక్కడ దొరికే అవకాశం ఉందని అడిగిన. హైద్రాబాద్ రోడ్డుల తిమ్మాపురం స్టేజ్ తర్వాత రోడ్డు పక్కన కొన్ని కూరగాయల నర్సరీలు ఉన్నట్టు సార్ చెప్పిపోయిండు .
తెల్లవారి రోజు నేను, నా మిత్రుడు నాగేందర్ సార్ కల్సి రోడ్డు వెంట చూసుకుంట పోయినం . తిమ్మ పురం స్టేజ్ పక్కనే ఒక నర్సరీ ఉంది. అలాగే చాలానే ఉన్నాయి. ఒక నర్సరీ లోపటికి వెళ్ళి చూసినం . టమాట , మిరుప, కాలి ఫ్లవర్ , మునగ, బొప్పాయ మొక్కలు చాలా ఆరోగ్యంగా పెంచబడి ఉన్నాయి, నాకు అబ్బురమే అనిపించింది. నా అనుభవం లో రైతులే వారికి అవసరం ఉన్న మొక్కల కోసం నారు పెంచుకుందురు. మా చిన్నతనం లో అయితే రైతుల ఇండ్లల్లనే అవసరం అయిన విత్తనాలు ఉండేటివి. ఇప్పుడంటే విత్తనాల దుకాణం ల కొని నారు పోసుకొనేటోల్లు .
తీరా ఇక్కడ రెడీ మేడ్ మొక్కలు దొరుకుతున్నయ్ . అవి ఎవరివి అని ఆరా దీస్తే ఆంధ్ర నుంచి వచ్చి కౌలు కు తీసుకొని నారు పెంచుతున్నారని తెల్సింది. ఇప్పుడిప్పుడే స్టానిక రైతులు కూడా పెంచుతున్నారట. మొక్కలు అమ్ముడు పోతున్నాయా అని ఆరా దీస్తే వెంట వెంట నే పోతున్నాయట , అందుకే ఒకరి పైన ఒకరు పోటీలుబడి నర్సరీ దొడ్లు పెడుతున్నారని చెప్పిండ్రు. రైతులకు కూడా సమయం కల్సి వస్తున్నదట .
బాగానే ఉందని పించింది . అవసరాలకు అనుగుణంగా మార్కెట్ , దాని రూపాన్ని ఎట్లా మార్చుకుంటుందో అక్కడ కనిపించింది. ఆధునిక కాలానికి నా బాల్యానికి అంటుబంధం తెగుతున్నట్టు అనిపించింది.
మా చిన్నతనం ల ఏ కాలం కూరగాయలు ఆ కాలం లో ఇంటి అవసరాలకు పోగా మిగిలింది దగ్గరి వాళ్ళకు ఇచ్చుకుందుమ్ ఇంకా మిగిలినప్పుడు ఇంటికి వచ్చే వారికి కూడా ఇచ్చేటోల్లమ్. పాడి ఉన్న ఇండ్లల్ల పెరుగునుండి వెన్న దీసిణాంక మిగిలిన చల్లను ఎవరడుగుతే వాళ్ళకు పోసేది. సల్ల అమ్ముడు ఉండేది కాదు. ఈ కూరగాయల విత్తనాలు గూడా ఎవరు అమ్మినట్టు, కొన్నట్టు నా యాదిల లేదు. అవసరం ఉన్నోళ్ళు అడుగుతే , ఎవరిదగ్గరన్నా ఉంటే ఇద్దురు . మనుషుల మధ్యన సంబంధాలు ఇచ్చి పుచ్చుకొనే తీరుగా ఉండేటివి. ఎక్కన్నన్న చిన్న చిన్న గొడవలు వచ్చినా పండుగలప్పుడో, పెండ్లిల్లప్పుడో మాట్లాడుకునుడు అయి కలిసి పోదురు . మనుషుల మధ్యన ఒక సుహృద్భావ పరిస్తితులు ఉండేటివి. కానీ ఇప్పుడాన్ని వ్యాపార సంబంధాలే!
అనుకుంటా మొక్కలు కొనుక్కొని తెచ్చి నాటిన. అన్నీ బతికినయి. మిరుప టమాట, వంకాయ మొక్కలు రోజు పలకరిస్తున్నయి . మా చిన్నప్పుడు పెద్ద ఎవుసమ్ జేసిన్నాడు ఇంత థ్రిల్లింగ్ అనిపించ లేదు. ప్రతి మొక్క తోటి ఇప్పుడో దైహిక సంబంధం, దాని ప్రతి ఎదుగుదల లో మనది మాత్రమే అయిన శ్రమ , స్పర్శ ఉన్న కారణంగానో ఏమో సమయం చిక్కినప్పుడల్లా అక్కడికి పోబుద్ధి ఔతున్నది. వాటికి మనకు మధ్యన ఏదో సంబంధం. మనది ఖచ్చితంగా వ్యాపార సంబంధమే , కానీ మొక్కలదే ప్రకృతి సంబంధం.
జంధ్యాల పాపయ్య శాస్త్రి" పుష్ప విలాపం"  లో ఆ పువ్వులు ఇట్లా అంటాయట ,

ఆయువు గల్గు నాల్గు ఘడియల్ కనిపెంచిన తీగ తల్లి జాతీయత తీర్చి దిద్దేదము
తదీయ కరమ్ముల లోన వెచ్చగా ఊయల లూగుచు మురియుచుందుము
ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ కాలి వ్రేళ్ళ పై !


అట్లా తనను కని పెంచిన తల్లి రుణం మొక్కలు తీర్చుకుంటాయని అన్నాడు కవి. కానీ మనమో !

Tuesday, November 29, 2016

ఎవుసమ్ 5

                                                    ఎవుసమ్ 5

మన మిద్దె తోట ను చూసెతందుకు పాత్రికేయ మిత్రుడు జయంత్ గారు వచ్చిండ్రు . రఘోత్తమ్ సార్ తన గూఫీ కి వీళ్ళు మనోల్లే అని చెప్పి శాంతింప జెసి నట్టు కాకపోయినా నా మొక్కలకు ఈ సారు మిమ్ముల జూసేతందుకే వచ్చిండని నోటి తోటి చెప్పలేదు గాని మా స్పర్శను బట్టి అవ్వే అర్థం జేసుకున్నయ్ . మెంతులు మారాకు వేసినయ్ తోట కూర సన్నగ నాజూకు వొతున్నది . ధనియాలు ఇంకా దినాలు లెక్కబెడుతున్నయ్ . రోజూ నీళ్లయితే చల్లుతున్న అని జయంత్ సార్ కు చెప్పిన.
ఆయిన వెళ్ళి పోయినంక నిన్న మొన్న రాయక పోతి గదా అనుకున్న. ఎందుకు రాయ లేదో మీతో గూడా పంచుకుందామని మొదలు వెట్టిన ఇగో ఇట్లా . అది 1966 అనుకుంటా ఎండా కాలం ల  మా ఊర సెరువు ఎండి పోయినంక శిగురు బాయిల దునికి ఈతలు గొడుతున్నం పోరాగాండ్ల మంత జమై. మా యీడు పిలగాడే ఒగాయిన మాతోటి గలిసి ఈత గొట్టే తండు.కు బాయి కాడికి వచ్చిండుకొత్తగ .  బాయి వాళ్ళ మామదే గనుక మాతోటి ఆయినకు ఏం పని అనుకుండో ఎందో గాని " గభేళ్ళు " మని బాయిల దునికిండు . ఒడ్డెంబడి  దరి మీద నిలబడి చూస్తున్న మేమంతాబిడియ పడి  పైకి ఎక్కినమ్. బట్టలు మార్చుకొని పొడి బట్టలు కట్టుకున్నం , వెళ్ళి పొయ్యేతందుకు తయారైతున్నం . బాయిల ఉన్న కొత్త పిలగాడు మీది నుంచి దునుకుదామని కావచ్చు పైకి ఎక్కిండు. మేమంతా వెళ్ళి పొయ్యేతందుకు సిద్దంగా ఉన్నం గదా, మమ్ముల జూసీ మీతో ఆడుకుందామని నేను వస్తే మీరెల్లి  పోతరా ? అన్నడు . పాపం అనిపించింది. అరె , మనం కూడా ఈనే తోటి కాసేపు ఆడుకుందాం అని వాళ్ళను ఆపిన. ఇగో గట్ల మొదలైంది మా డొస్తానీ. బాయిల ఈత గొట్టుడు నుంచి మొదలైన సోపతి సేను శెలుకల పొంటి దిరుగుడు, వరి కల్లాల కాడ గంటల కొద్ది ముచ్చట.


వరి పొలం బంగారి రంగుల పండిందంటే కోతకు వచ్చినట్టు లెక్క. మేమైతే పొలం కోత మొదలు వెట్టే నాడు కోడి పిల్లను కోసుకొని పోలి జేసుకుందుము . పొలం కోత అయి మెద ఎండినంక మెద గడుదురు . కట్టిన మెద మోపులను కల్లం లకు మోసుకొని తెద్దురు . కల్లం అంటే గుండ్రంగా వృత్తాకారం లో పారవట్టి నున్నగా చెక్కి ఉశికే లేకుంట చెత్త లేకుంట ఎత్తి పోసి పెండ తోటి అలుకుదురు . తెచ్చిన మెద తెచ్చినట్టు ఒక బండి గీరే అంటే బండి చక్రంమీద కొట్టే వాళ్ళు ,దాన్ని పంజగొట్టుడు అంటరు . రాలిన వడ్లను కొలుసుకొని ఇంటికి తెచ్చుకుందుం బండ్ల మీద బోరాలు వేసుకొని.పంజ గొట్టిన గడ్డిని  కుప్ప పేరుద్దురు గుండ్రంగా. అది అందరికీ రాకపోయ్యేది . అదో పెట్టుడు సుతారమే అప్పుడు. అట్లా కుప్ప వెట్టిన తర్వాత ఓ మంచి రోజు చూసుకొని బంతి గడుదురు. బంతి అంటే కొన్ని ఎడ్లను లైను గా ఉంచి తలుగుల తోటి ఒకదానితోటి ఇంకొకటి కలిపి బంతి ( గుంపు) గట్టి ఆ ఎడ్ల తోటి వరిని తొక్కిస్తే వరికంకులకు మిగిలి  ఉన్న వడ్లు కర్ర నుంచి వేరయ్యేటియి . నడుమ నడుమ ఎన్ను వొడుసుడు ఉంటది. బడి ఎగ్గొట్టి బంతి గొట్టుడంటే బలే సంబురమయ్యేది . వరి కర్రలకు ఉన్న ముల్లు గుట్టి మస్తు దురుద వెట్టేది . ఉడుకుడుకు నీళ్ళ తోటి తానం జెస్తుంటే అబ్బ ఎంత హాయిగ ఉండేదో పానానికి . అయితే ఆ బంతులు గొట్టే కాడికి ఆయన్ను వాళ్ళ మామ పంపేటోడు . సాయితకు నేను గూడా పోతుంటి అసోంటి జానీ డొస్తు సుడిగాల రమేశ్ ఇప్పుడు అమెరికల పౌరుడు. ఆయిన సొంతూరు కాళేశ్వరం. ఆయిన మొన్న వాళ్ళ అమ్మ చెన్నూరుల ఉంటే ఆమె కోసం చెన్నూరుకు వస్తే కలుద్దామని నేనూ పోయిన అందుకని రెండు రోజులు నాగా వడ్డది ఎవుసమ్ జేసుడు.

Monday, November 28, 2016

ప్రజల పై యుద్దాలు

                                         ప్రజలపై  - యుద్దాలు . 1

గత ఇరవై రోజులు గా భారత దేశ వ్యాప్తంగా నోట్ల రద్దు వలన ప్రజలపైనా ఏ విధమైన యుద్ధం జరుగుతున్నదో , దేశ వ్యాప్తంగా ప్రజలు తమ తమ దిన చర్యలను మానుకొని నోట్ల వేటలో ఏ విధంగా వీధుల వెంట బారులు తీరి విసిగి వేసారు తున్నారో చూస్తున్నాము. వామ పక్ష పార్టీల బంద్ గానీ ప్రధాన ప్రతిపక్షం ఆక్రోశం గానీ ప్రజలను ప్రభావితం చేయలేక పోయింది. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నాగూడా భరిస్తూనే ఉన్నారు తప్పితే ప్రభుత్వం పైన పెద్దగా తిరుగుబాటు తెలుపడం లేదు. సామాన్యంగా ప్రజలకు బాగా డబ్బు ఉన్న వాళ్ళ పైన సానుభూతి ఉండదు. ఈ నోట్ల రద్దు వలన వాళ్ళు చాలా నస్తపోతారని ప్రజలంతా భావిస్తున్నారు. కనుకనే నల్ల కుబేరులకు మోడి మంచి షాక్ ఇచ్చినాడని సంబుర పడుతుండ్రు. కానీ వాస్తవానికి ఇప్పుడైతే ఎక్కడా నల్లకుబేరులు నస్ట పడుతున్న దృస్టాంతా లెక్కడ మనకు కనిపించడం లేదు. భవిశ్యత్తులో ఏమి జరుగుతుందో చూద్దాం. అంతవరదాకా  మనలాంటి సామాన్యులు ఎదిరి చూడడం డప్ప ఎదిరించ లేని నిస్సహాయ పరిస్తితి.

ఇప్పుడిప్పుడే ఇంకో మాట కూడా విన వస్తున్నది. నగదు రహిత లావా దేవీలు, ఆస్తి పాస్తుల ఇ పాస్ , గుడ్ మంచిదే ఈ విధానాన్ని ప్రభుత్వం చిత్త శుద్ది తో అమలు చేయ గలిగేతే. మన దేశం లో చట్టాలు చాలానే ఉంటాయి కానీ అవి అమలుకు నోచు కోవు . ఈ నోట్ల రద్దు విషయమే చూడండి బొంబాయి కేంద్రంగా కొత్త రెండు వేల నోట్లు దేశ వ్యాప్తంగా పంపిణీ అయితూనే ఉన్నాయి. నల్ల ధనవంతులు వాళ్ళ ధనాన్ని బంగారం రూపం లో స్టిరాస్తుల రూపం లో ఇప్పెటికే ఎప్పుడో దాచుకున్నారని అంటున్నారు. కొద్ది గొప్ప ఉన్నోళ్ళు సైతం తమ పలుకు బడి ఉపయోగించి నస్ట నివారణ చర్యలు ఎప్పుడో తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నది మాత్రం మన బోటి సామాన్యులే.

నగదు రహిత లావాదేవీలు, ఇ పాస్ వ్యవస్తా ప్రవేశ పెట్టడాన్ని నేనైతే స్వాగతిస్తాను , అక్షరాస్యతే అంతంత మాత్రం అనే విషయాన్ని చర్చ కోసం కాసేపు పక్కన బెడుదాం. ఇప్పుడు లాభాలు కొందరికి  ఇబ్బడి ముబ్బడి ఎందుకు వస్తాయి, సేల్స్ టాక్స్ కోసం వాళ్ళు రశీదు ఇవ్వాలని చెప్పే వ్యవస్త ఎందుకు నిస్తేజంగా ఉంది? రోడ్లు బిల్డింగులు, ప్రాజెక్టులు కట్టే కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయల సొమ్ము ఎలా మిగులుతది ? వాటి పర్యవేక్షకులకు లంచాల రూపం లో లక్షలాది నల్లధనం , ఆ కాంట్రాక్టర్లు కట్టబెట్టిన రాజకీయ నాయకులకు కోట్లాది ఎన్నికల ఫండు ఎట్లా వస్తున్నది? కడకు మిలట్రీ యూనిఫాం, వాళ్ళ బూట్లు,వాళ్ళకు ఇచ్చే ఆహారం దగ్గర నుండి ఆయుధాల దాకా  నాసి రకం ఇవ్వబడి బడా ఆయుధ వ్యాపారులు బలిసి పోతున్నారు . పరిపాలకులు జరిగే లబ్ది జరిగి పోతున్నది. నగదు రహిత లావాదేవీలు నిజంగా చిత్త శుద్దితో అమలు జరిగితే ఇవన్నీ ఆగి పోవాలి . కానీ మళ్ళా దేశ భద్రత, అఫిషియల్ సీక్రెట్ అని సన్నాయి నొక్కులు నొక్కితే సామాన్యుడు బలిగావడం తప్పితే ప్రయోజనం ఉండదు.

అలాగే ఇ పాస్ విధానం వలను ఒక వ్యక్తికి ఉన్న సమస్త ఆస్తులు, అంటే భూములు, ఇండ్లు, ఫ్యాక్టరీలు, స్తిర చరాస్తులన్నీ ఆన్ లైన్ లో పెడితేనే వాటిని తాను మళ్ళీ ఎవరికైనా అమ్ముకోవడం గానీ మార్చుకోవడం గానీ ఉండే పరిస్తితి ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాంటి నిర్ణయమే గనుక ప్రభుత్వం తీసుకుంటే మనందరం దాన్ని ఆహ్వానిచాల్సిందే! ఆ నిర్ణయాన్ని పక్కా గా అమలు చేయాలని ఉద్యమాలు చేయాల్సిందే గానీ వద్దని ఎందుకు చెప్పాలి ఎవరైనా ?



Friday, November 25, 2016

ఎవుసమ్ 4

                                                   ఎవుసం  3
  
పొద్దున్నే మిద్దె తోట కు నీళ్లు పెట్టె టందుకు పొయిన . తొట్లల్లో చల్లిన విత్తనాలు కొన్ని పండ్లిగిలించి నా మొఖాన చూస్తూ పలకరిస్తున్నయి .    సంబురమైంది.
అంతకు ముందు రోజు మిరప మొక్కలకు వేప నూనె స్ప్రే చేస్తున్నప్పుడు మొక్కలను కిందికి వంచి,  పైకి లేపి,  చెట్టంతా తడిసె తట్టు వేప నూనె నీళ్లు. స్ప్రే జేసిన తీరు ఎట్లని పిచ్చిందంటే   చిన్ననప్పుడు తల అటు దింపి , ఇటు దింపి నెత్తంతా సమరు బూసి,  పిల్లగాండ్లకు    తలంటి స్నానం చేయించినట్టు అనిపించింది. పసి పిలగాండ్లల్ల ,  పెరిగే మొక్కలల్ల దినాం దిరిగే మనుషులకు ఆయిశ్శు పెరుగుతదని మా నాయిన జెప్పేటోడు. ఆ లెక్కన రైతులు , బడి పంతుళ్లు మంచి అదృష్ట వంతులన్నట్టు . ఇగ రైతులంటేనేమో సాంప్రదాయకంగా జూసినప్పుడు ,  తప్పని సరి పరిస్థితులలో మరో నైపుణ్యం రాక లేదా ఇంకో పనిజేసుడు ఆ రోజుల్ల నాదాన్ అనిపించి ఎవుసాయం జేసెటోల్లు. బడి పంతుళ్లు అంటెనేమో కొందరు ఖాయిష్ తోటి ఆ నౌకరికి వస్తే మరికొందరేమో ఉన్న ఊళ్లే నౌకరి , ఎవుసం కూడా జేసు కోవచ్చ్చు , ఓ పూట పోయినా పోకపోయినా   సదువు చెప్పినా చెప్పక పోయినా నడుస్తదని ,  ఖాయిష్ జేసెటోల్లు. మొత్తం మీద ఎట్లైతే ఏందీ గాని వాళ్లకు తెలువకుంటనే ఆయుష్ పెంచుకునే పనిల వఛ్చి పడ్డరు .

ఇగ రైతులైతేనేమో నీయవ్వ ఇంత బతుకు బతికి గా బండ కింది సావు జత్తమారా  అని మా చిన్నప్పుడు రైతు కుటుంబాల యువకులు బొగ్గు బాయి పనికి పోకపోదురు. సరే తర్వాత దానికే పోటీలు బడి ఉరికురికి గెలుసుకున్నరనుకోండ్రి .

ఇంతల రఘోత్తం రెడ్డి సారు నుంచి  ఫోన్, ఏమయ్యా ! తోట పని జేత్త లెవ్వా అని . అరె నేను రోజు చేస్తనే ఉంటి , ఈ సారు గిట్ల అంటడేంది అని మనుసుల అనుకుంటనే , అయ్యో సారు , తలిగిచ్ఛుకున్నప్పుడు తప్పుత దా ఇగో గిప్పుడే నీళ్లు జల్లఛ్చిన నీ ఫోన్ వచ్చింది అన్న.

మరి రాస్త లెవ్వు గద అన్నడు .
రోజు తోట పని జేసినట్టే , చేసిన పని అనుభవం గురించి రోజూ రాయాలే , అన్నడు .
మల్ల నాకు మా పెద్ద సారు పల్లి సీతారాం సారు యాదికొచ్చిండు.
ఈ సదువు , ఎవుసం , ఈ రెండు నన్ను చివరి దాకా విడిచి పెట్టి పొయ్యేటట్టు లెవ్వుగదా అనిపించింది .
సారూ ! రాస్తే రామాయణమంత అయ్యేటట్టు ఉన్నది గదా అన్న.
రాయి , రామాయణమే రాయి నిన్నెవ్వరు వద్దంటున్నరు అన్నాడు.
రాస్తమ్ సార్, కానీ చదివేటోళ్లు ఉండద్దా అన్న.
సరే ! ఏంరాద్దామనుకొంటున్నవ్ అని అడిగిండు.
అదే నా ఎవుసం 1 ల మా నాయిన మట్టి పిసికిన నా చేతులను అవుదు కాడికి తీసుక పొయ్యి ఎందుకు కడిగిండు? ఒకప్పుడు మా నాయిన జేసే కుల కశ్పి నాదాన్ అనుకోని భూమి జాగా కొని ఎవుసం జేసిండు. అసొంటిది  ఆయనే నన్ను ఎవుసం వద్దని సదువుకో బిడ్డా అంటున్నడు . కుల వృత్తులు , ఎవుసాయం కూలి పోయి ఉత్పత్తి తో సంబంధం లేని సేవా రంగమే గొప్పదనే అభిప్రాయం వెనుక సమాజం ఎంత తండ్లాట ఉందొ రాద్దామని , అన్న.
నిజమే ! పెంటయ్య గారూ ! అసలీ కుల వృత్తులన్నీ వ్యవసాయం కోసమే వఛ్చినయాయే . వ్యవసాయాన్ని బలోపేతం జేసే టందుకే ఈ వృత్తులన్నీ వఛ్చినయి. వ్యవసాయం పైన్నే ఈ వృత్తులన్నీ బతికినై. కానీ పాలించేటోళ్లు తలకిందులు ఆలోచనల ఫలితంగా వ్యవసాయాన్ని దెబ్బదీసి నందున ఇవ్వాల కులవృత్తులన్నీ కూలిపోయినయ్. అన్ని వృత్తులల్ల వాల్లే చొరబడ్డరు . పేదోనికి బతుకు దెరువు లేకుంటయ్యింది. సరే ! ఆ రాజకీయం పక్కన బెడుదాం . ఇప్పుడైతే మనటువంటి వాళ్ళు మన స్థాయి లో చిన్న చిన్న ఎవుసం జేద్దాం  ! పెద్ద పెద్ద లాభాలు ఉన్నయని నిరూపిద్దాం అన్నడు ..
భేష్ !  బాగున్నదికదా !