కవి తన, నా మాట లోనే తాను ఈ కవిత్వం ఎందుకు రాస్తున్నాడో చెప్పుకున్నాడు. " తెల్లారింది మొదలు డబ్బుకోసం పరుగు పెడుతున్న మనిషిని మనీషిగా నడిపించాలంటే మరణాన్ని గుర్తుచేయడం మినహా మరో మార్గం లేదు " అంటాడు. సంపద, అధికారం, హోదా , వెంపర్లాట లో మనిషి తనకు తానుగా ధ్వంసం అవుతూ సాటి మనుషులకు భారమౌతూ సకల విలువలను సమాధి చేస్తూ "ఇదే బతుకంటే " అన్న భ్రమలల్లో బ్రతుకుతున్నమనుషులను నేలమీదకు దించి, అయ్యా ! బతుకంటే ఇది బిడ్డా , అని వెన్నుచరిచి చెపుతున్న పదాల సమాహారమే ఈ కవితల సముదాయం.
భూగోలాన్ని బడబాగ్ని ముంచెత్తినప్పుడు అంతా అయిపోయింది ఇక ఏమీ మిగులలేదని దిగులు చెందుతున్నతరుణం లో ఒక ఆశా కిరణమై " నేను లేనని, కానే కానని, కూలానని , కాలానని , ఏడ్చువారికెల్ల, ఇదుగో ఇక్కడే ఉన్నానని, ...సర్వవ్యాప్తమై , " అని అంటాడు కవి , నిరాశోపహతులకు ఒక ఆశా అంకురం గా ఉంది మొదటి కవిత ఉంది . " ఎవరు నేను?" లో మనిషి , జీవన యానాం ఎంత వ్యథ భరితమో వివరిస్తూ అవన్నీ దాటుకుంటూ " ఏ తీరం చేరాన్నేను , దారులన్నీ దాటుకుంటూ " అని తనను తాను ప్రశ్నించుకున్నట్లు ఉన్నా కూడా అది సమాజమంతటినీ ఇంత తండ్లాడి మీరు సాధించింది ఏమిటి అని ప్రశ్నించిన తీరు సూటిగా బాణం వేసినట్లు ఉంది. "నేను" కవితలో , ప్రతిమనిషి పంచభూతాల సృష్టి యని , " పదార్థ యదార్థ , శక్తిని నేను ", అంటూ సృస్తి రహస్యాన్ని అతి తక్కువ మాటల్లో , ఎంత గొప్ప భావాన్నైనా ఎంత సులభంగా వ్యక్తీకరించవచ్చో నిరూపించి చూపాడు. సైన్స్ స్టూడెంట్ కవి అయితే ఎలా రాస్తాడో మనం "ఎటుకేసి" లో చూడవచ్చు . ఏ సైన్స్ అయినా తత్వ శాస్త్రం లో ఎలా ఒదిగి పోతుందో చూపెడుతూ ,ఎటునుండి ఎటు పోతున్నానో ఎందుకు పోతున్నానో అంటూ తనను తాను ప్ర్సశ్నించుకుంటూ సమాజాన్ని ప్రశ్నిస్తున్నాడు.
"కుప్పకూలిన యంత్రాన్ని" . చాలా అత్యద్భ్తమైన కవిత. " బాలుడినై బతికి , యువకుడినై ఉరికి , నడివయసున నడిచి, అలసి సొలసిన, నా దేహమిప్పుడు , కుప్పకూలిన యంత్రం." ప్రాణి పుట్టుకను గమనాన్ని చాలా సహజంగా గతితార్కిక కోణం నుండి చక్కగా కవిత్వీకరించారు. ఆహారమంటే మన్నే, పంచబూతాలే, చలనం ,చైతన్యం కూడా పంచబూతాలే అని అరటిపండు ఒలిచి తినిపించినంత సులభంగా కవిత్వీకరించాడు, " మహా ప్రస్థానం" , చాలా గొప్ప వ్యక్తీకరణ. కండ్లముందర కదలి సాగుతున్న జీవన యానాన్ని కళాత్మకంగా , సృజనాత్మకంగా అదీ జీవ పరిణామక్రమ కోణం నుండి శ్రమ విభజన కోణం నుండి చెప్పడం గొప్పగా ఉంది. ముగింపులో "చల్లని కట్టెగా " మారకుండా ,చితిమంట లో చిదుగు అయినా బాగుండేది.
"నేనొకన్ని " కవితలో , ప్రశ్నిస్తూ పోవడం మాత్రమే గాదు అంటూ " చీలిన మనుషుల, పేలిన మనుషుల , అతికించాలని, బతికించాలని, విడిపించాలని , నడిపించాలని " పరిష్కారం కూడా చూపించాడు. "ఎక్కడ మీదైవమ్ " లో దేవుని ఉనికిని సూటిగా ప్రశ్నించి అందరినీ ఆలోచిపజేశాడు . రోజూ ఆయిన గుడి ముందు ఆయన నామ స్మరణజేస్తూ చిప్పవట్టుకొని అడుక్కుంటున్న ఒక్క యాచకుని బతుకు కూడా మార్చలేని ఆ దేవుడు నీవు ఒక్కరోజు గుడికి వెళితే నీ బతుకు మారుస్తాడా అన్న సినిమా డైలాగు ను గుర్తుచేస్తు " బ్రహ్మ లిఖితమని, కర్మఫలితమని. జాతక ముహూర్త , గ్రహ గృహ బలమని , స్వర్గం నరకం , మోక్షం అంటూ , రంభా ఊర్వశి, మేనకలంటూ , పబ్బం గడిపే , నయవంచకులకు," అని తెగడిన పదాలు చదువుతుంటే , సి. వి . రాసిన సత్యకామ జాబాలి కావ్యం ను గుర్తు జేసింది ఈ కవిత, " సోక్రటీసును వస్తున్నా " దీర్ఘ కవిత, ఆహా ! " కల్లబొల్లి పురాణాల, రంకుల రామాయణాల , బొంకుల జయభారతాల , బూటక జీబ్రేలు కథల, బైబిల్లా, ఖురానులా, గీతల భాగవతాల ను , త్యజియించితే తప్పు ఎట్ల " హేతువుకు అందని కాకమ్మ కథల ను పోస్ట్మార్టం చేసిన కవిత. అలాగే " లేడు రాలేడు " కవిత కూడా దేవుని ఉనికిని ప్రశ్నించేదే! ఒకవైపు దేశమంతా కాషాయీకరణ , సనాతన సంప్రాదాయం అంటూ తిరోగమణ బాట పడుతున్న చారిత్రక సందర్భం లో ఇలాంటి కవితా సంపుటి రావడం, 1970 దశకం లో విప్లవోద్యమాలు పురిటి నొప్పులు దీస్తున్నా కాలం లో సత్యకామ జాబాలి రావడం అనేవి ఆషామాషీ గా వాటికి అవే గాలిలో నుండి పుడుతున్నవి కాదు. మనుషుల దుఖం కుమ్మరాము మసిలినట్టు మసిలి వచ్చిన మనోవేదన ఫలితమే ఈ మహా పథం.
" అడివినంత నరికించి , కలపనంత దాటించి , గుట్టను రాళ్ళను జెసి. రాళ్ళను గుట్టలుగ పోసి , ఇసుకంతా కుప్పేసి. మట్టంతా పోగేసి, కుప్పెసీ పోగేసీ, ఊడ్చేసీ అమ్మేసీ, ఛీ ఛీ ఛీ ". ఆనంటూ , వనరుల ధ్వంసాన్ని కవి అసహ్యించుకుంటున్నడు . మార్కెట్టూ , దలాల్ స్ట్రీట్ మాయాజాలాన్ని కడిగేసినాడు. " బక్కచిక్కి బిక్కజాచ్ఛి , బతుకుతావుర పిరికిపంద, బలిసినోడి కాళ్ళకింద, బానిసోడా ఏమి బతుకుర." అని నిలబడి కలబడాలని కవి పిలుపునిస్తాడు. " ఎవడి పీఠం " , " చెప్పగలవా ? " లాంటి కవితలు అధికారాన్ని ప్రశ్నిస్తూనే , వ్యవస్తలోని అసమానతలను సహేతుకంగా ఎత్తిచూపుతున్నాయి. "పల్లె చితికి ." కవిత ప్రపంచీకరణ విధ్వంసం పల్లెను ఎలా కొల్లగొట్టిందో వివరిస్తుంది. మొప్పలు ఊపుతున్న యుధ్ధభయాన్ని గురించి ఉద్వేగంగా చెపుతాడు కవి." రణాపరావతాలు " లో యుధ్ధ రహస్యాలను బద్దలు కొడుతాడు. వసంత మేఘాన్ని వదిలి పెట్టలేదు, మల్లెప్పుడొస్తారని మరువకుండా పిలుస్తున్నడు.
బిగ్ బ్యాంగ్ థీరీ నుండి, పదార్థం పుట్టుకనుండి, డార్విన్ పరిణామ క్రమం నుండి,పదార్థమే ప్రధానం అనే సిద్ధాంతాల నుండి మొదలిడి , ఆత్మ పరమాత్మ సిద్దాంతాల నుండి ద్వైతం , అద్వైతం, క్రీస్తు, అల్లా ల దాకా భావం ప్రధానం అనే సిధ్ద్ధాంతాల వరకూ ఒక శాస్త్రీయమైన విశ్లేషణ తో సాగిన కవిత్వం ఈ మహాపథం అనే కవితా సంకలనం. కవితా వస్తువు అసామాన్యమైంది అయినప్పటికీ అందరికీ అందుబాటులోకి తేజూసిన ప్రయత్నం అభినందనీయం. భాష మాత్రం కొంత కఠినంగా ఉన్న మాట వాస్తవం. ఇంకా సరళమైన, అందరికీ అర్థమైన పదాలు వెదుకులాడి ఉపయోగించగలిగితే ఇంత కస్టపడి ఇన్ని విషయాలు ఒక్కదగ్గర చేర్చిన దానికి మరింత ప్రయోజనం ఉండి యుండేది. రాజ్యాంగం లో రాసుకున్న సమ సమాజ సాకారం కోరుకుంటున్న ఉద్యమాభిమానులు అందరూ తప్పకుండా చదువ వలసిన మంచి పుస్తకం " మహా పథం ". కవి చిల్ల మల్లేశం .
చాలా బాగా వివరించారు అన్నా..
ReplyDeleteచాలా బాగా వివరించారు అన్నా..
ReplyDelete