కమ్మరెంకయ్య మామ కండ్లల్ల తిరుగుతుండు.
రెండు మూడు రోజుల సంది కమ్మరెంకయ్య మామ మనుసుల తిరుగు తున్నడు . ఎన్నటి యాది, ఈ ముసులాయిన ఎందుకు ఊకూకే మతికి వస్తున్నడో అర్థం అయిత లేదు. అది నేను ఐదో తరిగతి సదివే టప్పుడు( 1960-61), అయితారం అచ్చినదంటే మా అన్నగాని గీత కత్తులకు సాటే పిచ్చె తందుకు( కత్తులకు పదను పెట్టుడు) కొలిమి కాడికి పోకట ఉండేది. మాపటీలి మండువ కాడికి పోతే మా అన్న నాకు కారం పుట్నాలు పెట్టిపిస్తడాయే మరి . కొలిమి కాడ ఆ రోజుల్ల ఎట్లు ఉండెనొ , ఆ వైభోగం ఏమై పాయే, ఎందుకట్లయ్యనో తెలిసిన విషయమే అయిన ఇంతగనం మనుసుల ఎందుకు మెసులు తాందో సుద్దామ్ అనుకుంటనే, ఇంతల నెట్ ఫ్లిక్స్ ల గెలుకుతాఉంటే నానా పటేకర్నటించిన మరాఠీ సినిమా “ ఆప్లా మానస్ “ కనిపిస్తే ప్లే పైన క్లిక్ చేసన. నానా పటేకర్ మహా నటుడు గదా , చూసిన కొద్ది సూడ బుద్ది అయింది. నా వయసు వారికి మా కొడుకులు కోడండ్లు బిడ్డలు కూడా కూడా చూస్తే బాగుండు అనిపిచ్చె టట్టు ఉంది.
కమ్మరెంకయ్య మామ ది నల్లటి దేహం, కొలిమి వేడికి కమిలి పోయిందో ఆయిన పుట్టుకే అట్ల ఉండెనొ కానీ అప్పటికే చేసి చేసి అలిసి పోయిన ఊగులాడే కండలు, ఎడుమ చేతుల పట్టుకారు తోటి అప్పుడప్పుడు కొలిమిల నిప్పులు, కాకుంటే బొగ్గులు ఎగేసు కుంట , కుడి చేతిల పెద్దదో లేకుంటే సిన్న దో సుత్తె పట్టుకోని, ఎప్పుడు కొలిమిల నిప్పుల తీరుగ ఎర్రటి కండ్ల తోటి విరామం లేకుంట పనిజేసుకుంట ఉండే టోడు . ఎండా కాలం అయితే బండ్లకు కమ్ములు గట్టుడు , వానా కాలం అయితే నాగండ్లకు కర్రులు అమిరిచ్చుడు , మాగిల నైతే గుంటుకులూ , ఇంకా గొడ్డన్లు , గడ్డ పారలు, పారకట్టెలు, కొడు వాండ్లు, అంగు పారలు , సిన్న పోరాగండ్ల కు బొంగురాలకు ముల్లులు, ముల్లు గట్టెలు, బురుద పొలాలల్ల తొడిమే తీసే తందుకు కురుపే ముల్లు గర్రలు, పెనాలు ,సరాతాలు , ఇట్లా చెప్పుకుంట పోతే శేతా డంత లిస్ట్ అయితది కానీ క్షణం రికాము లేకుంట పనిజేసేది. ఆయినను బువ్వ కూడా తినకుంటా ఎప్పుడు ఎవరో ఒకరు పానం మీద ఉందురు . ఇంత జేసినా ఆయిన ఇల్లు ఓ కమ్మల గుడిసె. ఆ గుడిసె ల కూడా దోశె డంత గడుకో, సారె డంత పప్పో ఉండేది గాదు . ఆయిన భార్య ఎప్పుడు కాలం చేసిందో తెలువది. ఒక్క కొడుకు. వాడు కూడా ఏగిలి మనిషి. ఏమి పని చేసే టోడు గాదు. బిడ్డ పుట్టు గుడ్డి. ఆమె కూడా ఇంత ఉడుక వెట్టి పెట్టె ఓసల లేని మనిషి. ఇంత పని జేసుకుంటా ముగ్గురికి ఉడుకేసి ఆయినే పెట్టాలే. ఎప్పుడన్నా మా ఇంటికి ఎంకయ్య మామ వస్తే మా అవ్వ ఇంత గడుక బోటేసి ఇంత సల్ల వోసి అంచుకు ఓ మామిడిగాయ తొక్కు పెట్టేది. నా కడుపు ఇయ్యాల మా నిండింది గానీ గుడ్డి పొరికి ఏమన్నా పెట్టవా అక్క ఆని ఏదో ఓటీ అడుక్కొని పట్టుక పోయేది. బహు కస్టంగా బతుకుతున్నా గూడా ఎంకయ్య మామ ఎన్నడూ గూడ కంట నీరు పెట్టంగా చూడ లేదు. పనే ఆయినకు అంత ఆత్మ విశ్వాసం ఇచ్చింది.
నేను సదువు కునే తందుకు ఊరిడిచి వచ్చిన తర్వాత ఎప్పుడో ఊరికి వచ్చినప్పుడు కమ్మరెంకయ్య మామ చని పోయిండ్ ని తెలిసింది. అందరూ మనిసి కింత ఏసుకొని దహన సంస్కారం చేసిండ్రట . ఆయన కంటే ముందే ఆ కొడుకు కూడా ఏదో జరమచ్చి చనిపోయినడట. ఆ గుడ్డామే కట్టె పట్టుకోని ఇల్లుళ్లు తిరుగుతూ అడుక్కొని తిని బతుకుతున్నదని తెలిసింది. ఆ తర్వాత ఆమె కూడా చనిపోయింది.
ఎంకయ్య మామ ఇంటి కాడ ఒక నల్ల తుమ్మ చెట్టు ఉండేది. దాని నీడకు కొలిమి ఉండేది. వానలు బాగా పడ్డప్పుడు రైతుల కొట్టాల కింద మామ కొలిమి పెట్టేది. మాగిల నేను కత్తులు సాటేసు క రాను పోతే తుమ్మ సెట్టు నీడకు కూసున్డే ది. తుమ్మ పూల మకరందం పీల్చుకోను తేనె టీగలు వస్తే ఆ రెక్కల సప్పుడు వినుకుంటా అట్లనే ఉంటే “పోడా ఇంటికి పోవా? ఇక్కణ్నే ఉంటవా? ఉంటనంటే సెప్పు కట్నం కింద నా కొలిమినిచ్చి గుడ్డి పొరిని నీకిచ్చి ధూమ్ ధామ గా పెండ్లి జేత్త “ అని బోసి నోటితోటి వక్కడ వక్కడ నవ్వేది. నిజంగనే సేత్తడు గావచ్చు అనుకోని కుడి సేతీలకు కత్తులు తీసుకొని , పిర్రల మీది లాగు ఇంకా కిందికి జారిపోకుంట ఎడమ సెయ్యి తోటి మీదికి గుంజు కుంట గుంజుకుంట ఎనుకకు మర్రి గూడ సూడ కుంట ఇంట్ల వడేదాక ఉరికచ్చే టోన్ని. ఆ గుడ్డి మనిషి చనిపోయిన తర్వాత ఆ గుడిసె ఉన్న జాగను పక్కనున్న వారు ఆక్రమించుకున్నరు. నిజాం సర్కార్ సాలార్ జంగ్ జమానల భూ సర్వే జరిపినప్పుడు ఊరుమ్మడి అవసరాల కోసం, సదరుల కొంత భూమి తీసి అవసరం అయిన వారికి ఇచ్చేవారు. అలా వృత్తి పనివారికి, గుడుల పూజారులకు గృహ అవసరాలకు కొంత భూమి ఇచ్చే వారు. అలాంటిదే ఈ కొలిమి కోసం తీసిన జాగ అయి ఉంటుంది. . ఊరికి ఏ కమ్మరి ఉంటే ఆయిన ఇల్లు వేసు కొనే తందుకు ఆ జాగా ఉంటది. మళ్ళా ఇంకో కమ్మరాయన అవసరం ఊరికి పడలేదు. ఆ భూమి మాత్రం ఎవరో ఒక్కరి సంతం అయిపోయింది.
నిజానికి నాకు కమ్మరెంకయ్య మామ ఇంత గనం మతికి వచ్చే తందుకు కారణం ఇది రాస్తుంటేనే స్పురించింది. ఊరు మొత్తం ఉత్పత్తి లో భాగమై( పొలం దున్నే కాన్నుంచి ,పంట కోసేదాక, కోసిన పంట అన్నం ముద్దై కడుపు నిండే దాకా సకల జనుల పనిముట్ల కు కారణమైన ) ఊరందరికి అవసరమైన మనిషి కి అంత కస్టమ్ లో కూడా కడుపు నిండుగా అన్నం పెట్టని నా ఊరు,ఆయన చస్తే ఆవల పారేసింది. ఉన్న భూమిని ఆక్రమించింది. కానీ అదే నా ఊరు, ఊరిలో మంచికి చెడ్డకు మంత్రం చదివే బాపనాయిన లేకపాయేనని యమ కలత చెంది పక్కూరు నుంచి బాపనాయినను రప్పించి ఆయినకు ఇల్లు ఇరువాటు సమకూర్చి ఆయనకు మృ స్టాన్న భోజన వసతి కలిగించి శీగ్ర గతిన తంతు లకు హాజరయ్యే దానికి ఇప్పుడో కారు కూడా కొనుక్కో గలిగిన సామర్థ్యాన్ని సమ కూర్చింది.
No comments:
Post a Comment