1980 -1990 ప్రాంతం లో నాతోబాటుగా ఊపాధ్యాయ ఉద్యమం లో కలిసి పనిజేసిన ఒక మిత్రుడు ఈ మధ్యన మా ఇంటికి వచ్చిండు. పాత రోజులను జ్ఞాపకం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా అయిపాయే గద అంటూ చాలా బాధ పడ్డడు . ఆ నాడు బడిలో పిలగాండ్లకు కొదువ లేకుండే, చాలినంత మంది ఉపాధ్యాయులు లేకుండిరి, చాలినన్ని తరగతి గదులు లేకుండే. అట్లాంటిది ఊరూరికి 3,4 తరగతి గదులు ఉన్న బడులు మూతలువడి పశువులకు, అసాంఘిక కార్యక్రమాలకు నెలవై పాయే అని మదన పడుతూ , ఆనాడు మనం ఎంత చెప్పినా, ఎహ ! వీళ్ళు గిట్లనే అంటరు అని లెక్కజెయ్యక పాయిరి . ఇదే ముచ్చట మనం ఇప్పుడంటే , మా తప్పు ఏమున్నది? సర్కారు విధానాలు చెయ్యంగనే బడులు మూతలువడుతున్నాయని బాధ్యత లేనట్టు మాట్లాడుతున్నరు అన్నడు. కాదా మరి సర్కారుది ఏమీ తప్పే లేదా అని నేను మాట్లాడంగానే గయ్యిమని ఇంతేత్తున లేసిండు. అరే భై సర్కారంటేనే గట్లుంటది , ఎంతసేపు ఒకవిషయాన్ని , ప్రజలకు అందకుంటా జేసి దాన్ని అందేటట్లు చేయడానికి తాను చాలా ప్రయత్నం చేస్తున్నట్టు నాటకం ఆడుతది , కానీ ఆ రంగం లో పనిజేస్తున్న వాళ్ళకు సోయి ఉండాలే కదా అన్నడు. సోయి అంటే ఏమి చేయాల్సి ఉండే అంటవ్ అన్నా. ఏ రంగం ఐనా బతికి బట్ట కట్టాలే అంటే ఆ రంగం లో ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు ఆధునికం అవుతూ తన ఆచరణకు పదును పెట్టుకుంటూ అమలు తీరు ప్రయోజనకంగా ఉందా లేదా అని తనకు తానే పరీక్ష పెట్టుకోవాలే అన్నడు. అంటే ఎట్లా అని అడిగిన.
రైతు మారుతున్న ఋతువులకు అనుగుణంగా తన పంటను మార్చుకుంటూ , ఆ పంట వేయడానికి దుక్కి తయారు జేసేకాన్నుంచి ఎలాంటి విత్తనం ఎంచుకోవాలే , అడుగు పెంట ఏమి వెయ్యాలే, ఎంత మాసర వెయ్యాలే, నీటి అవసరం ఎంత ఎన్ని రోజులకు పంటకు వస్తది , అన్న విషయాల పట్ల ఒక సమగ్రమైనా అవగాహనతోటి పంట వేస్తడు , ఏడాదికి ఏడాది పంట తీస్తనే ఉంటడు . ఒక్క ఏటి పంటకోసం పెద్దగా చదువుకొని ఒక రైతే ఇంత పకడ్బందీ గా పని జెస్తుంటే , అట్లాంటిది , సార్లు డిగ్రీలకు డిగ్రీలు పెద్ద పెద్ద చదువులు చదువుతరు , భావి తరాల కు జీవితాంతం పనికి వచ్చే చదువుల పట్ల ఎంత శ్రధ్ధ ఉండాలే అన్నడు. నిజమే కానీ వాళ్ళ చేతుల ఏముంటది చెప్పు, సర్కారు ఏది చెప్పుమంటే అది చెప్పాలే, ఎట్లా చెప్పుమంటే అట్లా చెప్పాలే, సార్లు లేకున్నా తరగతి గదులు లేకున్నా అతని బాధ్యత కాదుగదా అన్నాను. ఆయన నవ్వుకుంటా " బండి ఇరుగుతే ఎడ్ల గాయొచ్చు" అనుకునే పటికేనే ఇట్లా అయింది. అనుకుంటూ తన అనుభవం , తాను పనిజేసిన బడి, పిల్లల స్తాయి ఏకరువు పెట్టిండు. అది సరే కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనే ఒక జాడ్యం బాగా ప్రబలి పోయింది కదా అన్న. అవును అయితే కావచ్చు. ఇంగ్లీష్ మీడియం కంటే మాతృభాష లో చదువు ఐతే విద్యార్థులకు నేర్చుకోవడానికి ఎంత సులభమో ప్రజలకు అర్థం చేయించాలి . కాదు , కాదు మాకు ఇంగ్లీష్ మీడియమే కావాలని ప్రజలు కోరితే ఉపాధ్యాయులు ఆ మీడియం లో బోధించడానికి సిద్ధపడాలే గానీ మేము ఆ మీడియం లో చదువుకోలేదు, మేము చెప్పలేము అంటే ఇగో ఇట్లనే ఉంటది అన్నడు.
అది అంతా తేలిక అయిన విషయం కాదు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే డీ ఈడీ , బీ ఈడీ , లు కూడా వాటి విధానాలు మార్చుకోవాలే , ఎస్సీ ఆర్ టి , ఎన్ ఎస్ ఇ ఆర్ టి లు కూడా వాటి వాటి విధానాలు మార్చుకోవాలాయే , సర్కారు పనులు అన్నీ శాష్ట్రీయంగా ఉండాలే నాయే , అదే ప్రైవేట్ అంటే దాని యజమాని ఇస్టమ్ . సర్కారు అంటే అట్లా కాదుగదా ఆనంటూ దీనికి ఏమి జవాబు చెప్పుతవ్ అన్నట్టు ఆయన వైపుజూసిన .
ఇగో చూడూ! , పంట సరిగా వచ్చేటట్టు లేదూ, అనుకుంటే రైతు ఏమి జేస్తడు ? , దానికి పూతలువెట్టుకుంట, సవరదీసుకుంటా కూసోడు, ఏదైతే గదే ఆయే అని తెగువ జేస్తడు , పంటతోటే , భూమి తోటే లడాయి మొదలు వెడుతడు. ఈరుమారు మొత్తం ఉన్నకాడికి దున్ని పారేసి ఇంకో పంట వేసి ఫలితం రాబట్టే ప్రయత్నం జేస్తడు , ఇదిగూడా గంతే . సార్లు అందుకు తయ్యారుగుండాలే , గుండె ధైర్ణం కావాలే, అందరినీ కూడగట్టే నేర్పు ఉండాలే అని ముగించిండు .
No comments:
Post a Comment