Friday, December 23, 2016

ఇంటి మీదెవుసమ్ 14

                                                      ఇంటిమీదెవుసమ్ 14


ఎన్ని ఇకమాతులు జేసినా అస్ నీ ! అటేటే , అంటానయి మొక్కలు గాని కాసంతన్న పండ్లిగిలిత్త లెవ్ ,పగులవడి నవ్వకుంటే మానాయే గాని అన్నా సుత ! పాసిపోయిన మొఖాలేసుకొని మొక్కలన్నీ అట్లనే బిర్రబిగుసక పోయ్యున్నై . ఎందుకీటికి గింతనన్న నెనరు లేకపాయే , నేను ఇంత పోదన జేస్తున్న గూడా అని మనుసు మదన వడుతున్నది . పాయే నెల రోజులు గడిచి పాయే . నీ మిద్దె తోట ఎట్లున్నదో సూద్దామని దోస్తులు రావట్టిరి . . ఇయ్యాలనే మా సుబ్బా రావ్ సార్ గూడా వచ్చిండు హన్మకొండ నుంచి. కానీ సూడ వొతే ఏమున్నది , ఊరి బైటి బోడ గుట్టల తీరుగ  కాయ లేని పువ్వు లేని కాకిరి బీకిరి శెట్లు . ఒక్క సారి మళ్ళా సిన్నప్పటి ఎవుసమ్ ముచ్చట యాదికి దెచ్చుకున్న.


కరీంనగర్ జిల్లా మంతెన మాదేపూర్ తాలుకాల ఉత్తరం దిక్కు గోదావరి నది పడుమటి నుండి తూర్పుకు పారుతుంటడి , మరో దిక్కు మంతెన మాదేపూరాన్ని వేరుజేసుకుంట మానేరు నది దక్షిణం నుంచి ఉత్తరానికి పారుతుంటది .ఒక వైపు కాటారం మండలం దామెరకుంట, మరో వైపు చెన్నూరు మండలం పొక్కూరు వద్ద మానేరు గోదావరి నదిల కలుస్తది .  అప్పట్ల ఇవి రెండూ  ఏడాదొకి పెన్నెండు నెల్లూ పారుతూనే ఉండేటియి తియ్యటి నీళ్ళ తోటి. దసర పండుగు వరకే   తెల్లజొన్న పోతలు అయ్యేది. అప్పుడు అంతా తెల్ల జొన్న చేన్లే . సత్తెపు పంట అందురు. ఒక్కొక్కటి ఇసుర్రాల్లంత ,  ఇసుర్రాల్లంత పెల్లలు , ఆ  పెల్లల్ల జొన్నలు వొస్తే , వానలు పడ్డా పడక పోయినా సల్ల ముంతలంత సళ్ళముంతలంత కంకు లు వెట్టేటియి కర్రలన్నీ. ఇగ నీళ్ళ వసతి ఉన్న కాడ మక్కజొన్నలు వేద్దురు . అప్పుడు మా ఉర్లే నాలుగు కుటుంబాలకే బావులు ఉండేటియి. ఈ రెండు నదుల నడుమ భూమి ఎండ గొడితే బర బర , వాన గొడితే బుర్ద, బుర్ద, . అయితే మా బాయి కి మోట వెట్టి మా నాయిన అప్పుడు మా ఊల్లే కొత్తగా మక్క జొన్నలు పెట్టిండు. మక్క జొన్నలు తియ్యగ ఉంటయని అవి తింటే వాతం అని వ్యవసాయ కూలీలు కైకిలికి (కూలికి ) మక్కలు తీసుకోక పోదురు . అప్పటికి మక్క జొన్న సాగు అధునాతనమైందన్న మాట .


ఇత్తునాలు మా నాయిన పుట్టినూరైన కల్వచెర్ల ( కమాన్ పూర్ మండలం ) నుండి తెచ్చిండట . సంకరం కాని విత్తనాలు , సారవంతమైన నేల ల సాలినంత పశువుల ఎరువు వేసిన భూమిల విత్తనాలు నాటేది . ఇక్కడ కూడా పెద్ద పెద్ద పెల్లలు ఉండేది. గోడ్డండ్లు వట్టి పెల్లలను మెత్తగా నలుగ గొడుదుము . అట్లా మెత్తగైన నేలల జానేడు జానేడు దూరం ల ఒక్కొక్క గింజ నాటుదుము . నాటినంక పాయలు దీసి ఓరలు గుంజి , కాలువలు జెసి నీళ్ళు గట్టెటిది . తెల్లారంగా పుంజులు గూసే యేళ్లకు మోటలు గడితే బాయిల నుంచి గోరెచ్చటి నీళ్ళు మోట బొక్కన నిండా వచ్చేటియి . మోట గొట్టుడు షురూ అయినంక కాలువ సాగే వరకు ఉడుకుడుకు మోట నీళ్ళ తోటి మొఖం గడుక్కోని , గప్పుడే సంటి నుండి మా నాయిన విండిన నురుగులు గక్కే గోరెచ్చటి  పాలు , ఇత్తటి పాల సర్వల నుంచి కంచు గిలాసల , గిలాస నిండ వొసిత్తే , కమ్మగ దాగి పెయ్యంత యెచ్చ జేసుకొని అగో గప్పుడు గాని నీళ్ళు గట్టెతందుకు మక్క తోటలకు పోక పోదుము .


మక్క పెరటిల ఉన్న పెల్లలు ఒరుసుక పోయి కాళ్ళ యేళ్ళ కు నెత్తుర్లు గారేది అప్పుడప్పుడు. మక్క కర్రల మీద రాత్రి కురిసిన మంచు తోటి  తడిసిన మక్క కర్రల ఏనెలు,  సెంపల పొంటి ఒరుసుక పొయ్యి బగ బగ మండుతుండే సెంపలు . పెల్లల కింద బతుకు జీవుడా అని దాక్కొనున్న తేలు పిల్లల్లు మోట నీళ్ళు తాకంగానే పెల్లల్ల నుంచి బైటికి వచ్చేటియి . అప్పుడప్పుడు కాళ్ళ పొంటి మీదికి ఎక్కేటియి .దెబ్బకు సలి దెంక పోతుండే .  తేలు కుట్టినట్టు మాత్రం యాదికి లేదు. అంత కస్ట పడి పంట దీసిన మనం గీయింత పడావు జేసె ఫలితం రాక పాయే గదా అని నీరస పడితే యెట్లా అని నాకు నేనే సమ్జాయించు కుంటున్న .


Thursday, December 22, 2016

ఇంటిమీదెవుసమ్ 12

                                                               ఇంటెమీదెవుసమ్ 12

ఇంటిమీదెవుసమ్ ల ఇత్తునాల్ వెట్టి నెల రోజులకచ్చింది. ఆకు కూరలు కంచం ల కొచ్చినయ్ గాని తీగ జాతులింకా తీగ సాగుత లెవ్. ఈ సలి కాలం పాపం వాటిని సాగనిస్తలేనట్టున్నది . ఓ తీగ సాగుతున్న ముచ్చట జెప్పుత సదువుండ్రి .

ఎవుసమ్ 10 సదివినంక చాలా మందే మాట్లాడిండ్రు. మా పిల్లలిద్దరు కూడా దక్కన్న రాజ్యం నుంచి సంబుర పడుకుంట వాళ్ళకు ప్రకృతి తోనున్న సంబంధం గురించి  రాసిండ్రు. అట్లనే మా పెద్దల్లుడు బుర్ర తిరుపతి గూడా రాసిండు. రఘోత్తమ్ రెడ్డి సారు తిరుపతి మీద కైతికాలు గూడా రాసిండు. ఈ సిల్ సిలా (పరంపర) మీద గూడా మనం రాయొచ్చు అని రఘోత్తమ్ రెడ్డి సార్ చెప్పిన తర్వాత ఇయ్యాల ఇదే ముచ్చట జెప్పుదామని రాస్తున్న.

చెప్పిన గదా! మాదో చిన్న పల్లెటూరని, పంట పొలాలున్న ఎవుసమ్ దార్ల కుటుంబమని. మా నాయిన తెలివి తోటి నన్ను డిగ్రీ చదివిచ్చిండు,దాంతోటి బడి పంతులు నౌకరొచ్చింది ఉన్నూరి పక్కన్నే. బడి, ఇల్లు ఎవుసమ్ నా ప్రపంచం.  పిల్లలను సేను సెలుకల పొంటి తీసుక పోతుంటి. భూముల గురించి పంటల గురించి వాళ్ళకు చెప్పేటోన్ని . సమాజం లో అనేక మార్పులు జరుగుతుంటాయి. మనం  నడిచి వస్తున్న దారి నేర్పిన అనుభవం  మేరకు  మనం వాటికి అనుకూలంగానో  ప్రతికూలంగానో మనిషిగా మాట్లాడకుండా ఉండలేము. అట్లా మాట్లాడి నందుకే ఒక్క నూకుడు నూకుతే ఇగో ఇట్లా కరీంనగర్ ల వచ్చి పడ్డ. ఇక్కడికి వచ్చినంక గూడా బడి, సంఘం అంట బాగనే తిరిగిన.  పిల్లల చదువుల గురించి పెద్దగా పట్టించుకున్నది ఏమి లేదు. కానీ సమయం చిక్కినప్పుడల్లా వాళ్ళను చుట్టూ కూచుండ బెట్టుకొని మా ఊరి ముచ్చట్లు, మా నాయిన కాలం నాడు వాళ్ళు కుటుంబాల కోసం ఎట్లా కస్టపడేదో , నేను గూడా ఐదో తరుగతి కాంగానే చిన్నతనం ల మా ఊరు నుంచి మంతెన కు వచ్చి వండుక తినుకుంట ఎట్లా ఇబ్బంది వడి సదువుకున్ననో చెప్పుతుంటి. నాకు వచ్చే జీతం  ఎంతో గూడా చెప్పేటొన్ని. దీంతో నా పిల్లలు ఎప్పుడు గూడా నాకు ఇది గావాలే అది గావాలే అని నన్ను ఒక్క నాడు గూడా ఇబ్బంది పెట్టక పొదురు . ( ఇప్పటి పిల్లల సంగతి జూస్తే అస్సలు పొలికే లేదు) .

ఓ సారి మా పెద్దోడు నేను మంతెన పక్కనున్న గోదావరి  ఔతలి ఒడ్డుకున్న మా అక్కోల్ల ఊరు పౌనూరుకు పోయినమ్. బాగా వర్షం పడ్డది. మేము తిరిగి మంతెనకు రావాలే . గంగోడ్డుకు వచ్చేవారకు గోదారి నిండుగ పారుతున్నది . మావోని ప్రశ్నలు జూడాలే ! ఈ నీళ్ళు ఎక్కడియి, వానన్టేంది , నీళ్ళు  ఎందుకు అటు ఉరుకుతున్నయి , ఇటెందుకు ( వెనుకకు ) రావు. నీళ్ళ మీది నుంచి మనం ఎదుకు నడిచి పోలేము, ఓడ అన్టేంది , అండ్లెక్కితే ఎందుకు మునుగమ్ మరి, ఇట్లా అనేక ప్రశ్నలు . ఓపికగా ఆన్నింటికి జవాబు చెప్పి ఇంటికి వచ్చినం . పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు ఏమ్మాట్లాడుకున్నారో గాని అబ్బా! మా నాన్నకు తెలిసినంత  ఈ బూమ్మీద మరెవ్వనికి తెలువది అన్న అభిప్రాయానికి వచ్చినట్టు ఆ తర్వాత నా చిన్న బిడ్డ జెప్పితే నాకు అర్థమయింది. ఎవ్వరికైనా నాన్నే తొలి గురువు అని ప్రాక్టికల్ గా నాకు అప్పుడు అర్థం అయింది. నా చిన్న బిడ్డ జవహర్ నవోదయ చొప్పదండి లో చదువుకునేది. ఆమెను ప్రోత్సహించే కొరకు చదువు, ప్రవర్తన, విలువల గురించి నాకు తోచినప్పుడల్లా ఉత్తరాలు రాస్తుండే వాణ్ని . ఆ ఉత్తరాలను తాను ఒక్కతే గాకుండా మిత్రులందరితో కలిసి చదువుకొనేదాట . మొన్న జులై నెలలో నేను తన వద్దకు పోయినప్పుడు ఆ విషయం గుర్తు జెసి ఆ ఉత్తరాలు ఇప్పటికీ తన నగల తో బాటుగా దాచుకున్నానని చెపితే నా కళ్ళల్లో నీళ్ళు ఊరినై .

రెన్డేండ్ల  కింద ఒక సారి నేను మా చిన్నోని దగ్గరికి పోయిన . అప్పటికి వాణ్ని చూడక మూడేన్ద్లు అయితాంది . . వాణ్ని చూడంగానే ఎక్కణ్ణుంచో చెప్పరాని దుఃఖం ముంచుకొనచ్చింది , వాణ్ని పట్టుకోని కడుపుల సొద కరిగి పోయేదాకా ఏడ్చిన . వాని కళ్ళల్లో గూడా కన్నీళ్లు. ఈ నీళ్లూరుడు కరిగి పోవడాలు లేకుండా ఉంటే మనుషులు మంచుగడ్డల్లాగా బిర్ర బిగుసుకొని ఉంటే మానవ నాగరికత ప్రేమ ఆప్యాయాలతో ఇలా సజీవ స్రవంతి లాగా ఉండజాలదేమో . మనుషుల మధ్యన ఈ సంబంధ బాంధవ్యాలు , ప్రేమానురాగాల పెనవేత ఎంత బలంగా ఉంటే కుటుంబ సంబంధాలు అంత బలంగా ఉంటాయి. కుటుంబాల వ్యవస్త ఎంత బలంగా ఉంటే సమాజాల జీవన శైలి అంత బలంగా ఉంటుంది. కనుక మనిషి ప్రథమంగా తనను తాను ప్రేమించుకోవాలంటే తాను ఆరోగ్యంగా ఉండాలి. అందుకు అవసరమైన ఆహారం, శారీరక శ్రమ చేయాలి. తనతో మొదలిడిన ప్రేమ తన పరిసరాలను , పక్కవాళ్లను నచ్చుకుంటూ , మెచ్చుకుంటూ విశ్వ వ్యాప్తం కావాలని ఆశిద్దాం.!

ఇంటిమీదెవుసమ్ 8&9

                                                          ఇంటిమీదేవుసం 8 & 9 .

ఈ రోజు వెల్డింగ్ జేసిన నిలువు పందిరి పోల్స్ ఇంటికి తీసుక వచ్చిన. మొత్తం 6 పోల్స్. ఒక్కొక్కటి 9 ఫీట్ల ఎత్తు . పైన బొమ్మ లాంటిది ఏదైనా పెట్టేతందుకు అడ్డంగా ఒక ఫీట్ ముక్కను వెల్డింగ్ చేయించిన. దీనికి గాను, ఇనుము ఖరీదు, 1800/ రూ : వెల్డింగ్ కు 700 కలిసి 2500 రూ: అయినయి. పోల్స్ పైకి తీసుక వెళ్ళిన తర్వాత పేయింట్   వేసి గాని గోడకు బిగించడం కుదురదు అని ఆలోచించుకుంటూ గతం లో ఎట్లా ఉండే ఇప్పుడు ఎలాంటి పరిస్తితి వచ్చిందీ అని ఒక్క సారి యాబై ఏండ్ల కిందటి  గత అనుభవం లోకి వెళ్ళిన.

మా ఊరు పాత కరీంనగర్ జిల్లా మహాదే పూర్ తాలాకా ధన్నవాడ. మా బంధువులు మహాముత్తారం లో కూడా ఉండేటోల్లు . అప్పుడప్పుడు బంధువుల ఇండ్లళ్ళకు ఎడ్ల బండి మీద పోతుంటిమి. అట్లా మహాముత్తారం  పోయేటప్పుడు మా ఊరు దాటంగానే చిన్న చిట్టడివి వచ్చేది. కారెంగా పోరుకలు, కోడిశే పోరుక అక్కడక్కడ తునికి చెట్లు పాల చెట్లు కనిపించేటియి . ఆ తర్వాత కొత్తపల్లి, మొలుగుపల్లి దాటిన తర్వాత అడివి వచ్చేది. ఆ అడివిల నుంచి పోతుంటే నడీ అడివిల ఎక్కడనైతే చెట్లు ఉండక పొయ్యేదో అక్కడ ఒక చిన్న ఊరు ఉండేది. అంటే అప్పుడు ఒక ఊరు కోసం అడివిని నరికి ఊరు పొందిచ్చుకుందురు . ఇండ్లంటే పెద్ద దూలాలు మొగురాలు ఉండేటియి  కాదు. పెండెలు అనే వాళ్ళు. పెండెలు అంటే మనిషి దండ దొడ్డు ఉండే చెట్ల కొమ్మలు. వాటితోటే ఇల్లు కట్టుకోని చుట్టూ పంజర పోరుక తోటి దడి పెట్టుకొని ఆ దడి కి చుట్టూ ఎర్ర మట్టి మెత్తి మీది నుంచి పూత పూద్దురు . ఎండాకాలం వేడి , దగడు గాలిరాకుంట సలి కాలం అయితే సలి వెట్టకుంట . పై కప్పు ఏమో మోతుకాకు, లేకుంటే తేకుటాకు పూసుకు ఆకుల  తోటి కప్పుదురు . కొంచెం ఉండగలిగినోళ్లయితే కోపిరి గడ్డి కప్పుదురు. ఆ ఇండ్లు సలి కాలం ల వెచ్చగ , ఎండా కాలం ల సల్లగా ఉండేటివి .అంత కంటే ఎక్కువ అడివిని వాళ్ళు నరుకక పొయ్యేటోల్లు . అడివిని కాపాడేది నిజంగా  ఆ ఊరు వాళ్ళే అయి ఉండేది.కానీ అడివి నరుకుతున్నారని వాళ్ళ మీద కేసులు అయ్యేటివి.  ఆడివికి కాపల ఉండే జంగలాత్ అధికారులే అడివిని పెద్ద పెద్దోళ్ళకు అమ్ముకుందురు.

అట్లా చుట్టూ అడివి నడుమ ఉర్లు ఉండే పరిస్తితి నుండి నాగరికత మనుషులకు అసలు అడువన్నదే లేకుండా  కనపడకుండా జేసె గదా అని ఆలోచిస్తుండగానే ,  అడివంటే అన్నం అని యాదికి వచ్చింది. అప్పుడు ఆడివికి పోతే తునికి పండ్లు, పాల పండ్లు, పరికి పండ్లు, బలుసు పండ్లు,మొర్రి పండ్లు, మస్తుగా దొరికేటియి . మొర్రి పండ్లను తిన్నంక ఎండబెట్టి పలుగ కొడితే సారె  పప్పు వచ్చేది. సణ్ణే గడ్డలు, బొట్టుకు గడ్డలు, దామెర గడ్డలు , పసుపు గడ్డలు, బెల్లం గడ్డలు, ఇట్లా అనేక రకమైన గడ్డలు దొరికేటియి. వాటిల కొన్నింటిని ఉడుక వెట్టుకొని తింటే మరికొన్నింటిని మంటల వేసి కాల్చుకొని తిందుము . మందు మాకు లేని సచ్చమైన తిండ్లు అప్పటియి. ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు వచ్చేవారకు పెట్టుబడి వచ్చింది.  దాంతో బాటే లాభం కోసం రకరకాల మోసాలు, వేషాలు వచ్చి చేరినయి .

నాడు ఇసొంటి బీర శెట్లు , పోట్ల, దోస, దొండ , కాయల కోసం భూమి మీదనే , అడివి నుండి పందిరి గుంజలు కొట్టుకోని వచ్చి పందిర్లు వేసుకునే టోల్లమ్ . అటువంటిది ఇప్పుడు ఇండ్ల పైకప్పుల మీద ఇనుప పైపుల తోటి నిలువు పందిర్లు వేసుకుంటున్నం. మనుషుల అత్యాశ, ప్రకృతికి శాపం అవుతున్నది.

ఇంటిమీదెవుసమ్ 11

                                                                ఇంటిమీదెవుసమ్ 11

మా సర్కస్ రింగ్ మాస్టర్ ( ఎనుకటి మా పెద్ద సారు తీరుగ ) కొరడా చడేల్ మనిపిచ్చిండు. అర్రెర్రే ఎనుకబడి పోతినా అని పొద్దుగాల యోగాసనాలు కాంగానే ఇగో ఇట్లా మొదలువెట్టిన . .ఇయ్యాల ఎవుసమ్ పని గూడ లేదు. ఈ సలి మంచు జెయ్యంగా తడి ఎక్కువై తున్నదని మడులను ఆరవెట్టి తవుటమ్ బెట్టిన  . ఇండ్ల ఈ కంప్యుటరొకటి సతాయిస్తున్నది ..

మా చిన్నప్పుడు మంతెనలకు ఓ సర్కస్ వచ్చుండే. అండ్ల రింగు మాస్టర్  గుండ్రటి సర్కిల్ ల హంటర్ వట్టుకొని ఉండేటోడు . తెల్లటి , ఎర్రటి , నల్లటి నాలుగైదు గుర్రాలు పరిగెత్తుకుంట వచ్చేటియి . రింగు మాస్టర్ హంటర్ చడేల్ మని కొట్టంగనే రింగు బయిట ఉన్న కర్ర ట్రాక్ మీది నుంచి జోరు తోటి గుర్రాల ఉరుకుడు మొదలయ్యేది. ఒక పొట్టి గుర్రం ట్రాక్ మీద కాసేపు ఉరికినట్టు జేసి రింగు మాస్టర్ తనను చూడనప్పుడు ట్రాక్ దిగి కింది నుంచి ఉరికేది . రింగు మాస్టర్ హంటర్ దీసుకోని దానెంట వడంగానే  ఆయనకు అందకుంట ముందుకు ఉరికి పోయి  ట్రాక్ ఎక్కేది. అది మళ్ళా మళ్ళా అట్లనే జేసేది . మేం పొరగాండ్లమంతా ఆ దొంగ గుర్రం ఎప్పుడు దిగుతదా అని చూసుకుంట అది ట్రాక్ దిగంగానే ఓ ఓ అని మొత్తుకుందుం . మా లొల్లికి హంటర్ మాస్టర్ వచ్చేకంటే ముందే అది ట్రాక్ ఎక్కేది.  దిగేది , మొత్తుకొంగనే ఎక్కేది మాకది ఓ గొప్ప ఆనందమిచ్చిన గుర్రం, పోరగాండ్ల ఆట.  తర్వాత తేలింది మాకు , పొల్లాగాండ్లను రప్పించే తందుకే ఆ గుర్రానికి అట్లా తర్ఫీద్ ఇచ్చిండ్రని.

నిన్న రఘోత్తమ్ రెడ్డి సార్ తోటి మాట్లాడిన తర్వాత రాసేది రాయవల్సింది చాలా ఉన్నదని  మల్లోసారి యాదికి వచ్చింది. మేము గూడా ఆకుల భూమయ్య సారుతోటి చాలా సార్లు చెప్పేటోల్లమ్ మీరు రాయండి సార్, రాయాలి సార్  అని. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆయన చాలా విషయాలు బిగ్ బ్యాంగ్ థీరి నుండి మొదలువెడితే దైవ కణం దాకా అరిటీ పండు ఒలిచి పెట్టినట్టు చెప్పేటోడు . ఆయన్ను మేమంతా నడిచి వస్తున్న పుస్తక భాండాగారం అందుము.ఆయన చెప్పే విషయాలు చాలా అథారిటేటివ్ గా సైంటిఫిక్ గాఉండేటియి . మీరు చెప్పేవి అన్నీ రికార్డ్ అయితే సమాజానికి చాలా ఉపయోగం అని మేము ఆయనతో అనేక మార్లు అనే వాళ్ళం .  రాద్దామ్ రాద్దామ్ అని చెప్పేటోడు. కానీ ఎల్లుండి డిసెంబర్ 23 న ఆయన 3 వ వర్దంతి.

ఇంటిమీదెవుసమ్ 10

                                                                  ఇంటిమీదెవుసమ్ 10 .

ఇయ్యాల మొక్కలకు నీళ్ళు జల్లంగ కొతిమీర మొక్కళ్ళ తెల్ల జొన్న కర్ర ఆగవడ్డది . దాన్ని జూడంగానే అబ్బ ఏం జెప్పలే తియ్యటి , తియ్యటి ముచ్చట్లు మతికి రావట్టినయి . మీతోటి పంచుకోవాన్నని మనుసు ఒక్కతీరుగ తండ్లాడుతాంది.

అయితే నాకున్నయన్ని పాత పాత ముచ్చట్లే . మీకు నచ్చినా నచ్చక పోయినా నేను సెప్పెటియైతే గవ్వే మరి. మా సిన్నతనం ల మా దండి సలి వెట్టేది సలికాలం ల. ఈ సలి కాలం అచ్చిందంటే మా ఊళ్ళల్లా అందరి ఇండ్ల ముందట నెగడి ఉండుడే . నెగడి అంటే పెద్ద పెద్ద మొద్దులు అంటే బాగా దొడ్డు ఉన్న దుంగలు , పొద్దుగూకిందంటేనే ఆ మొద్దులను ఒక్క దగ్గెరికి జరిపి నిప్పేద్దురు. జల్డిన అంటుకునే తందుకు సన్నపు శెక్క పేళ్లు పక్కల పొంటి పేరుద్దురు . మాపటీలి మా బువ్వలు దినుడు నెగటి కాడనే అయ్యేది. నిదురవొయ్యేదాక అక్కన్నే. అయితే ఈ నెగల్లు ఎడ్లు ఎవుసమ్ ఉన్నోల్ల ఇండ్లల్లనే ఉండేటియి . అడివిల నుంచి కట్టెలు తెచ్చేతందుకు ఎడ్ల బండ్లు కావలెనాయే. అయితే ఎద్లేవుసమ్ లేనోళ్లందరు ఈ నెగటి కాడికే వద్దురు. ఇగ అక్కడ నిద్రలు వొయ్యేదాకా సాత్రాలు ( కథలు ) జెప్పుడు ఉండేది. -ఒక్కొక్క సాత్రమ్ రోజుల తరబడి సాగేది. సాత్రాలు వినేతందుకు మేం పోరగాండ్లమంత పొద్దుగుకేతాళ్ళకే నెగడి కాడికి చేరే టోల్లమ్ .

తెల్లారే టప్పుడు ఓ దిక్కు బగ్గ సలివెడుతుంటే ఇంకో దిక్కు కోడి పుంజులు అవుతలి వాడలకు వినబోయే టట్టు కుక్కురూ కూ అంటే కుక్కురూ కూ అని ఇరామ్ లేకుంట కూసెటియి . ఈటితోటి ఇగ వశపడదని మళ్ళా నెగడి కాడికి చేరుదుమ్ . అప్పటికే లేసి బర్రెల పాలువిండి న మా  నాయిన పిట్టే కావలి పొమ్మని పోరువెడుతుండే. పిట్టే కావల్లప్పుడు ఎవుసదారుల కుటుంబాల ఇంటిల్లి పాది ఏదో ఒక సేను కావలికి పోకదప్పక పోయేది. కర కర పొద్దువొడిసే వారకు సేనులకు చేరకుంటే ఆ పూటకు రామ శిలుకలకు తిన్నన్ని జొన్న కంకులు . అందుకని ఆ సలికి గజ గజ వణుక్కుంట మెడకు అరి కట్లమ్ ( మెడ చుట్టూ , చేతుల చుట్టూ, పెయ్యన్త కప్పుతూ తల పై నుండి ఒక బట్ట కట్టుదురు ) కట్టుకోని సేనుకు చేరుదుము . ఒహోయ్ ! ఓడా ఓడా అనుకుంటా , రామ చిలుకలను, గొర్రే గొర్రె అనుకుంట గోర్రెంకలను జొన్న కర్రల మీద వాలకుంట ఒడిశెల తోటి కొడుదుము . పొద్దువొడిసిన కాన్నుంచి అంబటెల్ల దాకా పిట్టెలను ఆర్చి కొడుదుము. మబ్బు వడితే పగటెల్ల దాకా ఈ లొల్లి ఉండేది. పిట్టెలు అచ్చుడు మగ్గిన తర్వాత ఇంటికి వోదుము . అయితే బడికి పోబుద్ది కాన్నాడు పిట్టెలు బాగా వచ్చినయని సాకులు జెప్పి బడి ఎగ్గొట్టి జొన్న చేంలనే   ఉండి జొన్న కంకులతోటి అటుకులు కాపుకొని బుక్కుదుము కమ్మగ . ( అటుకుల ముచ్చట ఇంకా ఉన్నది రేపు చెప్పుకుందాం )

ఇంటిమీదెవుసమ్ 13

                                                             ఇంటిమీదెవుసమ్ 13 .


రెండు రోజులనుండి మొక్కలకు నీళ్ళు ఇవ్వకుండా ఆరబెట్టిన . ఒక రోజు తవటం బెట్టిన , మట్టి మొత్తం ఆర నిచ్చి ఆ తర్వాత నిన్న ఓరలు దొబ్బిన ( మా వైపు దొబ్బడం ఆంటే నెట్టడం ) ..ఓరల  ఫోటో పెట్టిన చూడండి.మొక్కలు అనుకున్న విధంగా పెరుగడం లేదన్న నా బాధను విన్న జయంత్ గారు , వర్మి కంపోస్ట్ నానబెట్టిన నీళ్ళు పోయండి ,సలైన్ ఎక్కించినట్టు ఉంటుంది అని అంటే ఇవ్వాళ ఆ నీళ్ళు పోసిన. చూడాలే మరి !


ఎవుసమ్ 10 పైన స్పందించిన మా చిన్నోని మాటలు తేప తేపకు యాదికొస్తున్నయి . " నీ చుట్టూ ఉన్న పోరాగాండ్లల్ల పోరాగాన్నై, మేం బతుకని బతుకును కండ్ల ముందుంచడం, సూడని తాతను సూపుల్ల నిలుపడం , పొగవట్టిన జొన్న కంకుల వాసన ఇప్పటికీ తాజాగా తన చుట్టూ ఆవరించి నట్టుండడం " . ఆ అనుభవాలన్నీ వాని నోటి నుండి రావడం నాకైతే గొప్ప అనుభూతే ! ఆనందం అయింది కూడా !  ఓ ముప్పైయ్యేండ్ల కిందటి ముచ్చట్లు ఇప్పటికీ పచ్చి పచ్చిగా ఆ మనిషి మస్తిష్కం లో ఎందుకు చిక్కుబడి పోయి ఉన్నట్టు ? ఆ అనుభూతి అతనికి ఎందుకు అంత ప్రీతి పాత్రమైంది? తన పెద్దలు ఆ అనుభవాలు కలిగి ఉన్నందుకేనా? లేక అంతకంటే ఎక్కువైన సామాజిక ప్రయోజనాలు  ఏమైనా ఆ అనుభూతుల వెనుక దాగి ఉన్నాయా ? అపురూపమైన ఆ యాద్ గార్లు, ఇప్పటికీ ఇంకా ఇంకా కావాలని ఏ మనిషైనా ఎందుకు కోరుకుంటాడు? ఏ మనిషైనా  తనదైనది ఏదో పోగొట్టుకొంటినా అన్న దేవులాట తోటి అతని లోపటి మనిషి ఏమైనా తండ్లాడుతడా ? నిజానికి ఈ ప్రశ్నలన్నీ మా చిన్నోని ఆర్తి వెనుక దాగి ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఈ ప్రశ్నలన్నింటికి జవాబులు మొత్తంగా నా వద్ద కూడా లేవు .


మానవ నైజం చాలా చిత్రమైంది. పాతది, ఉన్నది  ఉండాలే , కొత్తది వచ్చేది కూడా రావాలి అని కోరుకుంటుంది. అవును అట్లా కోరుకోవడం లో తప్పు లేదు. కానీ కొత్త ఆవిష్కరణ జరుగాలంటే పాతది విధ్వంసం కాక తప్పది. కానీ ఏ కొత్త ఆవిష్కరణ అయినా పాత దాని పునాదుల పైన్నే నిర్మించ బడుతుందని మరో చోట . నిదానమే ప్రధానం అని ఒక చోట, ఆలస్యం అమృతం విషం అని ఇంకో  చోట. ఇలా పరస్పర విరుధ్ధ సూత్రీకరణలు ఉంటాయి. అయితే మనం మన మన విచక్షణా పరిజ్ఞానం మేరకు ఏది ఎక్కడ అవసరమో అక్కడ వినియోగించుకోవాల్సి ఉంటుంది . .


మన సాంప్రదాయ వ్యవాసాయం వలన భారత దేశం లో పెరుగుతున్న జనాభాకు సరిపోయినంత ఆహార పదార్థాలు పండించలేమని ఎవరో శాశ్త్రాజ్ఞుడు చెబితే మన తాతల తండ్రుల నాటి పద్దతులు మరిచి పోయి పైసలున్నోల్ల బేపారం కోసం తయారైన సంకర జాతి విత్తనాలు, పురుగు మందులు, ఎరువు మందులు తయారు జేసుకున్నం. అవి తినీ తినీ అనారోగ్యాలు తెచ్చుకున్నం . ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళా పాత బాటవడుతున్నం .

విచక్షణ పరిజ్ఞానం ఉండి దాన్ని  ఉపయోగించుకునే పాటి చైతన్యం ఉన్న మన లాంటి వాళ్ళం   కొందరం ఇగో  ఇట్లా  త్రిశంఖు స్వర్గం తీరుగా ఆకాశం లో ఈ   మిద్దె తోటలు పెంచుతున్నాం . విశ్వామిత్రుని వలె ఎంతో పరిజ్ఞానం , పట్టుదల ఉంటేగాని ఈ ప్రక్రియ సాధ్య పడటం లేదు. . దీన్ని ఇలాగే కొనసాగిద్దాం . మనెంట ఓ పది మందిని వెంటేసుక పోదాం. !

Friday, December 16, 2016

ఇంటిమీదెవుసమ్

                                                          ఇంటిమీదేవుసం 8 &9


ఈ రోజు వెల్డింగ్ జేసిన నిలువు పందిరి పోల్స్ ఇంటికి తీసుక వచ్చిన. మొత్తం 6 పోల్స్. ఒక్కొక్కటి 9 ఫీట్ల ఎత్తు . పైన బొమ్మ లాంటిది ఏదైనా పెట్టేతందుకు అడ్డంగా ఒక ఫీట్ ముక్కను వెల్డింగ్ చేయించిన. దీనికి గాను, ఇనుము ఖరీదు, 1800/ రూ : వెల్డింగ్ కు 700 కలిసి 2500 రూ: అయినయి. పోల్స్ పైకి తీసుక వెళ్ళిన తర్వాత పేయింట్   వేసి గాని గోడకు బిగించడం కుదురదు అని ఆలోచించుకుంటూ గతం లో ఎట్లా ఉండే ఇప్పుడు ఎలాంటి పరిస్తితి వచ్చిందీ అని ఒక్క సారి యాబై ఏండ్ల కిందటి  గత అనుభవం లోకి వెళ్ళిన.


మా ఊరు పాత కరీంనగర్ జిల్లా మహాదే పూర్ తాలాకా ధన్నవాడ. మా బంధువులు మహాముత్తారం లో కూడా ఉండేటోల్లు . అప్పుడప్పుడు బంధువుల ఇండ్లళ్ళకు ఎడ్ల బండి మీద పోతుంటిమి. అట్లా మహాముత్తారం  పోయేటప్పుడు మా ఊరు దాటంగానే చిన్న చిట్టడివి వచ్చేది. కారెంగా పోరుకలు, కోడిశే పోరుక అక్కడక్కడ తునికి చెట్లు పాల చెట్లు కనిపించేటియి . ఆ తర్వాత కొత్తపల్లి, మొలుగుపల్లి దాటిన తర్వాత అడివి వచ్చేది. ఆ అడివిల నుంచి పోతుంటే నడీ అడివిల ఎక్కడనైతే చెట్లు ఉండక పొయ్యేదో అక్కడ ఒక చిన్న ఊరు ఉండేది. అంటే అప్పుడు ఒక ఊరు కోసం అడివిని నరికి ఊరు పొందిచ్చుకుందురు . ఇండ్లంటే పెద్ద దూలాలు మొగురాలు ఉండేటియి  కాదు. పెండెలు అనే వాళ్ళు. పెండెలు అంటే మనిషి దండ దొడ్డు ఉండే చెట్ల కొమ్మలు. వాటితోటే ఇల్లు కట్టుకోని చుట్టూ పంజర పోరుక తోటి దడి పెట్టుకొని ఆ దడి కి చుట్టూ ఎర్ర మట్టి మెత్తి మీది నుంచి పూత పూద్దురు . ఎండాకాలం వేడి , దగడు గాలిరాకుంట సలి కాలం అయితే సలి వెట్టకుంట . పై కప్పు ఏమో మోతుకాకు, లేకుంటే తేకుటాకు పూసుకు ఆకుల  తోటి కప్పుదురు . కొంచెం ఉండగలిగినోళ్లయితే కోపిరి గడ్డి కప్పుదురు. ఆ ఇండ్లు సలి కాలం ల వెచ్చగ , ఎండా కాలం ల సల్లగా ఉండేటివి .అంత కంటే ఎక్కువ అడివిని వాళ్ళు నరుకక పొయ్యేటోల్లు . అడివిని కాపాడేది నిజంగా  ఆ ఊరు వాళ్ళే అయి ఉండేది.కానీ అడివి నరుకుతున్నారని వాళ్ళ మీద కేసులు అయ్యేటివి.  ఆడివికి కాపల ఉండే జంగలాత్ అధికారులే అడివిని పెద్ద పెద్దోళ్ళకు అమ్ముకుందురు.


అట్లా చుట్టూ అడివి నడుమ ఉర్లు ఉండే పరిస్తితి నుండి నాగరికత మనుషులకు అసలు అడువన్నదే లేకుండా  కనపడకుండా జేసె గదా అని ఆలోచిస్తుండగానే ,  అడివంటే అన్నం అని యాదికి వచ్చింది. అప్పుడు ఆడివికి పోతే తునికి పండ్లు, పాల పండ్లు, పరికి పండ్లు, బలుసు పండ్లు,మొర్రి పండ్లు, మస్తుగా దొరికేటియి . మొర్రి పండ్లను తిన్నంక ఎండబెట్టి పలుగ కొడితే సారె  పప్పు వచ్చేది. సణ్ణే గడ్డలు, బొట్టుకు గడ్డలు, దామెర గడ్డలు , పసుపు గడ్డలు, బెల్లం గడ్డలు, ఇట్లా అనేక రకమైన గడ్డలు దొరికేటియి. వాటిల కొన్నింటిని ఉడుక వెట్టుకొని తింటే మరికొన్నింటిని మంటల వేసి కాల్చుకొని తిందుము . మందు మాకు లేని సచ్చమైన తిండ్లు అప్పటియి. ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు వచ్చేవారకు పెట్టుబడి వచ్చింది.  దాంతో బాటే లాభం కోసం రకరకాల మోసాలు, వేషాలు వచ్చి చేరినయి .

నాడు ఇసొంటి బీర శెట్లు , పోట్ల, దోస, దొండ , కాయల కోసం భూమి మీదనే , అడివి నుండి పందిరి గుంజలు కొట్టుకోని వచ్చి పందిర్లు వేసుకునే టోల్లమ్ . అటువంటిది ఇప్పుడు ఇండ్ల పైకప్పుల మీద ఇనుప పైపుల తోటి నిలువు పందిర్లు వేసుకుంటున్నం. మనుషుల అత్యాశ, ప్రకృతికి శాపం అవుతున్నది.