Sunday, March 19, 2017

ఇంటిమీదెవుసమ్ 36

                                                         

ఆకుకూరలు అన్నీ అయిపోయినై. మల్లా కొత్తగా విత్తనాలు వేసిన. విత్తనాలు మొలకెత్తుతున్నప్పుడు నీళ్ళు చేతి తో చల్లడం వలన అప్పుడే పుడుతున్న లేత మొలుకలు చనిపోతున్నాయని , నీళ్ళు నిదానంగా పడే కొరకు  వాటరింగ్ గార్డెన్ బకెట్ ఒకటి కొని తెచ్చుకోవడానికి గంజ్ లకు పోయిన . అక్కడ  మా డిగ్రీ క్లాస్ మెట్ దుకాణం ఉంటే అతని వద్ద కూర్చొని నా అవసరం చెప్పిన. ఆయన  కరీంనగర్ గంజ్ ల చాలా పేరున్న పెద్ద సేటు . చాలా రోజుల తర్వాత కల్సినవన్నా పొదువు గాని కాసేపు కూర్చో అని "  ఏమి చేస్తున్నవ్ రిటైర్ అయిన తర్వాత " అని అడిగిండు. ఇప్పుడైతే ఇంటిమీద నాలుగు మడులు తయారు జేసుకొని కూరగాయల సాగు  , ఎవుసమ్ జేస్తున్న అని చెప్పిన. ఒక్కటే నవ్వుడు. గీ ఎవుసమ్ జేసుడు ఏందన్నా! భలే గమ్మతి జెప్తున్నవ్ , అన్నడు . ఈ కూరగాయల మొక్కలు ఎంత గొప్పవో, ఆరోగ్యానికి ఎంత మంచివో, అమృత తుల్యమైన ఆహారం భుజించడానికి ఇవి ఎంతగా  ఉపయోగ పడుతున్నాయో చెపుతూ ఇవన్నీ మీకు తెలియవని కాదు గాని శ్రధ్ధ పెడితే ఎవరైనా ఈ పని చేయవచ్చు అని అంటూనే మార్కెట్ లో మనం కొని తెచ్చుకుంటున్న కూరగాయాలు, ఆకుకూరల పైన విషతుల్యమైన పురుగు మందులు, అడుగు మందులు మన ఆరోగ్యాలకు ఎంత హాని చేస్తాయో వివరించిన . మీకు ఇది గూడా తెలిసే ఉంటది ఎందుకంటే ఆ మందులు అమ్మే దుకాణాలన్నీ మన గంజ్ ల చుట్టుపక్కలల్నే ఉన్నయి గదా అని చెప్పిన.  , నిజమే ఈ విషయాలన్నీ ఇంత వివరంగా ఇంత చదువుకున్న నా లాంటి వాల్లకే ఇంతవరదాక పూర్తిగా తెలియదు. ఈ విషయాలన్నీ అందరికీ తెలియ జేసే కార్యక్రమం ఏదైనా ఉంటే బాగుండు అన్నడు. దాదాపుగా టి వి లల్లో వార్తా పత్రికలల్లో అనేకంగా వస్తున్నాయి, ఆ దృస్టి తో ఉన్న వారికే మాత్రమే అవి కనిపిస్తాయి కాబోలు అనుకున్నాను.  

ఆయన అన్నట్టు నిజంగానే ప్రభుత్వం అయినా ఈ విషయాలన్నీ ఒక ప్రచార కార్యక్రమం చేపట్టి వినియోగదారులకు చెప్పుతే బాగానే ఉంటది. ఉద్యాన వన విభాగం వాళ్ళు తోటలు పెంచుమని అంటున్నారు గాని ఆర్గానిక్ ఆహార పదార్థాలు తింటే మంచి రుచి తో బాటు ఆరోగ్యానికి ఎంతమంచిదో  వినియోగ దారులకు వివరిస్తే ప్రజలను దవఖానలకు దూరంగా ఉంచినవాళ్లు అవుతారు కదా అనిపించింది. కానీ సర్కారు అనేదానికి ప్రజల ఆహార ఆరోగ్యాల కంటే గూడా వాటితో వ్యాపారం జేసే వాళ్ళ ప్రయోజనాలు అంటేనే చాలా ఇస్టమ్ . ఎందుకంటే రేపు ఓట్లు వేసేది ప్రజలే అయినా అవి కొనుక్కోవడానికి అవసరమైన డబ్బులు ఇచ్చేది వాళ్ళే కదా మరి.

సరే సర్కారు సంగతి పక్కనబెడుదాం, మన ఆరోగ్యాని కోసం, మన ఆనందం కోసం, మన ఆహారం కోసం మనం ఎవరిమీదనో ఎందుకు ఆధార పడాలి ?  మనం పెరటి తోట, వంటింటి తోట, పెంచుకోవడం ఏమంత పెద్ద విషయం గాదు . ఎంత చిన్న జాగా ఉన్నా కూడా మనం ప్రయత్నం జేస్తే  మన కుటుంబానికి ఓ రోజుకు సరిపడా ఆకుకూర లభిస్తుంది. ఖాళీ ప్లాస్టిక్ బాటల్లు కూడా ఇక్కడ సద్వినియోగం జేసుకోవచ్చు. కావలసినది కాసింత శ్రధ్ధ్ద పట్టుదల మాత్రమే. అందుకని అవకాశం లేదనే కారణం తో ఈ ఆలోచన పక్కన పెట్టకుండా ప్రయత్నించి చూడండని  అందరితో కోరుతున్నా.

No comments:

Post a Comment